ప్రజా కవి కాళోజీ చెప్పినట్టు ‘అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఇంకొక చోట’ అన్నట్టుగా ఉంది నేడు మనదేశంలో పరిస్థితి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్ల నిండా ఆహారధాన్యాలు పేరుకుపోయాయి. అత్యవసరాల కోసం ఎఫ్సీఐ గోడౌన్లలో 307 లక్షల టన్నుల గోధుమలు, బియ్యాన్ని నిల్వ చేస్తారు. ప్రస్తుతం ఎఫ్సీఐ పరిధిలో సెంట్రల్ పూల్ కింద దాదాపు 600 లక్షల టన్ను ల ఆహారధాన్యాలు ఉన్నాయి. అంటే కనీస నిల్వ కంటే 293 లక్షల టన్నులు అధికంగా ఉన్నాయి. అయినా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది పేదలు తిండి లేక మాడిపోతున్నారు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల పరిస్థితిని మదింపు వేస్తే భారత్కు 101వ స్థానం లభించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మన దేశం అధ్వానస్థితిలో ఉన్నది.
ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా వెల్లడైన వివరాలు కూడా మన దేశ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దేశంలోని సగానికిపైగా మహిళలు, పిల్లలు పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహారలోపంతో ఉన్న పిల్లల్లో మూడోవంతు మంది మనదేశంలోనే ఉన్నారు. ఎదిగే వయసులో ఉండే చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. రాబోయే తరమే అనారోగ్యంగా ఉంటే దేశం భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఎలా ఉంటుంది? దేశంలో ప్రజలు అర్ధాకలితో ఉన్నారని సర్వేలో వెల్లడవుతున్నా, మోదీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. సమ్మిళిత శిశు సంక్షేమ సేవలు, అంగన్వాడీ తదితర పాత పథకాలకు ‘మిషన్ పోషణ్ 2.0’ అంటూ కొత్త పేరు పెట్టిందే తప్ప, ఆ పథకాలను కూడా సమర్థవంతంగా అమలుచేయటం లేదు.
కేంద్రం నిరాసక్త ధోరణికి ఎఫ్సీఐ వైఖరి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ‘వడ్లు పండించాం, కొనుగోలు చేయండి’ అని తెలంగాణ రైతులు ఎంతగా అర్థిస్తున్నా ఎఫ్సీఐ ఒక ప్రణాళిక అంటూ లేకుండా వ్యవహరిస్తున్నది. గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటానికి ముందుకు రావడం లేదు. రైల్వే శాఖ వాగన్లు పంపించటం లేదంటూ పనికిమాలిన సాకులు చెప్పటం ఎఫ్సీఐ స్థాయి సంస్థకు తగదు. కరోనా నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో కోట్లాది మంది ఉపాధి కోల్పోయి పేదరికంలోకి జారుకున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో పేదలను ఆదుకోవటానికి కేంద్రం ఎఫ్సీఐ గోదాముల్లో పేరుకుపోయిన ధాన్యాల నిల్వలను పంపిణీ చేయటంపై దృష్టి పెట్టాలి. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తీసుకొని వివిధ రాష్ర్టాల్లో అన్నార్థులకు పంచేవిధంగా చొరవ చూపాలి. తద్వారా అటు పౌష్టికాహార లోపాన్ని అరికట్టవచ్చు. ఇటు రైతుల శ్రమకు తగిన ఫలితం లభించేలా చేయవచ్చు. ఇప్పటికైనా మోదీ సర్కారు రాజ్యాంగబద్ధమైన విధుల్ని నిర్వహించాలి. మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి.