ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’లో 4వది ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది చాలా గొప్ప ప్రయత్నం. దీంట్లో భాగంగా పాఠశాలల్లో మెరుగైన గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
మన ఊరు-మన బడి’ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7289.54 కోట్లు ఖర్చు చేసేందుకు సంకల్పించింది. రానున్న మూడేండ్లలో కేటాయించిన ఈ మొత్తాన్ని పాఠశాలల ఉన్నతికి ఉపయోగించనున్నారు. అందులో భాగంగా 2021-22 కాలంలో రూ.34 97.6 2 కోట్లతో 9,123 (35 శాతం) పాఠశాలల్లో ఒక మండలం యూనిట్గా తీసుకొని ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలుచేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా 12 మౌలిక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పాఠశాలకు సకల వసతులు కల్పిస్తారు.
ప్రతి వ్యక్తిలో విద్య, జ్ఞానం అలవడాలంటే విద్యతో పాటు గ్రంథాలయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి. గ్రంథాలయాలకు కావలసిన మౌలిక వసతులు-పుస్తకాలు, దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు, బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, శౌచాలయాలు ఏర్పాటుచేసి గ్రంథాలయాల ఉన్నతికి కృషి చేయాలి. మారుతున్న కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆ దిశగా ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు డిజిటల్/ స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఫిజికల్ పుస్తకాలు లేకుండా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇంటర్నెట్ ఆర్కైవ్, వరల్డ్ డిజిటల్ లైబ్రరీ, ఖాన్ అకాడమీ, హాతి ట్రస్ట్, ఓపెన్ లైబ్రరీ, ఈ పీజీ-పాఠశాల వంటి వాటి ద్వారా అందిపుచ్చుకోవచ్చు.
The more that you Read, the more THINGS you will KNOW. The more that you LEARN, the more places youll GO అని Dr.Seuss చెప్పినట్లు ప్రతి విద్యార్థి పాఠ్య ప్రణాళిక పట్టికలో గ్రంథాలయ గంటలు (ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట) ఏర్పాటుచేసి విద్యార్థులను పుస్తక పఠనం వైపు మళ్లించాలి.
పిల్లల్ని గ్రంథాలయాల వైపు ఆకర్షించేందుకు బొమ్మల పుస్తకాలు, బొమ్మరిల్లు, చందమామ లాంటి పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉంచాలి. ఈ పథకం కోసం నిధులను సమగ్ర శిక్ష, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్, నాబార్డ్, జిల్లా గ్రంథాలయ సంస్థ నిధుల నుంచి వినియోగిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి నిధులను కొంతైనా పాఠశాల గ్రంథాలయాలకు కేటాయించాలి.
ఎవరైనా పాఠశాలకు రూ.10 లక్షల విరాళం ఇస్తే దాత పేరు లేదా వారు సూచించిన పేరు తరగతి గదికి, పాఠశాలకు పెడతారు. ఇదేవిధంగా గ్రంథాలయాలనికి పుస్తకాలు, ఫర్నీచర్, భవనం, కావలసిన కంప్యూటర్లు బహూకరించిన దాతల పేర్లను పెడితే మంచి ఫలితాలుంటాయి. ఆ దిశగా ఆలోచించాలి. పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులను బహుముఖీయంగా తీర్చిదిద్దుతాయి. జ్ఞాన వికాసానికి తోడ్పడుతాయి. నాణ్యమైన విద్య అందించేందుకు గ్రంథాలయాలు, అందులో ఉన్న గ్రంథ సంపద ముఖ్యమైనవి. 8వ ఆల్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం 79,396 (67.71 శాతం) సెకండరీ స్కూల్స్ 48859 (77.97 శాతం) పాఠశాలల్లో మాత్రమే గ్రంథాలయాలున్నాయి. ఉన్నవి కూడా నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. పుస్తక పఠనం అలవడిన విద్యార్థులు మిగతా విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటారు. పాఠశాలలో, సామాజిక కార్యక్రమాల్లో సృజనాత్మకంగా ఉంటూ, వినూత్నంగా ఆలోచిస్తారు. గ్రహణ శక్తి అధికంగా ఉంటుంది, తరగతిగదిలో తేజంతో నిత్యనూతనంగా ఆలోచిస్తారు.
పాఠశాల విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో గ్రంథాలయాలను కూడా ప్రోత్సహించాలి. 4 నెలల కిందటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చొరవతో పైలెట్ ప్రాజెక్టు కింద వారి సొంత నియోజకవర్గంలో ‘కంటైనర్ లైబ్రరీ’లు పాఠశాలలో ఏర్పాటుచేశారు. ఫలితంగా విద్యార్థులకు నిత్యం గంట పాటు ‘రీడింగ్ అవర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పఠనాన్ని పెంపొందిస్తున్నారు. అదే విధంగా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన నియోజకవర్గంలో 100 గ్రంథాలయాలు ఏర్పాటుచేసి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రజా ప్రతినిధులు ముందుకొచ్చి పాఠశాలల్లో, గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేసి యువత, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం)
– డాక్టర్ రవికుమార్ చేగొని