కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తున్నది.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిన పత్రికలకు విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక చిత్రం ప్రకటనలో ‘లౌకిక, సామ్యవాద’ అనే పదాలను తొలగించింది. ఈ అంశమై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ పదాల కత్తిరింపును ఉపసంహరించుకున్నది. 2021, డిసెంబర్ 3న ‘రాజ్యాంగ సవరణ-2021’ పేరిట రాజ్యాంగ పీఠికకు ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపైనా తీవ్ర నిరసనలు రావడంతో పక్కనపెట్టింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక వ్యాజ్యంలో తీర్పు చెప్తూ లౌకికతత్వం భారత రాజ్యాంగంలో ఇమిడి ఉన్న అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొన్నది. దీన్నిబట్టి రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలను తొలగించడమంటే, రాజ్యాంగంపై దాడిగానే భావించాలి.
గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వానికి జరిగిన వ్యాజ్యంలో ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడం’ అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఉన్న అధికారాల గురించి చెప్పిన అధికరణ-368కి ఉన్న స్థితిపై కీలక వ్యాఖ్య చేశారు. ‘రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని అధికరణ-368 పార్లమెంట్కు దత్తం చేయలేదు. ఈ రకమైన అధికారాలు 245, 246, 248 అధికరణల నుంచి వచ్చాయని, ఆ అధికరణలు పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారానికే పరిమితమయ్యాయని తెలిపారు. అధికరణం 13 (2)లో చెప్పిన ప్రకారం.. వాటిని చట్టాలుగానే భావించాలన్నారు. ఈ అధికరణం ప్రకారం రాజ్యం చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి. ఆ చట్టాలు రాజ్యాంగంతో పొందిక లేని మేరకు రద్దవుతాయి. ఈ తీర్పులో అత్యధిక న్యాయమూర్తులు రాజ్యాంగ సవరణకు పార్లమెంట్కు పరిమిత అధికారాలే ఉన్నాయని పేర్కొన్నారు.
కేరళకు చెందిన మఠాధిపతి కేశవానంద భారతి అప్పీలుపై జరిగిన విచారణలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే పదం సర్వోన్నత న్యాయస్థానంలో అత్యధిక న్యాయమూర్తులు తొలిసారిగా పేర్కొన్నారు. 13 మంది సర్వోన్నత న్యాయమూర్తుల్లో 9 మంది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్కు లేదన్నారు. ఈ ‘మౌలిక స్వరూపం’ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా, అంతర్లీనంగా ఉందనే అంశాన్ని మొదట 1973లో జరిగిన ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుంచీ రాజ్యాంగానికి భాష్యం చెప్పడానికి, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలను సమీక్షించే మధ్యవర్తిగానూ సర్వోన్నత న్యాయస్థానం కొనసాగుతున్నది.
భారతదేశం అంటే రాష్ర్టాల సమాఖ్య. రాజ్యాంగంలో కేంద్ర రాష్ర్టాలకు సంబంధించి పాలనాధికారాలు, విధులను రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో స్పష్టంగా 3 భాగాలుగా పేర్కొన్నారు. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలన్నింటా జోక్యం చేసుకొని రాష్ర్టాల నడ్డి విరుస్తున్నది. జీఎస్టీ రూపంలో రాష్ర్టాల ప్రధాన ఆదాయ వనరును సొంతం చేసుకొని, ఇవ్వాల్సిన నిధులు తొక్కిపెట్టి, వాటిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. జాతీయ అర్హత పరీక్ష (నీట్), ప్రణాళికా సంఘం రద్దు జాతీయ అభివృద్ధి మండలి రద్దు, వంటి అనేక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, రాష్ర్టాల అధికారాల్లోకి చొరబడి, తానే పెత్తనం చెలాయిస్తున్నది. కరోనా వల్ల ప్రజానీకం ఓ పక్క అల్లాడుతుంటే, ఇదే అదనుగా అనేక రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యా సంస్కరణలు, కార్మిక, విద్యుత్ సంస్కరణల బిల్లు వంటివి ఇందుకు ఉదాహరణ. పాఠ్య పుస్తకాల నిండా మత అంశాలు చొప్పించి, లౌకికవాదానికి గండి కొడుతున్నారు కేంద్ర పాలకులు. ముఖ్యంగా, జీఎస్టీతో పాటు, 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేయడం రాష్ర్టాల హక్కులు హరించడంలో ప్రధానమైంది. ఇక రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక తత్వానికి వ్యతిరేకంగా, పౌరసత్వ సవరణ చట్టం ద్వారా దేశాన్ని మతరాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక, సామాజిక న్యాయాన్ని పూర్తిగా వదిలివేశారు. ఎక్కువ లాభాలతో నడిచే ఎల్ఐసీ, విశాఖ ఉక్కు వంటి అనేక సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు చేపట్టారు. పన్నుల మోత ప్రజానీకానికి పెనుభారంగా మారింది. కార్మికులు, పేదలు, బడుగు బలహీనవర్గాలు, అసంఘటిత రంగ కార్మికుల బతుకులు దుర్భరంగా మారే స్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం’ అంటూ గుజరాతీ, మార్వాడీ సంస్కృతీ నిలయంగా మార్చే చర్యలు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. హిందీని బలవంతంగా రుద్దడంతో పాటు, ఏ రాష్ట్రంలోనూ ఆ రాష్ట్ర ప్రజల భాషలో న్యాయపాలనా వ్యవహారాలు జరగకుండా అడ్డుపడి ఇంకా స్వాతంత్య్రం రానట్టుగా, బానిసత్వంలో ఉంచుతూ, ప్రజల ఆహారాన్ని కూడా నియంత్రించబూనడం వంటి చర్యలకు పూనుకున్నది. సంపద సృష్టించే ఉత్పత్తి కులాలలో హిందూ మత అనుయాయులు కానివారిని, మన ఉప్పు తింటూ మనకు వ్యతిరేకంగా ఉన్నారని విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఇవన్నీ అశేష ప్రజానీకం గమనిస్తున్నది. భిన్న సంస్కృతులు, భాషలు, ఆరాధనా పద్ధతులున్న భారత ఉపఖండంలో నిజమైన ఐక్యతాభావం పెంపొందాలంటే, రాజ్యా ంగస్ఫూర్తితో రాష్ర్టాల హక్కులు, ప్రత్యేకతలను గౌరవించే ప్రజాస్వామిక పాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అనిసెట్టి సాయికుమార్
94407 70531