ప్రపంచవ్యాప్తంగానూ, దేశీయంగానూ క్రిప్టోకరెన్సీలు దశాబ్ద కాలం నుంచి ఆదరణ పొందుతున్నాయి. అసాధారణ, అనూహ్య లాభాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలలో ‘బిట్కాయిన్’ బహుళ ప్రాచుర్యం పొందింది. 2019 జనవరి 1న ఒక బిట్కాయిన్ విలువ సుమారు 3700 డాలర్లుగా ఉంటే, నేడు అది 57 వేల డాలర్లకు చేరుకున్నది. రెండేండ్లలోనే బిట్కాయిన్ విలువ అసాధారణంగా వృద్ధి చెంది మదుపరుల సంపదను 16 రెట్లు పెంచింది. ఈ స్థాయి రాబడిని ఏ చట్టపరమైన వ్యాపారం, వ్యాపార సంస్థ, పెట్టుబడి సాధనాలు సృష్టించలేవు. ఫలితంగా క్రిప్టోకరెన్సీ లోకి భారీగా పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి.
క్రిప్టో ఎక్స్ఛేంజీలు పెట్టుబడి ప్రక్రియను సాధ్యమైనంత సులభతరం చేసే విధంగా ట్రేడింగ్ డాష్బోర్డ్లను తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్లను ఉపయోగించి ప్రచార కార్యకలాపాలను సాగిస్తున్నవి. అలాగే క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఇన్స్టెంట్ నగదు రివార్డ్లు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి తక్షణ ఆకర్షణ సాధనాలుగా పనిచేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది భారతీయులు డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోతుండటం గమనార్హం.
2019 ప్రారంభంలో క్రిప్టోకరెన్సీలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. క్రిప్టో ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్ లావాదేవీలు జరిపే ఖాతాదారుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని బ్యాంకులకు సూచించింది. ఆ తర్వాత 2021 ప్రారంభంలో సుప్రీంకోర్టు తన తీర్పును రద్దు చేసింది. దీంతో మదుపరులు మళ్ళీ బిట్కాయిన్లలో పెట్టుబడి పెడుతున్నారు.
ప్రస్తుతానికి దేశంలో క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతపై స్పష్టత లేదు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్రిప్టోకరెన్సీ యజమానులు మనదేశంలో ఉన్నారు. ఇప్పుడు దేశ జనాభాలో 7.9 శాతం మంది క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్నారు. ఇంకా చాలా మంది అత్యధిక రిస్క్ కలిగిన క్రిప్టోలలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇప్పటి వరకు, సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ మాత్రమే బిట్కాయిన్ను చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించింది. క్రిప్టో ట్రేడింగ్ను పూర్తిగా నిషేధించిన ఏకైక దేశం చైనా. క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆలస్యం చేస్తే, తద్వారా బిట్కాయిన్లకు గిరాకీ పెరిగి వాటి వాల్యుయేషన్లో మరింత పెరుగుదలకు దారి తీస్తుంది. అంతేగాక ఆన్లైన్ మోసాలు పెరిగే ప్రమాదం ఉంది.
క్రిప్టోలు మున్ముందు ఆర్థిక నేరాలకు బీజం వేసి భవిష్యత్తులో నల్లధనం, పన్ను ఎగవేతలు, క్విడ్ ప్రోకో వంటి ఆర్థిక మోసాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో ఆదా చేయడానికి ప్రోత్సహించే విధంగా క్రిప్టోకరెన్సీపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలి. ఫలితంగా భవిష్యత్తులో ఆర్థికవ్యవస్థ పటిష్ఠమై ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పన జరుగుతుంది.
(వ్యాసకర్త: డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ , 81870 56918 సహాయ ఆచార్యులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్)