‘ఉద్యమ పంథా వీడను. నా ప్రాణం పోయినా ఎత్తిన జెండా దించను, ఎత్తిన పిడికిలి దించను. నేను దృఢమైన సంకల్పంతో ఉద్యమాన్ని ప్రారంభించా, కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. అంతవరకు అలుపెరగక పోరాడుతా’ అని 2001లో టీఆర్ఎస్ను ప్రారంభించిన సందర్భంగా నాటి ఉద్యమనేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన తెలంగాణలోని సబ్బండ వర్ణాలను ఒక్కటిచేసి పద్నాలుగేండ్ల పాటు పోరాడారు. ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేశారు.
నాటి ఉద్యమసారథి కేసీఆరే, నేటి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలేమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ‘రైతుబంధు’, ‘మిషన్ భగీరథ’ వంటి తెలంగాణ పథకాలను ‘ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన’, ‘హర్ ఘర్ జల్’ వంటి పేర్లతో కాపీ కొట్టి మరీ అమలుచేస్తున్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ఇతర రాష్ర్టాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ఎన్నో సార్లు ప్రశంసించిన విషయం తెలిసిందే.
భారతదేశం వెనుకబాటుతనాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా రూపాంతరం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రకటిస్తున్న లక్ష్యాలు జతీయస్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు దశాబ్దాల తర్వాత ఈ దేశంలో మార్పు కోసం మన కేసీఆర్ మళ్లీ తెలంగాణ ఉద్యమకాలం నాటి పిలుపునిస్తున్నారు. ఈ దేశంలోని రైతులు, శ్రామికులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్నివర్గాల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్తున్నారు. ఈ దేశ ప్రజలంతా అండగా ఉంటే జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గుణాత్మక మార్పును సాధించి చూపిస్తానని భరోసా ఇస్తున్నారు. డబ్బు ఐదేండ్ల స్వతంత్ర భారతంలో డబ్బు ఏండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీన్ని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఇరుగు, పొరుగున ఉన్న దేశాలు అనేకరంగాల్లో దూసుకుపోతుంటే, భారత్ మాత్రం పాలకుల వైఫల్యం, విధానపర లోపాల వల్ల వెనుకబడిపోతున్నదన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్న తీరు యావత్ దేశ ప్రజానీకాన్ని ఆకట్టుకుంటున్నది.
కొన్ని దశాబ్దాల కిందట భారత్ కన్నా పేదరికం అనుభవించిన దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని మించి అభివృద్ధి సాధించాయి. మన దేశం వెనుకబడటానికి పాలకుల అసమర్థతే కారణమంటున్నారు కేసీఆర్. ఆయన ప్రసంగాలను వింటున్న దేశ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశానికి అనేక అనుకూలతలున్నాయి. అనేక సహజ వనరులు, 41 కోట్ల ఎకరాల సాగుభూమి, అపార మానవ వనరులున్నాయి. అందులో దేశానికి యువశక్తి ఎక్కువగా ఉన్నది. కానీ, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో 75 ఏండ్లు ఈ దేశాన్ని పాలించిన పాలకులు విఫలమయ్యారు. వారికి సరైన దృక్పథం లేకపోవడం వల్లే దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందం టూ అనర్గళంగా మాట్లాడుతూ కేసీఆర్ దేశ ప్రజల మనసులను చూరగొంటున్నారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కనీసం తమ కుటుంబాలను కూడా పోషించలేకపోతున్నారు. దేశంలో ఎక్కువ మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి, ఈ దేశ పాలకులు కార్పొరేట్లకు చేస్తున్న ఊడిగం మానేసి, ఈ దేశ వ్యవసాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వ్యవసాయం లాభసాటి కావాలి. ఉత్పాదకత పెరగాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
‘తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నట్లుగానే దేశవ్యాప్తంగా ‘రైతుబంధు’ అందిస్తాం. ఈ దేశంలో రైతుల బతుకులకు భద్రత లేదు. కాబట్టి తెలంగాణ వలె దేశంలోని రైతులందరికీ కేంద్రమే ప్రీమియం చెల్లించి, ‘రైతు బీమా’ పథకాన్ని అమలుచేసి, రైతుల కుటుంబాలను ఆదుకునేలా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తున్నది’ అని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు దేశంలోని రైతుల్లో భరోసాను పెంచుతున్నాయి. కేసీఆర్ చిత్తశుద్ధి, బీఆర్ఎస్ పార్టీ సంకల్పసిద్ధితో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు.
తక్కెళ్లపల్లి రవీందర్ రావు
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)