కుల జనగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ విషయంలో కసరత్తు జరుపుతున్నారు. జనగణనలో ఓబీసీల జనాభాను ప్రత్యక్షంగా లెక్కించాలన్న డిమాండుకు పలు రాజకీయపార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఉన్నది. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్ కూడా ఈ డిమాండ్కు మద్దతు తెలిపాయి. విచిత్రమేమిటంటే, ఓబీసీ జనగణన జరుపుతామని 2018లో అంటే లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు నాటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్వయంగా ప్రకటించారు. కానీ, అధికారం మళ్లీ దక్కిన తర్వాత యథాప్రకారం బీజేపీ మాట మార్చింది.
దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ది కూడా బీసీలపై గోడ మీది పిల్లి వాటమే. దశాబ్దాల పాటు బీసీల కులగణన ఈ డిమాండ్ను ఆ పార్టీ పట్టించుకోలేదు. మన్మోహన్ ప్రభుత్వం 2011లో సామాజిక, ఆర్థికసర్వే పేరుతో కులగణన చేపట్టినా ఆర్థికపరమైన వివరాల్నే తప్ప కులాలవారీ వివరాల ను వెల్లడించలేదు. ఇంతకూ కులాల వారీ లెక్కలు ఎం దుకన్నది అసలు ప్రశ్న. భారత్ను కులరహిత సమాజంగా, ఆధునిక దేశంగా నిర్మించాలంటే కులాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించాలి. అది జరగాలంటే, ఏయే కులాలు రాజకీయం గా, ఆర్థికంగా, సామాజికంగా ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలి.
దేశంలో ఓబీసీల జనాభా 52 శాతం అని 1932లో బ్రిటిష్ హయాంలో జరిగిన జనగణన వెల్లడించింది. నాటికీ నేటికీ భారత జనాభా నాలుగింతలు పెరిగింది. ఓబీసీల జనాభా కూడా కచ్చితంగా పెరిగి ఉంటుంది. కానీ, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో వారి వాటా 21.5 శాతం మాత్రమే. ఇది వారికిచ్చే రిజర్వేషన్ 27 శాతం కన్నా తక్కువ. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కలుపుకొంటే ఓబీసీల వాటా 10 శాతం కూడా ఉండదని అంచనాలున్నాయి. దేశ జనాభాలో సగానికన్నా ఎక్కువ ఉన్న ఓబీసీలకు ఉద్యోగాల్లోగానీ, రాజకీయాధికారంలోగానీ సరైన ప్రాతినిధ్యం లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుందన్నది మౌలిక ప్రశ్న. మన రాజ్యాంగం ప్రవచిస్తున్న సమానత్వానికే ఇది సవాల్ వంటిది. ఆర్థిక అంతరాలను తొలగించాలన్నా ఏయే కులాల వద్ద సంపద కేంద్రీకృతమవుతున్నది, ఏ కులాలు నిరుపేదలుగా ఉంటున్నాయో తెలియాల్సిన అవసరం ఉన్నది. కుల జనగణన అనేది ప్రజాస్వామిక డిమాండ్. మతాల పేరిట రాజకీయం చేసే బీజేపీ.. ఈ డిమాండ్ను విచ్ఛిన్నకరమైనదిగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నది. 1990లో ఓబీసీ రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడే ఆ పార్టీ అయోధ్య పేరిట మత రాజకీయం ప్రారంభించి తర్వాతి కాలంలో అధికార సోపానాన్ని అధిరోహించింది. ఈ దేశాన్ని కులవ్యవస్థగానే నిలిపి ఉంచాలనేది ఆ పార్టీ భావన అని అర్థమవుతున్న ది. ప్రజాస్వామికవాదులు దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.