ఖమ్మం, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి గత విద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో రెండు జతల యూనిఫాం పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందనేలేదు. కొన్ని పాఠశాలల్లో మొదటి జత అందినప్పటికీ రెండో జత కనీసం ఒక్క విద్యార్థికి కూడా అందలేదంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు యూనిఫాం తయారు చేయడానికి గాను నాణ్యత కలిగిన తగిన వస్ర్తాన్ని తనిఖీ చేసి నేరుగా మండల కేంద్రాలకు అందించేవారు.
అక్కడి నుంచి పాఠశాలలకు వస్త్రం పంపిణీ అయ్యాక పాఠశాల విద్యాకమిటీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు తగిన టైలర్లను ఎంపిక చేసి వారికి వస్ర్తాన్ని అందించేవారు. తమ గ్రామంలోనే టైలర్ ఉండటంతో దుస్తులు ఎలా తయారవుతున్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించేవారు. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే విద్యార్థులకు యూనిఫాం సిద్ధమయ్యేది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంవత్సరం తొలిరోజున యూనిఫాం అందించిన పాపానపోలేదు. ప్రారంభం రోజున యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా.. ఇంకా జిల్లాకు వస్త్రం కూడా చేరలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వస్త్రం వచ్చేదెప్పుడో.. కుట్టేదెప్పుదో.. విద్యార్థులకు ఇచ్చేదెప్పుడో.. అని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక గత పాలకుల కంటే భిన్నంగా స్కూల్ యూనిఫాం మరింత నాణ్యతతో అందిస్తామని బీరాలు పలికింది. ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు. గత ఏడాదిలానే ఈ విద్యాసంవత్సరం సైతం వస్త్రం పంపిణీలో తీవ్రం జాప్యం జరిగింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వస్ర్తాన్ని పాఠశాలల వారీగా విద్యార్థులకు అవసరమైన వస్ర్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచి వాటిపై వివరాలతో లేబుల్ వేసి పంపిణీ చేసేవారు. దీంతో వస్త్రం అన్ని పాఠశాలలకు సక్రమంగా కొలతల ప్రకారం పంపిణీ అయ్యేది. గత ఏడాది సర్కార్ తప్పిదం కారణంగా యూనిఫాం తయారీకే వస్త్రం పంపిణీ ఆలస్యంకావడంతో పాఠశాలల వారీగా క్లాత్ ప్యాకెట్లను తయారు చేసి పంపిణీ చేసింది. కానీ, ఈ విద్యాసంవత్సరం ఇంకా వస్త్రమే చేరలేదు.
విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ పని కేవలం స్వయం సహాయక మహిళా సంఘాలకు చెందిన టైలర్లు మాత్రమే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. సరిపడా శిక్షణ కలిగిన టైలర్లు డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో నడిచే మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన వారు లేకపోవడంతో ఏకరూప దుస్తుల తయారీ గత ఏడాది అస్తవ్యస్తమైంది. ఖమ్మం జిల్లాలో విద్యాసంవత్సరం ముగిసే వరకు దుస్తులు తయారు చేస్తూనే ఉన్నారు. సర్కార్కు ముందుచూపు లేకపోవడం, అనుభవం, అవకాశం లేకపోయిన జిల్లాలోని డీఆర్డీఏ అధికారులు పట్టుబట్టి తామే దుస్తులు తయారు చేయిస్తామని వస్ర్తాన్ని తీసుకోవడంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు.
ఖమ్మం జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మండలాల వారీగా 424 మంది టైలర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. కానీ, కుట్టేందుకు మాత్రం వస్త్రం అందలేదు. ఇంకా పాఠశాలల పునః ప్రారంభానికి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. వస్త్రం ఇప్పుడు జిల్లాకు చేరినా విద్యార్థులకు అందడానికి కనీసంగా 30 నుంచి 45 రోజుల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు యూనిఫాం ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా అందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని ప్రైమరీ, హైస్కూళ్లలో దాదాపు 70వేలకు పైగా విద్యార్థులున్నారు. వీరికి రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందజేయాల్సి ఉంది. వస్త్రం జిల్లాకు చేరి కుట్టేదెప్పుడో, పంపిణీ చేసేదెప్పుడో, విద్యార్థులు వేసుకునేదెప్పుడో వేచిచూడాలి.