ఆంధ్ర ప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వర్షాలు, వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగుతోంది. దిగువన డ్యామ్ నిర్మాణంతో కాపర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర్ (నదిలో స్థిరంగా ఉండే నీళ్లు) భద్రాచలాన్ని చుట్టుముడుతున్నాయి. ముంపు మండలాల్లోనైతే పరిస్థితి మరీ దయనీయం. వరదలు వస్తే 30 రోజులు జనావాసాలు జలమయమై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయడానికి పనిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కళకళలాడే పల్లెలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
ఈ ఏడాది జూలై నెలలో వచ్చిన వరదల వల్ల భద్రాచలం వద్ద 71.3 అడుగుల ఎత్తు వరకు వరద నమోదైంది. భద్రాచలం వద్ద 22 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. 1986లో వరదలు వచ్చినప్పుడు 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. 49 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం అంచనాతో 150 అడుగుల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం రామాలయానికి కూడా ముంపు ముప్పు తప్పదని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి, కేంద్రానికి తెలిపింది.
భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. భద్రుడి తపస్సుకు మెచ్చి శ్రీరాముడు ఇక్కడ సీతా లక్ష్మణ సమేతంగా వెలిశారని స్థల పురాణం చెబుతోంది. భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోయాడని పురాణ కథనం. తన హృదయ స్థానంలో రాముడు కొలువైన ఆ పర్వతానికి భద్రాద్రి అని పేరు వచ్చింది. భక్తులు ఇక్కడి రాముడిని ప్రేమగా వైకుంఠ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రికి ఇంతటి ఘన ప్రాశస్త్యం ఉంది.
గోదావరి వరదలతో పాటు దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల కూడా భద్రాచలం వద్ద నీటి తాకిడి పెరిగిందని ఇంజినీర్లు, జల వనరుల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 67 అడుగుల ఎత్తులో వరద ప్రవా హం కొనసాగితేనే రామాలయం వెళ్లేందుకు వీలు లేకుండా అష్ట దిగ్బంధనమవుతుంది.
పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణం మునిగిపోతుందని భద్రాచలం విస్టా కాంప్లెక్స్తో పాటు దుమ్ముగూడెం వరకు ముంపు ప్రభావం ఉంటుందని గతంలో పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖ క్రాస్ సెక్షన్ డేటా సంయుక్త సర్వే చేసి ఈ ముంపు ప్రభావాన్ని తేల్చాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం ఆదేశించింది. ఆ ఆదేశాలను అనుసరించి గోదావరి, కిన్నెరసాని నదులు, ముర్రేడు వాగు పరీవాహక ప్రాంతాల్లో వరద, ముంపు ప్రభావంపై తెలంగాణ, ఏపీ ఇంజనీర్లు వేర్వేరుగా సర్వే చేశారు. క్రాస్ సెక్షన్ డేటా సర్వే ముంపు పరిస్థితి అధ్యయన నివేదికను ఆనాడే సీడబ్ల్యూసీకి పంపారు. పోలవరం డ్యామ్ భూకంప ప్రభావిత జోన్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ డ్యాం బ్రేక్ అనాలసిస్ చేయలేదు.
చారిత్రక భద్రాచలం పట్టణానికి తీవ్రమైన ముప్పు ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు, సీడబ్ల్యూసీకి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి పట్టు విడవకుండా తెలంగాణ ప్రభుత్వం లేఖలను రాస్తూనే ఉంది. అయినా బ్యాక్ వాటర్ అధ్యయనంపై ఏపీ, కేంద్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తంగా మార్చిన ప్రాజెక్టు సామర్థ్యం మేరకు ముంపుపై అధ్యయనం చేయించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. ఇదే విషయాన్ని వివరిస్తూ 2016, నవంబర్ 4 న పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసింది. స్పందన రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే 2017లో ఐఐటీ హైదరాబాద్తో పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించింది. సామర్థ్యం మార్పు వల్ల అదనంగా పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించి, మరింత లోతుగా అధ్యయనం చేయించాలని నిర్ణయించింది.
భద్రాచలంతో పాటు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో పోలవరం బ్యాక్ వాటర్ లెవల్ను కంప్యూటేషన్(గణన) చేయాలని 2019, ఫిబ్రవరి 12న పుణెలోని కేంద్ర జల, విద్యుత్ శక్తి పరిశోధన కేంద్రానికి విజ్ఞప్తి చేయగా అందుకు ఆ సంస్థ నిరాకరించింది. ఇప్పటికే సీడబ్ల్యూసీ అదే తరహా అధ్యయనం చేసిందని వెల్లడించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముంపునకు సంబంధించి సరైన అధ్యయనం జరగలేదని పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీని అనేకసార్లు ప్రశ్నించింది, కేంద్రాన్ని నిలదీసింది. ఎప్పుడూ శ్రీరాముడి గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో ఉన్న రాముడు మునుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పటికే మన ఏడు మండలాలను, లోయర్ సీలేరు ప్రాజెక్టును తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు భద్రాచలం రాముడిని, ఇక్కడి ప్రజలనూ ముంచుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపుపై అధ్యయనం కోసం, రక్షణ చర్యలను చేపట్టేందుకు తెలంగాణ సర్కారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేయాలి.
భద్రాచలానికి పోలవరం ప్రాజెక్టు వల్ల పెను ప్రమాదం పొంచి ఉంది. బ్యాక్ వాటర్, డ్యామ్ భద్రత విషయంలో సరైన అధ్యయనం చేయకుండానే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వల్ల లక్ష ఎకరాలు మునిగి పంట నష్టాలు కూడా భారీగా ఉంటాయి. రాముడి ఆలయ ప్రాంతంతోపాటు, బూర్గంపహాడ్, పర్ణశాల మునిగిపోతాయి.
పోలవరం ప్రాజెక్టును తొలుత 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్ చేసి, ఆ తరువాత 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది కేంద్ర జల సంఘం. కానీ పెంచిన సామర్థ్యం మేరకు వాటిల్లే ముంపుపై అధ్యయనం చేయలేదు. ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో నిర్మిస్తున్నారు. ఆ మేర ధవళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యాన్నీ పెంచాలి. అయితే ఏపీ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టడం లేదు.
– పువ్వాడ అజయ్ కుమార్
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి)