రెజ్లింగ్ క్రీడారంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెలను రెపరెపలాడించిన ఆణిముత్యాలు వాళ్లు. అటువంటి దిగ్గజాలు ఢిల్లీలో పోలీసుల దౌర్జన్యానికి లోనై, కంటతడి పెట్టుకోవటం, ఇలాంటి రోజులను చూడటానికేనా తాము పతకాలను తీసుకొచ్చింది? అని వాపోవటం దేశంలో నేడున్న పరిస్థితిని తెలుపుతుంది. నిజంగా సిగ్గుచేటైన విషయం ఇది. పిల్లలను తల్లి కోడి కాపాడుకున్నట్లు కాపాడుకోవాల్సిన బాధ్యతలో ఉన్న ‘రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. కామాంధుడిగా మారి, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడుతుంటే అతడిపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం నిశ్శబ్దంగా ఉండటం దేనికి సంకేతం? బీజేపీ ఎంపీ కావటం, యూపీ రాజకీయాల్లో కీలకవ్యక్తి కావటం వల్లనే చట్టం అతడికి చుట్టమైందా? ‘బేటీ బచావో బేటీ పఢావో’ అంటూ మాటలు చెప్పే మోదీ సందర్భం వచ్చినప్పుడు ఎందుకు స్పందించరు?
వాళ్లందరూ దేశానికే ఘనకీర్తి తెచ్చిన బిడ్డలు. వాళ్లను రక్షించుకోవాల్సిన అవసరం, వాళ్ల గౌరవాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత లేదా? ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, బీజేపీ ధోరణి పూర్తి ఆక్షేపణీయంగా ఉంది. బ్రిజ్ భూషణ్పై జనవరిలోనే ఆరోపణలు వచ్చాయి. మహిళా రెజ్లర్లపై దాదాపు పదేండ్లుగా అతడు అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని వెల్లడైంది. అవినీతి, గూండాయిజం, భౌతికదాడులకు పాల్పడిన చరిత్ర కూడా ఉందని అతడిపై నమోదైన కేసులు తెలుపుతున్నాయి. తక్షణం చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గత నెలలో ఇచ్చిన నివేదికను నేటికీ బహిరంగపరచలేదు. విచిత్రమేమిటంటే, కమిటీలో సభ్యురాలైన ప్రముఖ రెజ్లర్ బబిత ఫోగట్ ఆ నివేదికను చదవకుండా, ఆమె చేతుల్లోంచి కాగితాలను లాగేసుకున్నారు. రెజ్లర్ల ఫిర్యాదుతో స్పందించని ఢిల్లీ పోలీసులు, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం అండ ఉన్న బ్రిజ్ భూషణ్ ఏకంగా విలేఖరుల సమావేశాలు పెట్టి మరీ, రెజ్లర్లపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.
మోదీ హయాంలో కనిపించే ఒక ధోరణి ఏమిటంటే, ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వారిపై ఎంత దారుణమైన ఆరోపణలైనా రానీ, ఎటువంటి చర్యలు ఉండవు. అది గౌతమ్ అదానీ కావచ్చు, బ్రిజ్ భూషణ్ కావచ్చు. రైతులపై దౌర్జన్యానికి దిగిన కేంద్రమంత్రి కావచ్చు. ఇటీవల ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్కు భారీ ఎత్తున ప్రచారం జరిపించిన మోదీ, జీవితంలో కష్టపడి పైకొచ్చిన వారి గురించి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఈ మాటలకు, మహిళా రెజ్లర్ల విషయంలో ఆయన మౌనానికి ఏమైనా పోలిక ఉందా? పీటీ ఉష వంటి మాజీ క్రీడాకారిణులు మహిళా రెజ్లర్లనే తప్పుపట్టటం ద్వారా తమను తామే చులకన చేసుకుంటున్నారు. మీడియా మూగబోయినా, క్రీడా ప్రముఖులు వెంట రాకపోయినా, రెజ్లర్ల పోరాటానికి దేశ ప్రజానీకం అండగా ఉంది. రింగ్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తామన్న నమ్మకంతో మహిళా రెజ్లర్లు తమ పోరాటం సాగించాలి.