‘యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాణక్యం ముందు కాషాయం పార్టీ ఓడిపోయింది. అందుకే కేసీఆర్ను దేశ్ కీ నేత అంటుంటే, దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని ‘నమో’ అంటే నమ్మించి మోసం చేసే నాయకుడు అంటున్నారు.
దేశంలోని కొన్ని రాష్ర్టాలను ఇప్పటికే కబళించిన ‘కాషాయ అనకొండ’ బుసలు కొట్టడం నెల కిందటే ప్రారంభించింది. దొంగ స్వాముల ఎత్తులను పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక పన్నాగానికి పూనుకున్నారు. ఆ వ్యూహంలో చిక్కిన బీజేపీ చతికిలపడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నది. ఎక్కడేం పాచికలు పారినా తెలంగాణలో మాత్రం తమ పాచికలు పారవని ఇప్పటికే నెంబర్ 1, నెంబర్ 2లకు అర్థమైంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా కొత్త నాటకానికి తెరలేపారు. ఏకంగా ప్రతిష్టాత్మక యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసిన బండి సంజయ్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అయితే నెంబర్-1, నెంబర్-2ల జిత్తులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్కి తెలువకపోవడం హాస్యాస్పదం. ఆడలేక మజ్జెల ఓడు అన్న చందంగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. సందేహాలు సమసిపోయి అనుమానాలు రక్తికట్టించే బీజేపీ చేసిన ఈ వికృత క్రీడలో విభూతి తలవంచింది. పీతాంబరం ఓడిపోయింది.
మొన్నటికి మొన్న ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రక్రియలో మనీష్ సిసోడియాకు బెదిరింపులు. ఓ వైపు గోవాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం కూల్చివేత కుట్రల వంటివి తెలంగాణలో సాగవని కేసీఆర్ నిరూపించారు. ఉద్యమ ప్రస్థానంలో తరచుగా ఉన్న వాచ్డాగ్ పాత్రకు ఈ రోజు పునర్నిర్వచనం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యేలు ‘నాట్ ఫర్ సేల్’ అని యావత్ దేశానికి మరోసారి నిరూపించారు. నికార్సయిన ఉద్యమ పుత్రులు ప్రదర్శించిన నిజాయితీకి యావత్ తెలంగాణ సమాజం గర్వపడింది. మొదటి రెండురోజుల వ్యూహాత్మక మౌనం, ఆ తర్వాత ఆడియోల ద్వారా సాక్ష్యం బయటికి వచ్చింది. బీనామీల డబ్బులతో, స్వామీజీల కుతంత్రాలతో బీజేపీ గద్దలు పన్నిన విషవలయం బోర్లా బొక్కలైంది. అయితే విషయమేమంటే బండి సంజయ్ ప్రమాణం యాదికి వస్తేనే నవ్వు వస్తున్నది పాపం! ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియ బీజేపీకి అలవాటైనా.. తెలంగాణలో కేసీఆర్ రూపంలో ఒక యుద్ధ వీరుడున్నాడనే సత్యం ఆలస్యంగానే బీజేపీకి అర్థం కావడం అభినందనీయం. నాడు చంద్రబాబుకు పన్నిన పన్నాగం బీజేపీ పెద్దలు మర్చిపోయినట్టున్నారు. పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమంలో ఎగసిపడిన ఇక్కడి నాయకులు నిప్పుకణికలనే విషయం బీజేపీకి తెలియకపోవడం విడ్డూరం.
కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం అన్యాయం జరిగినా ఇక్కడి నాయకులు, ప్రజలు చూస్తూ ఊరుకోరని అర్థం చేయించారు. ఏదేమైనా ‘పిక్చర్ అబీ బాకీ హే!! బీజేపీకి ఇప్పుడు ‘కేసీఆర్’ అనే తేనె తుట్టెను లేపినట్టనిపిస్తున్నదనడంలో సందేహం లేదు. తెరవెనుక ఉన్న చాలామంది నేతల బండారం త్వరలోనే బయటికి వస్తుంది. కేంద్రమంత్రుల యంత్రాంగం, గుజరాత్ బినామీల అరాచకం బయటపడటం ఖాయం.
బీఆర్ఎస్ ఎదుగుదలను ఆదిలోనే అంతమొందించాలనే కుట్రతో బీజేపీ మునుగోడు ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపింది. కానీ కేసీఆర్ బీజేపీకి కొరకరాని కొయ్యలా తయారవుతారని ఊహించలేకపోయింది. ఇది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తొలి విజయం. ఇక మునుగోడు విషయానికి వస్తే టీఆర్ఎస్ విజయం ఖరారైందని, అన్ని సర్వేలు బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, బీజేపీ బోర్లా పడటం ఖాయమని చెప్తున్నాయి.
– మఠం భిక్షపతి
95424 23242
(వ్యాసకర్త: టీఆర్ఎస్ సీనియర్ నాయకులు)