నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యులు మరో ఆరుగురిని హత్య చేసిన నేరస్థులను జైలు నుంచి విడుదల చేయటం ద్వారా గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం చట్టాన్నీ, పాలనాపరమైన విలువలను ప్రశ్నార్థకం చేసింది. ఇటువంటి పనిని స్వాతంత్య్ర దినోత్సవం నాడు చేయటం ద్వారా సభ్యసమాజపు ప్రమాణాలు ఏవీ తనకు పట్టవని నిరూపించుకుంది. విచిత్రమేమంటే, అదే రోజు ఉదయం.. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ నారీశక్తి గురించి మాట్లాడారు. మహిళలను అవమానించే, అగౌరవపరిచే మానసికతను, మాటలను, చేతలను వదిలించుకోవాలని సుద్దులు పలికారు. అంతలోనే ఆయన స్వరాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం బిల్కిస్బానో కేసులో 11 మంది నేరస్థులను విడుదల చేసి తన నైజాన్ని చాటుకున్నది.
మోదీ రాజకీయ ప్రస్థానానికి బిల్కిస్ బానో కేసుకు దగ్గరి సంబంధం ఉంది. అంతకుముందు ఏ ప్రజాప్రతినిధిగానూ లేని నరేంద్రమోదీ 2001 అక్టోబరులో ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల్లోపే.. ప్రశాంతతకు మారుపేరైన గుజరాత్ రాష్ట్రంలో మతమంటలు అంటుకున్నాయి. ఆ దారుణాల్లో సర్వస్వం కోల్పోయిన లక్షలాదిమందిలో బిల్కిస్బానో ఒకరు. ప్రాణాలు కాపాడుకోవటానికి గ్రామం విడిచి పారిపోతున్న ఆమె కుటుంబంపై, ఇతరులపై మతోన్మాద ముష్కరులు దాడి చేశారు. గర్భిణిని అని ప్రాధేయపడినా పట్టించుకోకుండా లైంగిక దాడి చేశారు. ఆమె తల్లిపై, మరో ముగ్గురు మహిళలపైనా అత్యాచారం జరిపి చంపేశారు. చిన్నారి కూతురునూ బలి తీసుకున్నారు. బిల్కిస్ కూడా చనిపోయిందనుకొని వదిలేశారు. మొత్తం 17 మందిలో బిల్కిస్, మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు.
మతమంటల కార్చిచ్చులో, 2002 చివర్లో ముందస్తుగా నిర్వహించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అఖండ విజయం సాధించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బిల్కిస్ బానో న్యాయపోరాటం కొనసాగించారు. పోలీసుల నుంచి, బీజేపీ నేతల నుంచి బెదిరింపులు వచ్చినా బెదరలేదు. కేసు విచారణను గుజరాత్ నుంచి మహారాష్ట్రకు మార్చాలన్న ఆమె విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఆమోదించింది. 2008లో 11 మంది నేరస్థులకు జీవితఖైదు శిక్ష పడింది. బిల్కిస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని 2019లో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అత్యంత దారుణమైన అనుభవాలను దిగమింగి, జీవితాన్ని గడుపుతున్న బిల్కిస్కుటుంబానికి గుజరాత్ సర్కారు తాజా చర్య మరోసారి క్షోభను కలిగించింది. 11 మంది నేరస్థులను విడుదల చేసే విషయంలో గుజరాత్ ప్రభుత్వం చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిందని న్యాయనిపుణుల అభిప్రాయం. ఈ ఏడాది ఆఖర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి కాబట్టే, మరోమారు మతపరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టటానికి ఈ కేసును బీజేపీ వాడుకుంటున్నదన్న అనుమానాలున్నాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. దేశంలోని మహిళలకు బీజేపీ ఇస్తున్న భరోసా ఏమిటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాటలు కాదు చేతలు ముఖ్యమని ఆ పార్టీ గ్రహించాలి.