నా తెలంగాణ.. కోటి రతనాల వీణ- దాశరథి
నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణ- కేసీఆర్
తరాల తరబడి విలయ తాండవం చేసిన కరువు నేలను ‘కోటి ఎకరాల మాగాణంగా మార్చేస్తా’ అనే లక్ష్యం పెట్టుకోవాలంటే సముద్రమంత సంకల్పం ఉండాలి. అసాధ్యంగా కనిపించే కలలను నిజం చేసి చూపెట్టగలిగే పట్టుదల కావాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కొండలను సైతం పిండి చేస్తూ ముందుకు వెళ్లగలిగే ఆత్మైస్థెర్యం కావాలి. ఎత్తుకున్న జెండాను ఎగరేసేదాన్క వెనుకడుగే తెలియని మొండితనం కావాలి. అది సాధ్యమవుతుందనే విషయం నిజం అయ్యేదాకా చాలామంది నమ్మలేదు. ఉద్యమ నాయకుడే అభివృద్ధి సారథి కావటం వల్ల సాధ్యమైందన్న విషయం విమర్శకుల నోళ్లకు తాళం వేసింది.
ముగ్గురు ముఖ్యమంత్రులు మారితే తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు గతంలో. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేండ్ల చిరుప్రాయంలోనే పూర్తిచేసి చూపించటం అనేది ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేకపోయిన అద్భుతం. చైనాలో మాత్రమే సాధ్యమయ్యే నిజం. కానీ, ఆ అద్భుతం మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్రం పేరు తెలంగాణ, ఆ రాష్ట్రం వయస్సు పదేండ్లు మాత్రమే. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనికి కూడా సాధ్యం కాని లక్ష్యాన్ని కేవలం మూడేండ్లలోనే ఒక చిన్న రాష్ట్రం సాధించిందంటే మహాద్భుతం కాక మరేమవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టును జీర్ణించుకునేలోపే ప్రతిపక్షాల నెత్తి మీద పడ్డ మరో భారీ పిడుగు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టు. కరువును ఇంటి పేరుగా మార్చుకొని, కుటుంబాన్ని సాకటం కోసం వలసలు వెళ్లిన కరువు నేల పాలమూరు. రాళ్లను తప్ప నీళ్లను చూడని నేల పాలమూరు. నీళ్ల కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయిన నేల పాలమూరు.
రాష్ట్ర సాధన కోసం కంకణం కట్టుకున్నప్పుడే పాలమూరు కోసం పట్టుబిగించిన పిడికిలి రాష్ర్టాన్ని సాధించిన వెంటనే పాలమూరుకు పచ్చకోక కట్టే పనికి శ్రీకారం చుట్టింది. పాలమూరుకు నీళ్లు వస్తున్నాయంటే ఆ నేల మీద ఉన్న రాళ్లు సైతం ఆనందబాష్పాలు కారుస్తాయి. కానీ, నాడు ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి నేడు పాలమూరు గుండెల మీద కృష్ణమ్మ తాండవం చేసేవరకూ ప్రతీ అడుగులో అడ్డంకులు సృష్టించిన ప్రతిపక్షాల కండ్లల్లో మాత్రం నిప్పులు దుంకుతున్నాయి.
ఆరు దశాబ్దాల పాలమూరు కరువుకు కారణం ఐనోళ్లే. వారు ఇప్పుడు పాలమూరు పాదాలను కడుగుతున్న కృష్ణమ్మను చూసి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్లే.. కాల్వలు తవ్వుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టారు. వాళ్లే.. రిజర్వాయర్లు కట్టిస్తుంటే రాళ్లు విసిరారు. వాళ్లే.. కొండలను పిండిచేసి సొరంగాలు తవ్వుతుంటే కోర్టుల్లో కేసులు వేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రవాహంలా దూసుకెళ్లటమే తెలిసిన నదులే ఆదర్శం. అందుకే దూసుకెళ్లే దారిలో ఎదురొచ్చిన దుష్మన్లందర్నీ దాటుకుంటూ లక్ష్యాన్ని ముద్దాడారు. ప్రతీ అడుగులో ఎదురైన ఆటంకాన్ని అధిగమిస్తూ ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసి చూపించారు. నీళ్లు లేని నేలకు పచ్చకోక కట్టి నాడు తెలంగాణ కోసం గెలిపించిన గడ్డను కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు పాదాలకు జలాభిషేకం చేసి రుణం తీర్చుకున్నారు.
కరువు వల్ల వలసపోయిన నేల మీదినుంచి కరువునే వలసపోయేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. పచ్చదనంతో పాటు, పట్నం పోయిన పల్లెలన్నీ పొలాల్లోకి తిరిగివచ్చేలా చేసిన తెలంగాణ జల విధాత కేసీఆర్. ఆయన సంకల్పానికి కాళేశ్వరమై పొంగుతున్న గోదావరితో పాటు, కృష్ణమ్మగా ఉప్పొంగుతున్న పాలమూరు సైతం ఆ మహా మనీషికి తమ ఆనందబాష్పాలతో అభిషేకం చేస్తున్నాయి. రైతుబిడ్డ రాజైతే రైతు కూడా రాజవుతాడనే నిజం తెలంగాణలో పచ్చబడ్డ ప్రతీ ఎకరానికి తెలుసు. ఆ సంగతి అలుగు దుంకుతున్న ప్రతి చెరువూ, పరుగులు పెడుతున్న ప్రతి కాల్వ, పొంగుతున్న ప్రతి వాగూ, నవ్వుతున్న ప్రతి రైతూ కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.