కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవకాశం కలిగింది. అంతటి గొప్ప అవకాశాన్ని మోదీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకపోవడం విచారకరం. అంతేకాక అందులో తప్పులు దొర్లాయని, వీటని సరిచూడటానికి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ పనగారియా నేతృత్వంలో ఒక కమిటీని వేశారు.
ఆ కమిటీకి సభ్యులను వేయలేదు. ఒక్క రోజు కూడా ఈ అంశంపై కమిటీ పనిచేసిన దాఖలాల్లేవు, ప్రభు త్వం కమిటీని నివేదిక కోరిందీ లేదు. ఈ విషయాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం ఆ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుంది. వెరసి మోదీ ప్రభుత్వం బీసీల లెక్కలను బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదని చెప్పడానికి ఇంతకన్నా సజీవ అధారాలు ఏం కావాలి.
దేశానికి ‘మాడల్ స్టేట్’గా చెప్పుకొనే గుజరాత్లో కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేస్తున్న రిజర్వేషన్లు కేవలం 10 శాతమే. అవి కూడా కేంద్రం నిర్వాకం, సుప్రీంతీర్పును పెడచెవిన పెట్టడం ద్వారా విధిలేని పరిస్థితుల్లో అక్కడి ఎన్నికల కమిషన్ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అక్కడ అమల్లో ఉన్న 10 శాతం రిజర్వేషన్లకు ఎలాంటి ప్రాతిపదిక లేకపోవడం, పరిమాణాత్మక సమాచారం సేకరించకపోవడం కారణంగా బీసీ రిజర్వేషన్లు లేకుండానే, ఆ 10 శాతం కూడా జనరల్ కేటగిరిలో నిర్వహించాలని కలెక్టర్లకు అక్కడి ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున అన్నిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి ఆందోళనలు చెలరేగడంతో యుద్ధప్రాతిపదికన జస్టిస్ జవేరి నేతృత్వంలో కమిషన్ను వేశారు. ఇప్పటికి జరగాల్సిన 3300ల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. పైకి మాత్రం 27 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేస్తామని అక్కడి బీజేపీ ప్రభుత్వం డాంభికాలు పలుకుతున్నది. అయితే 4 నెలల కిందట వేసిన ఈ కమిషన్కు చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించి ఇంతవరకు ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్సు’ ను అందజేయక పోవడం విస్మయాన్ని కలిగించే విషయం.
రాజ్యాంగబద్ధంగా జాతీయ బీసీ కమిషన్ను కేంద్రం నెలకొల్పింది. చాలా సంతోషం! అయితే ఆ చట్టంలోని 342 ఏ సెక్షన్ ద్వారా రాష్ర్టాల అధికారాలను లాక్కున్నది. కాగా ఈ అంశంపై పెద్ద దుమారం లేవగా తిరిగి 105వ రాజ్యాంగ సవరణ ద్వారా 342 (ఏ 3) ద్వారా పునరుద్ధరించారు. అంటే అవకాశం దొరికినప్పుడల్లా అధికారాలను లాక్కునే ప్రయత్నం చేస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించడం, నిర్వీర్యం చేయడం తప్ప, మోదీ పాలనలో గొప్పతనం ఏమీ లేదని తేటతెల్లమవుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసినప్పటికీ రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్కు చైర్మన్, సభ్యులను ఇంతవరకూ నియమించలేదు. జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధంగా కొనసాగిననాడు కూడా ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చైర్మన్, సభ్యులను నియమించారు. రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్ను ఏర్పాటుచేసిన ఘనత మోదీ ప్రభుత్వానిది అని చెప్పుకునే కేంద్రం, రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్ను నిర్వీర్యం చేయడమే కేంద్రం తన ఘనతగా భావించాలి.
తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే తన వార్షిక బడ్జెట్లో దాదాపు 40 శాతం కేటాయింపులతో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. పథకాలు వరుసగా రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, బోధనా రుసుంల పథకం, విదేశీ విద్యా నిధి పారితోషికం, కల్యాణలక్ష్మీ, ఆత్మగౌరవ భవనాలు, పింఛన్లు, ఇలా ఎన్నయినా చెప్పుకోవడానికి వీలుంది. ఇక్కడి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నది. మోదీ ప్రభుత్వం బీసీల కోసం అమల్లోకి తెచ్చిన ఒక్క కొత్త ప్రభుత్వ పథకం పేరు చెప్పగలరా? ఘనమైన నిధుల కేటాయింపు చెప్పగలరా? ఇది ‘సబ్కా వికాస్’ ఎలా అవుతుంది? ‘సబ్కా వినాశనానికే’ దారితీస్తున్నది. రూ.40 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో ‘బీసీలకు వెయ్యి కోట్లలోపే కేటాయింపులు’ ఇది సముద్రంలో కాకి రెట్టంత. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో కేంద్రం ఓబీసీలకు కేటాయించిన బడ్జెట్ 8 వేల కోట్లు కూడా దాటకపోవడం కేంద్ర ప్రభుత్వ నైజాన్ని బయటపెడుతున్నది. కులగణన కోసం వెచ్చించిన 5 వేల కోట్ల బడ్జెట్ బూడిద పాలు. శాస్త్రీయంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణన వివరాలు తప్పుల మయం అని తేల్చి బహిర్గతం చేయకపోవడం ఇదే రాజకీయ విజ్ఞత అంటారా?
2018లో కులగణన చేస్తామని ప్రకటించి 2022లో చేయబోమని తిరిగి ప్రకటించడం బీసీలను దగా చేయడమే. ‘ఓబీసీ పార్లమెంటరీ స్థాయి సంఘం’ కులగణన చేపట్టాలని సిఫారసు చేసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్కు నెలల తరబడిగా చైర్మన్, సభ్యులను నియమించకపోవడం బీసీల పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. కేంద్రం వైఖరితో రాష్ర్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు గల్లంతవుతున్న వైనం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మోదీ ప్రభుత్వంలో ‘సబ్కా వికాస్ డొల్ల’ ‘సబ్కా వినాశే’ పచ్చి నిజం. కమలం రీతి ‘కుటిల నీతి. ఓబీసీ కులాల జాబితా ఉపవర్గీకరణ నిమిత్తం 2017లో నియమించిన జస్ట్టిస్ రోహిణి కమిషన్కు ఇప్పటివరకు 13 సార్లు గడువు పొడిగించారు. ఆ కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియని శేష ప్రశ్నగా మిగిలింది.
‘సబ్ కా సాత్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్’ నినాదాలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. ప్రధానంగా బీసీలను, వారి అభివృద్ధిని గాలికి వదిలేసింది. పైగా బీరాలకు పోవడం విచారకరం.
– డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్రావు
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)