ప్రాచీనకాలంలో మన దేశంపైకి దండెత్తుకొని వచ్చిన విదేశీయులు మన సాంస్కృతిక సంపదను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ పని స్వయంగా మన నాయకులే చేస్తున్నారు.
కాశీలో అడుగడుగునా శివలింగాలు ఉంటాయి. వాటిని పట్టించుకోనివారు మసీదులో శివలింగం పేరుతో రాజకీయాలు చేయటం ఏమిటి?
దేశవ్యాప్తంగా భక్తులు చేపట్టే 84 రకాల దీక్షలు కాశీలోని వ్యాసపీఠం వద్ద ముగుస్తాయి. అంటే ఆ పీఠం వద్దకు చేరుకోవటంతో ఆ దీక్షలు పూర్తవుతాయి. శతాబ్దాల నాటి ఆ పీఠాన్ని కూడా తొలగించారు. మా సంప్రదాయాలను వారు ధ్వంసం చేశారు. – రాజేంద్ర తివారీ, కాశీ విశ్వనాథుడి ఆలయంలో గతంలో పూజారి
ఇప్పటివరకూ పరమశివుడు నాలుగు గోడల మధ్య ఉండిపోయాడు. ఊపిరిపీల్చుకోవటానికి కూడా ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడో? ఇప్పుడు శివుడికి స్వేచ్ఛను కల్పించాం. – ప్రధాని నరేంద్ర మోదీ
భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎందుకు ఉద్యమించరు?
– ప్రొఫెసర్ విశ్వంభర్నాథ్ మిశ్రా, ఐఐటీ బెనారస్
తనకు జరిగిన అన్యాయంపై విజయ్ తివారీ ఇప్పటికీ తీవ్రమైన ఆవేదనతోనే ఉన్నారు. మూడు తరాలుగా ఆయన కుటుంబం ఆధీనంలో ఉన్న ఇంటిని, చిన్న గుడిని 2020 మార్చిలో వారణాసి అధికారులు కూల్చివేశారు. ఆ గుడిలో శివలింగం, విష్ణువు విగ్రహం ఉండేవి. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు కోసం కూల్చిన అనేక గుడులు, ఇళ్లలో విజయ్ తివారీ కుటుంబానికి చెందిన ఇల్లు, ఆలయం కూడా ఉన్నాయి.
కాశీ విశ్వనాథుని ఆలయాన్ని, గంగానది ఘాట్లతో అనుసంధానిస్తూ కారిడార్ను నిర్మించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ కారిడార్కు 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు. గుజరాత్ ఆర్కిటెక్ట్ బిమత్ పటేల్కు చెందిన కంపెనీకి ఈ కారిడార్ డిజైనింగ్ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా పునర్నిర్మాణం, కొత్త పార్లమెంటు భవనం డిజైనింగ్ కాంట్రాక్టు కూడా ఇదే సంస్థకు దక్కాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది వారణాసి కారిడార్ను ప్రధాని ప్రారంభించారు. శంకుస్థాపన చేసిన మోదీ వారణాసి నుంచి తిరిగి ఎంపీగా ఎన్నిక కాగా, కారిడార్ నిర్మాణం పూర్తయిన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్యనాథ్ తిరిగి విజయం సాధించారు. ఈ విధంగా బీజేపీకి ఎన్నికల్లో వారణాసి కారిడార్ ప్రయోజనం కలిగించినప్పటికీ.. ఆ పట్టణంలోని వందలాదిమంది స్థానికులకు మాత్రం తీవ్రమైన నష్టాన్నే కలిగించింది.
కాశీలో విశ్వనాథుని ఆలయం సమీపంలో, చుట్టుపక్కల ఇరుకైన వీధుల్లో అనేక మంది తరతరాలుగా నివాసం ఉంటున్నారు. ఇండ్లు, భవనాల ముందుభాగం లేదా కింది అంతస్తులో చిన్న చిన్న గుడులు ఉండేవి. ఇళ్లల్లో నివాసం ఉండేవారే ఆ ఆలయాల నిర్వహణ, పూజలను చూసుకునేవారు. ఇది వంశపారంపర్యంగా కొనసాగుతున్న ప్రక్రియ. కాశీకి వచ్చే భక్తులు ప్రధాన ఆలయానికి వెళ్లేముందు ఆ గుడులను సందర్శించుకోవటం ఒక ఆనవాయితీ. ఇప్పుడు కారిడార్ నిర్మాణం కోసం ఈ గుడులను, ఇండ్లను, భవనాలను మొత్తంగా కూల్చివేశారు. గుడుల్లో ఉన్న విగ్రహాలను కొత్తగా కడుతున్న ఆలయ కాంప్లెక్స్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ, రెండేండ్లు గడిచిపోయినా తమ గుడిలోని విగ్రహం, శివలింగం ఎక్కడున్నాయో తెలియటం లేదని విజయ్ తివారీ వాపోయారు.
‘ఒకవేళ తెలిసినా ఇప్పుడు చేసేదేముంది? అసలు స్థానం నుంచి తొలగించి వేరే దగ్గర పెట్టిన విగ్రహానికి ఇక పూజలు చేయలేం’ అని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. స్థానిక గుడుల కూల్చివేత, విగ్రహాల తరలింపునకు వ్యతిరేకంగా విజయ్ తివారీ లాంటి బాధితులు అనేకమంది వారణాసి కోర్టులను ఆశ్రయించారు. కానీ, ఎటువంటి ఫలితం లేదు.
కారిడార్ నిర్మాణం వల్ల తమకు వ్యక్తిగతంగా నష్టం జరగటమే కాదు, వారణాసి పట్టణానికి కూడా ఎనలేని నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. ‘భక్తులు విశ్వనాథుడిని దర్శించుకోవటానికి ముందు, ఆలయం చుట్టూ విస్తరించి ఉన్న అనేక గల్లీలు, సందుల గుండా నడిచివెళ్తూ ఈ పట్టణ సంస్కృతిని ఆస్వాదించేవారు. వందలాది ఏండ్లుగా వారణాసి పట్టణం స్వరూపం ఇది. దీనిని ఇప్పుడు ధ్వంసం చేశారు’ అని సంజీవ్ రతన్ మిశ్రా చెప్పారు. ‘దేశవ్యాప్తంగా భక్తులు చేపట్టే 84 రకాల దీక్షలు కాశీలోని వ్యాసపీఠం వద్ద ముగుస్తాయి. అంటే ఆ పీఠం వద్దకు చేరుకోవటంతో ఆ దీక్షలు పూర్తవుతాయి. శతాబ్దాల నాటి ఆ పీఠాన్ని కూడా తొలగించారు. మా సంప్రదాయాలను వారు ధ్వంసం చేశారు’ అని పేర్కొన్నారు. కూల్చివేతల్లో సంజీవ్ రతన్ మిశ్రా కూడా బాధితుడే. కారిడార్ వల్ల జీవనోపాధి కోల్పోయిన వారిని ఐక్యపరిచే ప్రయత్నాల్లో ఉన్నారాయన.
ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న గుడుల్లో పూజలు జరుగుతూ ఉండేవి. వాటిలో ఐదు అత్యంత ముఖ్యమైనవి. గణేష, దుర్గ, శివ, విష్ణు, సూర్య ఆలయాలు. వీటిని దర్శించుకొని, వీటి చుట్టూ ప్రదక్షిణలు చేయకపోతే కాశీ పర్యటన పూర్తయినట్లు కాదనేది చిరకాలంగా కోట్లాదిమంది భక్తుల్లో ఉన్న విశ్వాసం. కారిడార్ కోసం ఈ ఆలయాలను కూడా కూల్చివేశారు.
1983 వరకూ కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజారిగా పనిచేసిన రాజేంద్ర తివారీ ఈ ఘటనలపై స్పందిస్తూ.. ‘గురువు (ప్రధానాలయంలోని విశ్వనాథుడు) వద్దకు వెళ్లటం, ఆయనను పూజించటం అనేది ఒక నిర్దిష్టమైన ప్రక్రియ. దానిలో ఈ పంచాయతన (ఐదు గుడుల దర్శనం) కూడా ఒక భాగం. ఇప్పుడది లేకుండా పోయింది’ అని ఆవేదనతో చెప్పారు. ఇదే కాదు, ఇంకా అనేక విశిష్టమైన స్థలాలు, పవిత్రమైనవిగా భావించే క్రతువులకు సంబంధించిన ప్రదేశాలు కారిడార్ కారణంగా కనుమరుగయ్యాయని ప్రొఫెసర్ విశ్వంభర్నాథ్ మిశ్రా తెలిపారు. కాశీలోని సంకట్ మోచన్ ఆలయం పూజారి ఆయన. అంతేకాదు, ఐఐటీ బనారస్లోని ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ కూడా. పురాణాల వంటి హిందూ మత గ్రంథాల్లో పేర్కొన్న 143 పవిత్ర స్థలాలు కారిడార్ వల్ల తుడిచిపెట్టుకుపోయాయని ఆయన తెలిపారు. 2019లో కారిడార్కు శంకుస్థాపన సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ విశ్వంభర్నాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకూ పరమశివుడు నాలుగు గోడల మధ్య ఉండిపోయాడు. ఊపిరిపీల్చుకోవటానికి కూడా ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడో? ఇప్పుడు శివుడికి స్వేచ్ఛను కల్పించాం’ అని మోదీ చెప్పారని.. ఇది ఏ విధంగా సరైనదని ఆయన ప్రశ్నించారు. ‘భక్తులు కాశీకి వచ్చేదే విముక్తి కోసం. వారి దైవం కాశీ విశ్వనాథుడు. ఆ దైవానికే విముక్తి కల్పించామని కొందరు అంటుంటే ఏమని భావించాలి’ అని పేర్కొన్నారు. వారణాసిలో ప్రాచీన, పవ్రిత స్థలాలను ధ్వంసం చేస్తుంటే దేశంలోని హిందువులు ఎందుకు ఉద్యమించరని ప్రశ్నించారు.
కారిడార్ నిర్మాణంతో ఇరుకు సందులు, ఇండ్లు కనుమరుగు కావటంతో ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు గతంలోకంటే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటీవల ఆ మసీదు ప్రాంగణంలో శివలింగం దొరికిందని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అది శివలింగం కాదు, పాతకాలం నాటి నీటి ఫౌంటేన్ తాలూకు అవశేషం అని మరొక వాదన కూడా ఉంది. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ వివాదంపై వారణాసి వాసులు, కారిడార్ బాధితులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాశీలో అడుగడుగునా శివలింగాలు ఉంటాయి. వాటిని పట్టించుకోనివారు మసీదులో శివలింగం పేరుతో రాజకీయాలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
‘కాశీ అంటేనే విశ్వనాథుడి నివాస స్థలం. ఇక్కడ ప్రతీ రాయిలో కూడా శివుడే ఉంటాడు. ఏండ్లుగా ఆయనకు పూజలు చేస్తున్న మేం మూర్ఖులమని అనుకుంటున్నారా?.. అధికారులు కూల్చివేసిన గుడుల్లోని అనేక శివలింగాలు డ్రైనేజీల్లో పడి ఉన్నాయి’ అని ప్రొఫెసర్ విశ్వంభర్నాథ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కారిడార్ కోసం జరిగిన విధ్వంసాన్ని తన సెల్ఫోన్ కెమెరాతో రికార్డు చేసిన సంజీవ్ మిశ్రా కూడా ఇదే మాట చెబుతున్నారు. అనేక గుడుల నుంచి పెకిలించిన శివలింగాలను ఎలాంటి ఆదరణ లేకుండా నేలపై పడేశారని పేర్కొంటూ వాటి ఫొటోలను చూపిస్తున్నారు.
వారణాసి కారిడార్ నిర్మాణం నేపథ్యంలో తొలగింపునకు గురైన శివ లింగాలకు పూజచేస్తున్న అర్చకుడు
కారిడార్ కారణంగా ఇంటిని, గుడిని కూడా కోల్పోయిన వారిలో దీపక్వర్మ కుటుంబం ఒకటి. మూడు అంతస్తుల ఇల్లుతోపాటు అందులో ఏర్పాటు చేసుకున్న గుడిని కూడా అధికారులు కూల్చివేశారు. ఇప్పుడు దీపక్వర్మ వీధుల్లో పూలు అమ్ముతూ పొట్టపోసుకుంటున్నారు. తమ గుడిలోని శివలింగాన్ని ఎక్కడికి తరలించారో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ, ఇల్లు ఖాళీ చేయటానికి తాము ససేమిరా అన్నామని దీపక్వర్మ తెలిపారు. అయినప్పటికీ, కరెంటు, నీళ్లు బంద్ చేసి, అక్కడ ఉండలేని పరిస్థితులను సృష్టించి వెళ్లగొట్టారన్నారు. మదన్ యాదవ్ది కూడా ఇదే దీనగాథ. కారిడార్ కారణంగా ఆయన ఇంటిని కోల్పోయారు. నష్టపరిహారం ఇచ్చినప్పటికీ, తమకు ఇది ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పారు. ‘అనేక ప్రాచీన ఆలయాలను ధ్వంసం చేశారు. ఇది సనాతన ధర్మంపై దాడి’ అని ఆయన పేర్కొన్నారు. అసలు కారిడార్ ప్రాజెక్టు గురించి తొలుత తమను సంప్రదించనే లేదని, దానిని తమ మీద బలవంతంగా రుద్దారని వారణాసి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వరుణ, అస్సీ ఘాట్ల మధ్య ప్రాచీన పట్టణం కాశీ ఏర్పాటైంది. దీనివల్లనే వారణాసి అనే పేరు వచ్చింది. ఇప్పుడు కారిడార్ ఈ ప్రాంతాన్ని నిలువునా చీల్చేసింది. తరతరాలుగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఒక తరానికి మరో తరానికి మధ్య సజీవమైన సంబంధం ఉంది. టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దటం కోసం ఈ సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేశారు’ అని ప్రొఫెసర్ విశ్వంభర్నాథ్ మిశ్రా వ్యాఖ్యానించారు.
ఇండ్లను, గుడులను కోల్పోవటంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాత్రం ఉద్యమించలేదు. బీజేపీ పట్ల భయమే దానికి కారణమని సంజీవ్ రతన్ మిశ్రా తెలిపారు. ‘హిందుత్వ పార్టీ పట్ల భయంతోనే స్థానికులు మౌనంగా ఉండిపోయారు. ప్రాచీనకాలంలో మన దేశంపైకి దండెత్తుకొని వచ్చిన విదేశీయులు మన సాంస్కృతిక సంపదను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ పని స్వయంగా మన నాయకులే చేస్తున్నారు’ అని ఆయన వాపోయారు.
కాశీ విశ్వనాథుడి ఆలయంలో గతంలో పూజారిగా పనిచేసిన రాజేంద్ర తివారీ స్పందిస్తూ.. ‘మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రదర్శన.. నిజానికి ఒక వ్యాపారం. శివుడి నివాసంలోనే శివుడిపై వీళ్లు (బీజేపీ) దాడికి పాల్పడ్డారు. అటువంటి వీరు హిందువులమని ఎలా చెప్పుకొంటారు?’ అని నిలదీశారు.
వారణాసి
కారిడార్ కారణంగా మూడంతస్తుల ఇంటితోపాటు గుడిని కోల్పోయాం. భవనాన్ని, అందులో ఏర్పాటుచేసుకున్న గుడిని కూడా అధికారులు కూల్చివేశారు. 22 మంది ఉన్న మా కుటుంబం చెల్లాచెదురైంది. నేను ఇప్పుడు వీధుల్లో పూలు అమ్ముతూ బతుకుతున్నా. మా గుడిలోని శివలింగాన్ని ఎక్కడికి తరలించారో కూడా మాకు తెలియదు. – దీపక్ వర్మ
బాధ్యతలేని తెంపరితనం
ముక్తి మండపం (విశ్వనాథ సభ) కూడా ధ్వంసానికి గురైంది. కొన్ని పునఃప్రతిష్ఠిస్తామని బుకాయించినా జరిగింది శూన్యం. ఆ ఘోరాలు చేసేటప్పుడు అక్కడి అర్చకులను, పండితులను కూడా సంప్రదించలేదు. హిందూ ధర్మంపై విశ్వాసమున్న వారెవరూ చేయలేని ఘోరాన్ని చేశారన్నది అక్కడి స్థానికుల మాట. కొన్ని లింగాలను, మూర్తులను పెకిలించేటప్పుడు హిందూ కార్మికులు ఆ పని చేయలేమన్నారు. అప్పుడు ముస్లిం కార్మికుల చేత ఆ పని చేయించారట. అక్షయవటం కూల్చరాదని వేదనపడ్డ అర్చకుడు, ముఖ్యమంత్రి పర్యవేక్షణకు వచ్చేటప్పుడు విన్నవించుకుందామని ప్రయత్నిస్తే, ముఖ్యమంత్రిని కలువనీయకుండా ఆ అర్చకుని రెండు రోజులు గృహ నిర్బంధంలో ఉంచారట పోలీసులు. విజ్ఞులను సంప్రదించకుండా ఈ విశ్వేశ్వరాపచారం చేయడమే కాక, సైంటిస్టుల మాటలను పెడచెవిన పెట్టి గంగ గతిని కూడా క్షోభపరిచారని కొందరి సమాచారం. ఎక్కడైనా రోడ్డుపై ఒక చిన్న మందిరం కూలదోస్తే నానా రభస చేసే ‘సంఘ పరివారాలు’, ‘పరిషత్తులు’ ఈ భయంకర కృత్యంపై కిమ్మనకపోవడం మరో విషాదం. కేవలం పర్యాటక దృష్టి తప్ప, కాశీ భవ్యచరిత్ర, పరంపర, సంస్కృతి గురించి పట్టని జడత్వం పాలకులను ఆవహించింది. జవాబుదారీతనం, బాధ్యత లేని తెంపరితనం, అధికార దుర్వినియోగం, నియంతృత్వం, నిరంకుశ అహంభావం- ఈ ప్రక్రియలో కనబడిందనేది వాస్తవం!
– 2022 ఏప్రిల్నెల ‘భారత ఋషిపీఠం’ పత్రిక సంపాదకీయంలోని కొన్ని భాగాలు.
– ఐశ్వర్య అయ్యర్ (‘స్క్రోల్’ సౌజన్యంతో..)