వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. పోటెత్తిన ప్రవాహమైన పిల్ల కాలువతో కొనసాగుతుంది. భూమిని, ఆకాశాన్ని ముంచెత్తిన ప్రళయ తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ఆరంభమవుతుంది. అదిగో ఆ ఒక్క అడుగు పడనే పడింది. ఆ ఒక్క పిల్ల కాలువ సాగనే సాగింది. ఆ ఒక్క చినుకు నేలకు రాలనే రాలింది. మొన్న ఖమ్మం గుమ్మంలో స్వాగత తోరణాలు కట్టుకున్న భారత రాష్ట్ర సమితి నేడు పూణెలో పునాదులు వేసుకొని ఉత్తుంగ తరంగ కెరటంలా ముందుకు దూసుకుపోతున్నది. అదానీలకు, అంబానీలకు అంటకాగుతున్న ప్రజాకంటక బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ పెను తుఫాన్ సృష్టించబోతున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటూఇటుగా ఆరు దశాబ్దాలు పాలించి దేశాన్ని అధోగతికి చేర్చిన కాంగ్రెస్, దశాబ్దకాలంగా దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వం తోడు దొంగలుగా రోజురోజుకు అప్పుల కుప్పను పెంచారే తప్ప, ఎనాడూ అభివృద్ధిని పంచలేదు. తరగని సిరిసంపదలున్న దేశాన్ని దరిద్రంతో నింపారు. దేశ సంపదను అనుయాయులకు అస్మదీయులకు అమ్మిపెట్టి నిలువు దోపిడీ చేశారు. ఇన్ని జీవనదులు పారుతున్న దేశంలో సాగుకు, తాగేందుకు నీళ్ల కరువు తీరలేదు. ఇంత పంట పండి గోదాముల్లో ధాన్యం నిలువ ఉన్నా దేశంలో ఆకలి కేకలు ఆగలేదు, ఆకలి చావులు తప్పలేదు. ఒక విజన్ లేని నాయకుల పాలనలో జనాభా, నిరుద్యోగం, పేదరికం పెరిగింది తప్ప పెరగని ఆర్థికస్థితితో దేశం సంక్షోభంలో చిక్కుకున్నది. దేశ వనరులను అమ్ముకుంటూ, దూరదృష్టి లేని ఈ ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, లేని సమస్యలను తెచ్చిపెట్టి భావోద్వేగాలతో ఆడుకుంటూ దేశాన్ని యుద్ధరంగం చేస్తున్నారు. మతం మత్తులో కుంభకోణాల్లో ముంచి ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేసి అందినంత అప్పులు చేసి ప్రపంచ మార్కెట్లో దేశాన్ని అమ్మకానికి పెడుతున్నారు. మరీ అదానీలకు అండగా ఉంటున్న ఈ బీజేపీ ప్రధానీ పదేండ్ల పాలనలో ఎన్నడూ లేనంతగా దేశాన్ని దివాలా తీయించారు.
నేడు అన్నమో రామచంద్రా అంటూ ఆదుకునే వారికోసం చూస్తున్న దేశ చిత్రపటాన్ని ఒక్కసారి చూస్తే గుండె చెరువవుతుంది. ప్రగతిని పట్టించుకోని పాలకులను చూస్తే పట్టరాని కోపం వస్తుంది. భారతదేశంలో నలభై ఒక్క కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉన్నది. గాలి, నీరు, వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండి సమశీతోష్ణ మండలంగా పేరున్నది. అయినా అందుబాటులో నీరు లేక, సమయానికి కరెంటు రాక అందుబాటులో ఉన్న సాగు భూమిలో సగం కూడా సాగు చేయడం లేదు.
దేశంలో లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తున్నది. అందులో దాదాపు 70 వేల టీఎంసీల నీరు సాగుకు, తాగుకు అందుబాటులోకి వస్తుంది. అందులోంచి కనీసం సగం నీరు కూడా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వాలు నేడు దేశాన్ని పాలిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు కనీసం తాగునీరులేక అరిగోస పడుతున్నారు. 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్తు దేశంలో అందుబాటులో ఉంటే అందులో సగమైనా వాడుకలోకి తేవడంలే దు. విచిత్రమైన విషయమేమంటే దేశంలో ఇప్పటికీ కరెంటు లేని ఇండ్లున్నాయి. తాగునీ రు రాని ఊర్లున్నాయి. సాగునీరు చేరని బీడు పొలాలున్నాయి. అన్నం ముద్ద దొర్కక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలున్నాయి. ఇదీ నేటి బాధల భారత దేశ భవిష్యత్తు చిత్రపటం.
ఇప్పుడు దేశంలో ఉన్నట్టే ఎనిమిదేండ్ల కింద సరిగ్గా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. రెండు నదులు నిండా పారిన సాగునీరుకు కరువే. కరెంటు ఇక్కడే ఉత్పత్తి అయినా పల్లెల నిండా చీకటే. రైతులు సబ్స్టేషన్ల దగ్గర ధర్నా చేసి పాణాలు పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అప్పులతో రైతులు ప్రాణాలు తీసునేవారు. అదిగో ఆ సంక్షోభ పరిస్థితి నుంచే టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది. ఉద్యమ సారథి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ఒక చిన్న పాయలా పిడికెడు మందితో మొదలైంది. ఇప్పుడు బీఆర్ఎస్ లాగే అప్పుడు మొదలైన టీఆర్ఎస్ను చూసి కూడా మఖలో పుట్టి పుబ్బలో పోతుందని చాలామంది నవ్వుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం నవ్వులపాలు కాలేదు. నాలుగు కోట్ల నాలుకలను ఏకం చేసి సమైక్య పాలనను తరిమికొట్టింది. కేసీఆర్ వ్యూహ ప్రతివ్యూహాల ముందు ప్రత్యర్థుల ఎత్తులు చిత్తులు కాక తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం రాక తప్పలేదు. నవ్వినవారే నాలుగేండ్లు తిరిగేసరికి ‘జై తెలంగాణ’ అనక తప్పలేదు.
ఇప్పుడు అదే నాయకుడి ముందుచూపుతో దేశం కోసం,దేశ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ దార్శనికతను, తెలంగాణ అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుల దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే దమ్మూ, ధైర్యం బీఆర్ఎస్కు ఉన్నదని భారత ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు.
అప్పుడు ఆగమైపోతుందన్న తెలంగాణ ఇప్పుడు దేశానికే మాడల్గా మారింది. గ్రామగ్రామాన ‘మిషన్ భగీరథ’తో తాగడానికి నీళ్లున్నాయి. కాళేశ్వరం జలాలతో పొలాలు నిండుగా పారుతున్నాయి. పండిన పంటను ఒక గింజ లేకుండా ప్రభుత్వమే కొంటున్నది. అంధకారమైపోతుందనకున్న తెలంగాణ కోతల్లేని వెలుగు జిలుగుల తెలంగాణగా మారింది. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలు ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి. ‘రైతుబంధు’, ‘దళితబంధు’ పథకాలు తెలంగాణలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కేసీఆర్ సారథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఒక ఏనిమిదేండ్ల పసిగుడ్డే అయినా దేశానికి ఒక ఐకాన్గా మారింది. దూరదృష్టి గల నాయకుడి విజన్తో అభివృద్ధిలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్నది. ఇప్పుడు అదే నాయకుడి ముందుచూపుతో దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ దార్శనికతను, తెలంగాణ అభివృద్ధిని చూసిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుల దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపే దమ్మూ, ధైర్యం బీఆర్ఎస్కు ఉన్నదని భారత ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు.
అప్పుల బాధతో ఆగమైన భారతదేశ రైతు లు మాకూ ‘రైతుబంధు’ కావాలంటున్నారు. దగా పడ్డ దేశ దళితులు తెలంగాణ వలె మాకూ ‘దళితబంధు’ కావాలని కోరుతుతున్నారు. వనరులున్నా, వానలున్నా బీడుపడి నెర్రలువారిన దేశంలోని పంటపొలాలు నదుల నీళ్లను మలిపి తడపమంటున్నాయి. కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలతో అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్న రైతులు తెలంగాణ వలె మాకూ కోతల్లేని కరెంటు కావాలంటున్నారు. వీటన్నింటికి ఒకే సమాధానంగా దేశంలో విస్తరిస్తున్న బీఆర్ఎస్ వైపు జనం ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసినా దేశ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పట్ల రోజురోజుకూ ఆసక్తి పెరుగుతున్నది. మొన్న ఖమ్మంలో మొదలై, నేడు పూణెకు చేరుకున్న బీఆర్ఎస్ రేపు రేపు ప్రతి రాష్ట్రంలో పునాదులు వేసుకొని దేశ భవిష్యత్తును మారుస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నూటా ముప్ఫై కోట్ల జనాలకు నూటా ముప్ఫై కోట్ల సమస్యలున్నాయి. వాటన్నింటికీ పరిష్కారం ఒక్కటే దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం. నాకైతే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.
పెద్దింటి అశోక్కుమార్ 94416 72428
(వ్యాసకర్త: సీనియర్ కథా రచయిత)