మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికారంలోకి వచ్చినట్టే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాము కూడా అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అక్కడ మేఘాలయకు… ఇక్కడ టీడీపీ అధికారంలోకి రావడానికి సంబంధం ఏమిటి? మోకాలికి… బోడి గుండుకు లంకె పెట్టినట్టు లేదు?. అవును ఈ లాజిక్కు ఏమంటే, మేఘాలయలో ఎన్పీపీ అధినేత సంగ్మాకు ఎన్నికల కన్సల్టెంట్గా ఉన్న రాబిన్ శర్మనే ఇక్కడ ఏపీలో టీడీపీకి కన్సలెంట్గా ఉన్నారు. అక్కడ ఎన్నికల ముందు బీజేపీని పక్కనపెట్టి ఎన్పీపీ విజయం సాధించినట్టే… ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలువబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన సంగ్మా, బీజేపీతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో… టీడీపీ తమ్ముళ్లకు ఇప్పుడు నోట మాటరావడం లేదు.
చట్టం… తన పని తాను చేసుకుంటుందనేది పాత మాట. చట్టం… అవసరాన్ని బట్టి తన పరిధిని కూడా మార్చుకుంటుందనేది తాజా మాట. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చర్య తీసుకోవాల్సిన నేత తమ వర్గం వాడైతే ఒకలాగా, వ్యతిరేక వర్గీయుడైతే మరొక లాగా స్పందించడం విమర్శల పాలవుతుంది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ను చంపుతామని చేసిన హెచ్చరిక వైరలయింది. దీనిపై కోమటిరెడ్డిపై చర్య తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి చెరుకు సుధాకర్ ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి తమ పరిధిలోకి రాడని తేల్చిచెప్పారు. అలాగైతే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మీ పరిధిలోకి రాకపోయినా గతంలో షోకాజు నోటీసు ఎలా ఇచ్చారని పార్టీ నేతలు కొందరు నిలదీస్తున్నారు.
కమిషన్ల సర్కార్గా ముద్రపడిన కర్ణాటకలో ఏ పనికి ఎంతెంత అనే మెనూ ఉంటుందని విన్నాం. పనులకే కాదు, పదవులకూ ప్రత్యేక మెనూ చార్ట్ ఉన్నట్టు ఆ పార్టీ నేతలే బయటపెట్టిన విషయం తెలిసిందే. సీఎం పోస్టుకు రెండున్నర వేల కోట్లు ధర పలికినట్టు స్వయానా ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో విషయాన్ని కూడా బయటపెట్టారు. క్యాష్ ఒక్కటే చాలదు.. అదనంగా కాళ్లు కూడా పట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కాళ్లు పట్టుకోవడానికి మనసు ఒప్పకనే తాను సీఎం కాలేకపోయానని, లేకుంటే ఎప్పుడో సీఎం అయ్యేవాడినని వాపోయారు.
– వెల్జాల