దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయచూస్తున్నారు.
దేశంలోని 88 బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రైవేటీకరించటానికి పూనుకున్నది. తెలంగాణలోని సింగరేణి పరిధిలో ఉన్న సత్తుపల్లి, కల్యాణిఖని, శ్రావణపల్లి, కోయగూడెం లాంటి 4 బొగ్గు బ్లాకులను వేలం పేరుతో అం బానీ, అదానీలకు అప్పజెప్ప జూస్తున్నది. ప్రభుత్వ నిర్వహణలో సమర్థంగా నిర్వహించబడుతూ, లాభాల బాట లో పయనిస్తున్న సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించకుండా సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నది. ముఖ్యంగా ఈ బొగ్గు బ్లాకుల విషయంలో రాష్ర్టానికో విధానాన్ని అవలంబిస్తూ కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తూ, తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది.
గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని బొగ్గు బ్లాకులను ఆయా ప్రభుత్వాలకే అప్పగించిన కేంద్రం, తెలంగాణలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వేలం పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలు తీర్చడంలో సింగరేణిది కీలక పాత్ర. ఒక్కసారి బొగ్గు బ్లాకుల నిర్వహణ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే ఆయా రాష్ర్టాల థర్మల్ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. తెలంగాణలో బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్ అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా బొగ్గు నిల్వలపై కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యం పెరిగి కృత్రిమ కొరతను సృష్టించే అవకాశమున్నది. తద్వారా బొగ్గు, విద్యుత్ ధరలు పెరిగి సామాన్యులపై మోయలేని భారం పడుతుంది. ప్రధానంగా విద్యుత్ మోటారు ఆధారిత వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారం పెరిగిపోయి చిన్నతరహా పరిశ్రమలు మూతపడే అవకాశాలుంటాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు కుంటుపడుతాయి. ఆర్థిక భారం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించే పరిస్థితి లేకుండా పోతుంది.
బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యమయ్యే కార్మికులు సాంకేతిక లోపాల వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీనికితోడు ప్రైవేటీకరణ జరిగితే శ్రమ దోపిడీ తీవ్రమవుతుంది. కార్మికుల హక్కులను కూడా హరించే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికి అప్పగించాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటికరించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాలు మూడు రోజులు సమ్మె చేయటం సమస్య తీవ్రతను చాటుతున్నది. ఈ సమ్మెలో బీజేపీ అనుబంధ కార్మిక సంఘం కూడా పాల్గొనటం విశేషం. పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు కూడా కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించటం గమనార్హం. బొగ్గు బ్లాకుల వేలం ఇంత చర్చనీయాంశమైనా బీజేపీ ఎంపీలు చూసీచూడనట్టుగా వ్యవహరించటం శోచనీయం. కొత్త సాగు చట్టాలను రద్దుచేసి రైతులకు క్షమాపణలు చెప్పిన మోదీ బొగ్గు బ్లాకుల వేలం విషయంలోనూ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరో పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుంది.
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ నాయకులు, కేయూ)
కొనుకటి ప్రశాంత్