దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అస్త్రం ప్రకంపనలు పుట్టిస్తున్నది. మేధావుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నది. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు.. అంటూ కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీని ఎలా నడుపాలో తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఆ మాట అనగలిగారు.
తెలుగు నేలపై పుట్టి దేశ రాజకీయాల్లో మార్పు కోసం కదులుతున్న తొలి జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ కావడం మనకందరికీ గర్వకారణం. అది కూడా దేశ ప్రగతికి, ప్రజల అభ్యున్నతికి కంకణబద్ధులం అవుతామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. గడిచిన 75 ఏండ్లలో తెలుగు నేలపై వందకుపైగా రాజకీయ పార్టీలు వచ్చాయి, వెళ్లాయి. కానీ, సుధీర్ఘ ప్రస్థానం సాగించి, ప్రజల ఆదరాభిమానాలు పొందిన పార్టీలు రెండే.. ఒకటి తెలుగుదేశమైతే.. రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత బీఆర్ఎస్). అయితే, టీడీపీ కన్నా కూడా టీఆర్ఎస్కే అనేక ప్రత్యేకతలున్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టే నాటికి ఆయనకు అర్థబలం, అంగబలం, సినిమా నటుడిగా విశేష గుర్తింపు ఉన్నాయి. కానీ, కేసీఆర్ ఒక సాదాసీదా వ్యక్తి. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించాలన్న పట్టుదలతో పార్టీని స్థాపించారు.
జాతీయపార్టీ అయిన బీజేపీ బలం, బలగం అండగా ఎదిగిన నరేంద్రమోదీకి ఉన్న అనుకూలతలు నాడు కేసీఆర్కు లేవు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం స్టాలిన్లకు ఉన్నట్లుగా రాజకీయ వారసత్వం లేదు. చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేసి సీఎం కాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను తీర్చేందుకు పార్టీ పెట్టి, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, స్వరాష్ర్టాన్ని సాధించి ఆ తర్వాత ప్రజాతీర్పుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. దేశంలో కేసీఆర్ వంటి నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. 2001లో కేసీఆర్ ఒక్కడిగా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆయనకు ఎదురైన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. టీఆర్ఎస్ పార్టీ మఖలో పుట్టి పుబ్బలోనే మాయమవుతుందన్నారు. అర్థబలం, అంగబలం లేని కేసీఆర్ ఆ పార్టీని ఏం నడుపుతారన్నారు. తెలంగాణ వాళ్లకు రాజకీయ పార్టీ నడపడం చేతకాదన్నారు. వాటన్నింటినీ అబద్ధమని నిరూపిస్తూ, టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నది. నేడు పార్టీలో 70 లక్షల మంది కార్యకర్తలున్నారు. రెండుసార్లు అధికారం చేపట్టింది. 102 మంది ఎమ్మెల్యేలున్నారు. 16 మంది ఎంపీలున్నారు. దేశ రాజధానిలో సొంత కార్యాలయం ఉన్న తొలి తెలుగు పార్టీగా గుర్తింపు సాధించింది. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. ప్రజల మన్ననలు పొందడం అంత ఈజీ కాదు. దీని వెనుక కేసీఆర్ అవిరళ కృషి ఉన్నది. ఆయన తన మేధస్సును కరిగించి బీఆర్ఎస్ను ఈ స్థాయిలో నిలబెట్టారు.
రాజకీయంలోనే కాదు.. పాలనలోనూ కేసీఆర్ విశిష్టత సాటి లేనిది. ఎనిమిదిన్నరేండ్లలోనే దేశం మెచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చారు. తెలంగాణ మాడల్ నేడు దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, టీఎస్ఐపాస్, ఆసరా పెన్షన్లు, పెట్టుబడులు, శాంతిభద్రతల నిర్వహణ.. ఇలా అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది మన రాష్ట్రం.
మరోపక్క దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నిర్లజ్జగా అబద్ధాలతో రాజ్యం నడుపుతోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పొట్టకొట్టేలా వ్యవసాయ చట్టాలను చేసింది. దేశ ప్రజల సంపదగా ఉన్న ఎల్ఐసీ సహా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోంది. దేశ సంపదను అంబానీ, ఆదానీలకు అప్పనంగా అప్పగిస్తున్నది. ఆకలి సూచీలో అట్టడుగు స్థానానికి దేశం వెళ్లింది. నిరుద్యోగం పెరిగిపోతున్నది. ద్రవ్యోల్పణం గరిష్ఠానికి చేరుకున్నది. వీటిని మరిపించటానికి మతాల మధ్య మంటలు పెట్టి రాజకీయాలు చేస్తున్నది బీజేపీ. దీనిని ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ-టీంలా మారింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో అంతరించిపోతున్నది. ఇక మిగిలినవన్నీ చిన్న చిన్న పార్టీలే. ఈ నేపథ్యంలో దేశాన్ని బాగు చేసేందుకు ఎవరో ఒకరు కదలాలి. ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ దేశం కోసం నడుం కట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎట్లాగైతే కొట్లాడిందో.. ఇప్పుడు దేశం కోసం కొట్లాడేందుకు కదులుతోంది బీఆర్ఎస్.
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం’ అని సీఎం కేసీఆర్ తరచూ చెప్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ విఫలమైందని అందరూ చూస్తూ ఉంటే దేశానికి దిక్కేది? అందుకే ‘దేశానికి దారి దీపాన్నై నేను వస్తా’ అని కేసీఆర్ కదిలారు. ఆయన తలపెట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలి. దేశంలో విశృంఖలంగా అమలవుతున్న బీజేపీ అరాచక పాలన పోవాలి. ప్రజా పాలన రావాలి. దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలున్న ప్రతి ఒక్కరూ కేసీఆర్కు మద్దతుగా నిలవాల్సిన తరుణమిది.
75 ఏండ్ల తర్వాత కూడా ప్రజల కోణంలో ఆలోచన చేయకపోతే దేశానికి ఏమాత్రం మంచిది కాదు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు మేలు జరుగాలంటే ప్రజల కోణంలో, ప్రజల జీవితాల్లో మంచి మార్పు తెచ్చే రాజకీయం రావాలి. అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యం. మార్పు కోసం బయలుదేరిన కేసీఆర్ వెంట నడుద్దాం.
– రజితారెడ్డి
70954 45550
(వ్యాసకర్త: తెలంగాణ జాగృతి నాయకురాలు)