కంది, జూన్ 7: ఐఐటీ హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దాదాపు 200 మంది ఆధ్యాపకులు, సిబ్బంది, క్యాంపస్ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన క్యాంపస్ వాతావరణాన్ని నిర్వహించడంలో ఐఐటీహెచ్ చేస్తున్న కృషికి ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ నుంచి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ఐఐటీ హైదరాబాద్ను ఆదర్శ వాహన రహిత క్యాంపస్గా ప్రకటించారు. వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, శారీరక దృఢత్వం, పర్యావరణ బాధ్యత, సంస్కృతిని పెంపొందించడంలో ఐఐటీహెచ్ కనబర్చిన నిబద్ధ్దతనూ గుర్తిస్తూ జాన్ 7న హైదరాబాద్లో ఫిట్ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపును అధికారికంగా ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. పర్యావరణ రహిత రవాణా కోసం మేము చేస్తున్న కృషికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ నుంచి జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు.
సైక్లింగ్ అనేది కేవలం శారీరక ధృడత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఆదర్శ వాహన రహిత క్యాంపస్గా గుర్తింపు రావడం.. ఆరోగ్యకరమైన, స్థిరమైన మానవ కేంద్రిత క్యాంపస్గా నిర్మించడంలో మా నిబద్ధ్దతను తెలియజేస్తుందన్నారు. సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఇతర క్రీడల ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ క్రీడల ఫ్యాకల్టీ ఇన్చార్జి డాక్టర్ హిమాన్షు జోషి, సిబ్బంది పాల్గొన్నారు.