ఇప్పుడొక తమాషా జరుగుతున్నదీ దేశంలో! అది రంగురంగుల తమాషా. అబద్ధాలకు వేషమేసి, అద్దాల తెరమీద తోలుబొమ్మల్లా ఆడించే తమాషా! చిత్రమైన చిత్రాలను మీద గుమ్మరించి, మనిషిని మాయజేసే తమాషా! కల్లబొల్లి కబుర్లన్నింటినీ సెల్ఫోన్లో కలబోసి మనసును కల్లోల పరిచే తమాషా! వ్యంగ్యం, హాస్యం, సెటైర్, స్కిట్, కార్టూన్… ఏదైనా కావచ్చు. కానీ అది బురదజల్లే తమాషా! ఈ తమాషా పేరు సోషల్ మీడియా! చేసే వాడికి, చూసే వాడికి ఇది తమాషానే కావచ్చు. కానీ ఈ తమాషా విలువ?
ఎమ్మెల్యే, లేదా మంత్రి స్థాయిలో ఉండే ఒక నాయకుడు, కనీసం 15 నుంచి గరిష్ఠంగా 40 ఏండ్లు రాజకీయంగా రాత్రింబగళ్లు కష్టపడితే గానీ కెరీర్ను నిర్మించుకోలేడు. తనకంటూ ఒక ముద్రను సాధించుకోలేడు. ఇందుకు కులం, మతం, డబ్బు, స్థాయి, పార్టీలు, ప్రత్యర్థులు, వారి ఎత్తుగడల వంటి అనేక అడ్డుగోడల్ని, అవాంతరాలను దాటాల్సి ఉంటుంది. గట్టి పునాదితో మొదలుపెట్టి, బ్రిక్ బై బ్రిక్ తన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. అందుబాటు అనే అగ్నిపరీక్షలో పాసవ్వాల్సి ఉంటుంది. కెరీర్ను సాధించుకోవడమే కష్టమైన పని అనుకుంటే, దాన్ని కాపాడుకోవడం, జనాదరణను పొందుతూ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగడం ఇంకింత క్లిష్టమైన పని. ప్రజల వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షలు పరిమితంగా, సమష్టి ప్రయోజనాలు ప్రధానంగా ఉన్న పాత రోజుల సంగతి పక్కనబెడితే, ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయం 24 గంటల ఉద్యోగం. చావుకు, పెళ్లికి కూడా వెళ్లి తీరాల్సిందే. చదివింపులు సరేసరి. పని మీద ఇంటికొచ్చిన వాడిని అర్సుకోవాలి. పదో పరకో పర్సులో పెట్టాలి. అవసరమైతే ఫోన్లో అందుబాటులో ఉండాలి. ‘నా బిడ్డ శారీ ఫంక్షన్కు రమ్మంటే రాలేదు కదా. ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు కదా. యాడికి పోతవో చూస్త! ఎన్నికలప్పు డు ఓట్ల కోసం రావా? అప్పుడు జెప్త’ ఇదీ ఒక ఔత్సాహిక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక ఓటరు బెదిరించిన తీరు. అసలే ప్రజా జీవితం భరించలేనంత ఒత్తిడిగా మారిన ఈ తరుణంలో, సోషల్ మీడియా… రాజకీయాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నది.
సోషల్మీడియాలో కామన్ కాన్సెప్టు ఒకటే. ‘అద్దాల మేడలో ఉన్నవాడిపై రాళ్లు విసురుతా… కాస్కో, చేతనైతే ఆప్కో! తెల్లబట్టలు వేసుకున్న వాడిపై బురదజల్లుతా… రోజూ కడుక్కో, వివరణ ఇచ్చుకో! బట్టగాల్చి నీ మీద వేస్తా.. కాల్చుకో, మసి పూస్కో’ ఇదీ పరిస్థితి! అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడాఅడ్డగోలు పనులకు మాత్రమే వాడగల అద్భుతమైన జ్ఞానం సంపాదించిన మనం, కనుగొన్న వికృత విజ్ఞానమే ఈ సోషల్మీడియా.
నిజంతో సంబంధం లేదు. పరిశోధించాల్సిన పని లేదు. ఆధారం అక్కర్లేదు. రుజువు చూపాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలతో సంబంధమే లేదు. ఏ నియమమూ లేదు. నిబంధన అంతకంటే వర్తించదు. నీ తలలోకి ఒక అయిడియా వచ్చిందా.. చాలు! దానికిన్ని రంగులద్ది, బొమ్మలు దించి, సినిమా క్లిప్పింగులు కలిపి, మసాలా దట్టించి, వెకిలిమొకిలి డబ్బింగ్ యాడ్ చేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి తగిలించి జనం మీదికి వదిలేయడమే!
‘ఎవనికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిందన్నట్టు..’ దొంగ పేర్లు, ఫేక్ ఐడీలు, ఊరు పేరు లేని పోస్టింగులతో సోషల్మీడియా అడ్డూ అదుపు లేకుండా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అంతమాత్రాన ఇదేదో ఆషామాషీ పిల్లలాట కాదు. దీనివెనక వందల కోట్ల రూపాయల దందా దాగి ఉంది. పోలీసులు, అత్యాధునిక టెక్నాలజీ సైతం వెంటనే కనిపెట్టలేని పెద్ద నెట్వర్క్ ఉంది. ‘సోషల్మీడియా గురు’ వ్యూహకర్తలు స్కీములు రచిస్తున్నారు. రాజకీయ పార్టీలు వందల కోట్లు గుప్పించి ఈ వ్యవస్థను, ఆ వ్యక్తులను పోషిస్తున్నాయి. ఐఐటీ- ఐఐఎం గ్రాడ్యుయేట్లు మొదలుకుని పెద్దగా చదువుకోని యువతీ యువకులు, వక్రమార్గంలో ఆలోచించే చిల్లర మూకలు, అల్లరి మూకలు కలసి ఈ థర్డ్రేట్ క్రియేటివిటీలో భాగస్వాములు. ఏ శిక్షణా ఉండదు. పాత్రికేయ విలువలు తెల్వవు. విలువలంటే లెక్కలేదు. ఒక్కొక్కరికీ కోట్ల రూపాయల్లో ప్యాకేజీలు, లక్షల రూపాయల్లో జీతాలు. అబద్ధాన్ని ఎంత వల్గర్గా, ఎంత చీప్గా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత అసభ్యంగా చెప్పగలుగుతావన్నదే స్కిల్కు పారామీటర్. ఇందులో ప్రధానంగా ఐదు దశలున్నాయి. 1.తప్పుడు (ఫేక్) అంశాలను రకరకాల రూపాల్లో ప్రచారంలో పెట్టడం 2. ఫొటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను మార్ఫింగ్ చేసి నిజం అనిపించేలా వదలడం 3. ఒక నాయకుడి వ్యక్తిత్వం హననమయ్యేలా బ్రాండింగ్ చేయడం (పప్పూలా) 4. నిజాలకు మసిబూసి అబద్ధాన్ని పదేపదే చూపించడం, వినిపించడం 5. పస ఉన్న అంశాలు చర్చలోకి, వెలుగులోకి రాకుండా వ్యక్తిగత అలవాట్లను, వేరే అంశాలను ప్రముఖంగా తెరపైన ఉంచడం. సత్యం చెప్పులు తొడుక్కునే లోపు, అబద్ధం ప్రపంచ ప్రదక్షిణ చేసి వస్తుందని సామెత. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ ఆలోపు సమాజానికి జరిగే నష్టమెంత? ఆ వ్యక్తికి, వ్యక్తిత్వానికి కలిగే కష్టమెంత? రాజకీయ నాయకుడైనంత మాత్రాన అతనికి పరువుండదా? కుటుంబం ఉండదా? మనసుండదా? మనం ఏది పడితే అది రాయడానికి అతడేమైనా ఆటవస్తువా?
‘అసలే కోతి, ఆపై కల్లు తాగిందన్నట్టు’… అసలే అ-రాజకీయం, దానికి ఈ సోషల్ మీడియా తోడైంది. ఎవడు ఎక్కువ ఫేక్ క్లిప్పులు తయారు చేసి జనం మీద జల్లితే వాడిదే గెలుపన్నట్టుగా మారుతున్నది. 2014కు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం గుజరాత్లో మొదలుపెట్టిన ఈ దందా, టెక్నాలజీ, ఇంటర్నెట్, సెల్ఫోన్ల విస్తృతితో పాటే దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నది. విలువల పార్టీలు, వందేండ్ల వయసున్న పార్టీలు దీనికి మహారాజ పోషకులు. వాటి దుర్మార్గాన్ని ఎదుర్కొనడానికి మిగిలిన పార్టీలు కూడా ఈ బాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి! ఈ సోషల్మీడియాకు ఎలాంటి కట్టడీ లేదు. ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పే నియంత్రణ వ్యవస్థ లేదు. అదుపుతప్పితే అడిగే నాథుడు లేడు. చర్యలు తీసుకునే చట్టం లేదు. జవాబుదారీతనం లేదు. బాధ్యులను జైలుకు పంపేందుకు కఠినమైన సెక్షన్లు లేవు. పత్రికలు రాయడానికి, టీవీల్లో పలకడానికి ఇబ్బంది పడే పదాలు కూడా సోషల్మీడియా పేరుతో విచ్చలవిడిగా వస్తున్నాయి. వ్యక్తిగత అలవాట్లను ప్రధానం చేసి, నాయకత్వ లక్షణాలను చిన్నచూపు చూసే అవలక్షణం సోషల్ మీడియా ప్రచారంలోని మరో ప్రధానాంశం. కుటుంబాలను, కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వారిని ఆవేదనకు, ఆత్మరక్షణకు లోను చేయడం మరో ముఖ్యాంశం. సమకాలీన సామాజిక, నైతిక విలువలేవీ సోషల్మీడియాకు పట్టవు. మర్యాద పాటించాలన్న ఇంగితం దానికి ఉండదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త చట్టాలు తెచ్చి కట్టడి చేయాల్సిన కేంద్ర పెద్దలే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తున్నపుడు పోలీసులు మాత్రం ఏం చేయగలరు? ‘ఫేక్ అయినా సరే.. వ్యాప్తి చేయడమే ముఖ్యం. ఎలా గెలిచామన్నది ప్రధానం కాదు; ఎన్నికల్లో గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అని యువతకు మీటింగులు పెట్టి సందేశాలిస్తున్నప్పుడు ఏమని సర్ది చెప్పుకోగలం? మనది మనం చెప్పుకోవడానికి ఏదీ లేక, ఎదుటివారి మీద బురదజల్లడం నేటి వ్యూహం. జీవితంలో దాపరికం ఉండనిదెవరికి? వ్యక్తిగతం లేనిదెవరికి? ఒక పార్టీకి, నాయకుడికి వ్యతిరేకంగా వచ్చే ప్రచారమేమో క్షణాల్లో మాయమవుతుంది. మరి కొందరి మీద నిందలేమో పుంఖానుపుంఖాలుగా వ్యాప్తి అవుతుంటాయి. ప్రభుత్వంగా చేయాల్సిన పని చేయకపోవడం, పాలనలోనూ రాజకీయాన్ని, ప్రత్యర్థులను చూడడం ఇందుకు కారణం. జన జీవితంలో ఉన్న నాయకులకు ఇప్పుడు ఒక చిక్కుప్రశ్న ఎదురై వెక్కిరిస్తున్నది. ప్రజల కోసం పనిచేయాలా? లేక సోషల్మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని ఎదుర్కొనాలా? తమ సమయాన్ని దేని కోసం కేటాయించాలి!
చిన్నపిల్లగాడు చాక్లెట్ను చూసి పరిసరాలను మరిచిపోయినట్టుగా, ఇవాళ గ్రామీణ భారతం సెల్ఫోన్ సంబురంలో మునిగిపోయింది. దీనికి తోడు అగ్గువకే అందుతున్న ఇంటర్నెట్. సోషల్మీడియాకు ఇంకేం కావాలి? కండ్ల ముందు కనిపించే సత్యాన్ని చూడకుండా చేసేందుకు, అది మాయా దర్పణాలను ప్రయోగిస్తున్నది. కొంత డ్రామా, తమాషా, అర్ధ సత్యం, అసత్యం, ఏదైతేనేం.. నవ్వించాలి, ఆ మత్తులో ముంచాలి, బ్యాడ్ ముద్ర వేయాలి. రాసేవాడూ ఫేకే, వేసేవాడూ ఫేకే, రాసేదీ ఫేకే! ఇదీ పరిస్థితి. ఇదీ నేటి రాజకీయం. అబద్ధాల ప్రచారం, మనకు ఇష్టమున్నా లేకున్నా, అవసరమున్నా కాకున్నా, సునామీలా మనల్ని చుట్టుముడుతున్నది. మీద వచ్చి పడుతున్నది. మనకు చేరేది, మనం పంచేది నిజమో కాదో మనకే తెలియని పరిస్థితి. దాన్ని మనదాకా చేర్చింది ఎవడో కూడా మనకు తెలియని దుస్థితి. మనం మరోవైపు చూడకుండా ఫోనుకు కట్టి పడేస్తున్నది. నిజానిజాల వివేచన రాకుండా మన మెదడును బంధిస్తున్నది. ఉద్వేగాలు కలిగిస్తున్నది. ఉద్రేకాలు రేకెత్తిస్తున్నది. రెచ్చగొడుతున్నది. భయపెడుతున్నది. నమ్మిస్తున్నది. నవ్విస్తున్నది. ఆ నవ్వులోనే మన ఆలోచనను చంపేస్తున్నది. మనం శ్రోతలమా? వీక్షకులమా? పాత్రధారులమా? భాగస్వాములమా? మనకే తెలియదు. వాట్సాపో, ఫేస్బుక్కో, ట్విట్టరో, ఇన్స్టానో.. ఏదైతేనేం.. ఏదో ఒక గోడమీది నుంచి ముచ్చట మన ముంగిట్లో వాలుతూనే ఉన్నది. మన నిర్ణయాత్మక శక్తిని పరిహాస ప్రాయం చేస్తూ!
స్వాతంత్య్రం వేరు, స్వేచ్ఛ వేరు. నీతి, నిజాయితీ, బాధ్యత అనే పగ్గాల పరిధిలో మసులుకుంటే అది స్వాతంత్య్రం. తమకు ఏ నియమ నిబంధనలూ వర్తించవనే దురహంకారం స్వేచ్ఛ. వాక్స్వాతంత్య్రం ఉంటుందే తప్ప వాక్ స్వేచ్ఛ కాదు. ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే మన స్వాతంత్య్రం పరిధి. విమర్శకు విశృంఖలత్వానికి మధ్య తేడా చెరిగిపోయినప్పుడు కలిగే సంక్షోభం ఏదో ఒకనాడు దాని సృష్టికర్తలనూ చుట్టుముడుతుంది.
రాజకీయమంటే ఇది కాదేమో! మరి మనమేం చేయాలి? సెల్ఫోన్లో కనిపించిన ప్రతిదీ నమ్మకపోవడం, వినిపించిన ప్రతిదీ సత్యం కాదనుకోవడం ఇదీ తక్షణావసరం. నిజాన్ని నిజంగా గుర్తించగలిగిన మానసిక సమతుల్యత ఇప్పటి అవసరం. కన్నది, విన్నది కాదు, మూలాన్ని గురించి ఆలోచించాలి. ఏది అవసరమో, ఏది కాదో, దేన్ని పట్టుకోవాలో, దేన్ని వదలిపెట్టాలో తేల్చుకోవాల్సింది మనమే. మనం రాసేది, పోస్ట్ చేసేది, ఫార్వార్డ్ చేసేది సామాజిక బాధ్యతతో చేస్తున్నదేనా? అని ఒకసారి మనకు మనమే ప్రశ్నించుకోవాలి. లిటరసీ కాదు; మనకిప్పుడు న్యూస్ లిటరసీ కావాలి! రాజకీయ చైతన్యం కాదు; రాజకీయ జ్ఞానం కావాలి!!
– తిగుళ్ల కృష్ణమూర్తి