వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఏకంగా చరిత్ర పాఠాలపై తమ పెత్తనం చాటడానికి అనేక మార్పులకు సిద్ధమైంది. క్రీ.పూ. 2500 ఏండ్లనుంచి నేటిదాకా భారతదేశంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయా సందర్భాల్లో విదేశీ రాజుల చేతులోకి భారతదేశం వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ చరిత్ర పాఠాలను రాజకీయ కోణంలో చూస్తూ, వారికి వ్యతిరేకంగా జరిగిన సంఘటలను తొలగిస్తూ, దేశంలో సంచలనం సృష్టించిన నక్సలిజం భావజాలాన్ని తొలగిస్తూ, 2024 ఎన్నికల నేపథ్యంలో మరోసారి మత రాజకీయాలు చేయడానికి బీజేపీ సిద్ధమైంది.
ప్రపంచంలోకెల్లా గొప్ప చరిత్ర మన దేశానికి ఉన్నది. హరప్పా మొదలుకొని భారతదేశ స్వాతంత్య్రం వరకు మన చరిత్ర చాలా అద్భుతంగా, వీరోచితంగా ఉంటుంది. అశోకుడు, గౌతమ బుద్ధుడు, జైనుడు, మౌర్యులు, గుప్తులు, హర్షుడు, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ వారు ఇలా అనేక సంఘటనల చరిత్రను పద్ధతిగా అమర్చారు. ఈ చరిత్రను పాఠ్యాంశంగా మలిచి విద్యార్థులకు బోధిస్తున్నాం. నిజానికి మన చరిత్రను మనకు పరిచయం చేసింది కూడా బ్రిటిష్ వారే. జాన్ మార్షల్ 1930లో హరప్పా నాగరికత ద్వారా మన చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారు. తర్వాత అనేకమంది చరిత్రకారులు అధ్యయ నం చేసి మన చరిత్రను మనకు తెలిసేలా చేశా రు. బ్రిటిష్ ప్రభుత్వం 1861 కాలంలో పురావ స్తు శాఖను దేశంలో నెలకొల్పింది. ఈ శాఖ ఆధ్వర్యంలో అనేక తవ్వకాలు చేపట్టడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
చరిత్ర పాఠాలను మత కోణంలో చూడటంతోనే సమస్య మొదలైంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రాచీన చరిత్రలో ఉన్న అశోకుడు, బింబిసారుడు, మౌర్యుల గుప్తుల, బౌద్ధ, జైనుల గురించి కనపడదు. దక్షిణ భారతదేశ చరిత్ర అంటే మరీ చిన్నచూపు. చోళ, కాకతీయ, చాళుక్య, రాష్ట్రకూ ట చరిత్రలు వాళ్లకు గిట్టవు. కానీ మధ్యయుగంలో ఉన్న ఢిల్లీ సుల్తానులు, మొఘలుల సామ్రాజ్యం గురించి మాత్రమే వారికి తెలుసు. నాడు ఈ సుల్తానులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకొని సంపదను కొల్లగొట్టారు. ఆ రోజు ల్లో సంపదను ధనం రూపంలో దేవాలయాల్లో దాచేవారు. ఈ విధంగా అప్పటి సుల్తానులు దేవాలయాలపై దాడిచేసి సంపదను దోచుకుపోయినారనే విషయం అందరికీ తెలిసిందే. కేవ లం ప్రతికూల అంశాలపై దృష్టిసారించి 600 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశాలను తెరమీదికి తీసుకువచ్చి పాఠ్యాంశాల్లో మార్పులు చే యాలనడం విడ్డూరం. చాలా విషయాలను అ నుకూలత వైపు కూడా చూడాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో రాజనీతి రాజతంత్రం భాగంగా సుల్తానులకు అనేక హిందూ రాజ్యాలు తోడ్పాటునందించాయి. రాజపుత్ రాజ్యం మొఘల్ సామ్రాజ్యానికి మొదటినుంచి తోడుగా ఉంటూ అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. ఔరంగజేబు శివాజీ మహారాజును ఓడగొట్టడానికి తనమీదికి రాజపుత్ రాజైన మహారాజ్ జైసింగ్ను పంపారు. కొన్ని సందర్భాల్లో టిప్పు సుల్తాన్పై దండయాత్రకు మరాఠా సైనికులు, నిజాం సైనికులు కలిసి పాల్గొన్నారు. ఇలా అనేక సందర్భాల్లో హిందూ రాజ్యాలు, ఇస్లాం రాజ్యాలు రాజ్యాలను దక్కించుకొని రాజ్యాన్ని సాగించారు. ఇలాంటి చరిత్ర కు సంబంధించిన విషయాలను ఇప్పటి బీజేపీ నాయకులు, వారి మద్దతుదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇప్పటికైనా కొత్త అంశాలను చేర్చేముందు లేదా తీసివేసే ముందు నిపుణులతో చర్చించాలి. మన విద్యావ్యవస్థలో చరిత్రనే కాదు, అనే క అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఆచరణాత్మకమైన విద్యను తీసుకురావాలి. కేంద్ర బడ్జెట్లో 3 శాతం నిధులను విద్యావ్యవస్థపై వెచ్చిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. బీజేపీ విద్యావ్యవస్థపై తమ భావజాలాన్ని రుద్దడం సరికాదు. కేంద్రం ఇలాంటి చర్యలు మానుకొని, విద్యావ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
కన్నోజు శ్రీహర్ష: 89851 30032