రెక్కాడితే గానీ డొక్కాడని ఆటోవాలా ఆకలితో అలమటిస్తున్నాడు. జీవితాన్ని దినదిన గండంగా గడుపుతున్నాడు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిని తీవ్రంగా దెబ్బకొట్టింది.
సమైక్య పాలకుల నిర్లక్ష్య వైఖరి, కుట్రల కారణంగా తెలంగాణ పల్లెల్లోని అనేకమంది యువకులు బొంబాయి, దుబాయి బాటపట్టారు. తల్లిదండ్రులను విడిచి వెళ్లలేని వారు, సాగు భూముల్లేని వారంతా బతుకుదెరువు కోసం ఆటోవాలాల అవతారమెత్తి కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారిలో అత్యధికులు అప్పులు చేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద లోన్లు తీసుకొని ఆటోలు కొన్నవారేనన్నది జగమెరిగిన సత్యం. పగలనక, రాత్రనక కష్టపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోవాలాల జీవితాల్లో కాంగ్రెస్ రాకతో అసలైన ‘మార్పు’ మొదలైంది.
తెలంగాణలో లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 10 లక్షల కుటుంబాలు దీనిపైనే ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరో 4 లక్షల కుటుంబాలు ఆధారపడుతున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక అందరి బతుకులు బాగుపడ్డట్టే, ఆటోవాలాల జీవితాల్లోనూ వెలుగులు విరజిమ్మాయి. ఆటో డ్రైవర్ల స్థితిగతులు, సాధకబాధకాలపై అవగాహన ఉన్న నేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో వాళ్ల పరిస్థితులు మెరగయ్యాయి. అధికారంలో వచ్చిరాగానే, 2014లో ఒకేఒక్క సంతకంతో ఆటోల రోడ్డు ట్యాక్స్ను రద్దు చేసిన మహనీయుడు కేసీఆర్. 2015లో మరో అద్భుతమైన కార్యక్రమాన్ని అప్పటి కేసీఆర్ సర్కార్ అమలు చేసింది. ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లించి, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించి, వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారు కేసీఆర్.
హైదరాబాద్లో ఆటోల కొనుగోలుకు పర్మిట్లు తీసుకోవడం సమైక్య రాష్ట్రంలో చాలా కష్టంతో కూడుకున్న పని. పర్మిట్లు ఇచ్చేందుకు అప్పటి పాలకులు కావాలనే తాత్సారం చేసేవారు. 2015లో జీవో నెం.36 ద్వారా కేసీఆర్ ఈ విధానాన్ని సమూలంగా మార్చేశారు. ఒకేసారి 8 వేల ఆటోలకు పర్మిట్లు ఇచ్చి ఆటో డ్రైవర్లను యజమానులుగా చేసిన ఘనత కేసీఆర్దే. దీంతో పాటు 100 శాతం సబ్సిడీతో 2 వేల మంది మైనారిటీలకు ఆటోలను అందించి వారి కుటుంబానికి ఉపాధి మార్గం చూపించారు.
ఫిట్నెస్ పెండింగ్లో ఉంటే గడిచిన కాలానికి కూడా రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీతో సహా చెల్లించాలంటూ కేంద్రంలోని మోదీ సర్కార్ జీవో నెం.714 తీసుకురాగా దాన్ని కేసీఆర్ సమర్థంగా అడ్డుకున్నారు. తెలంగాణ బిడ్డలు కట్టనవసరం లేదని పేర్కొంటూ, ఆటోవాలాలపై ఆర్థిక భారం పడకుండా కేసీఆర్ ఆదుకున్నారు.
కేసీఆర్ హయాంలో ఏ చింతా లేకుండా బతికిన ఆటో డ్రైవర్లు నేడు ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నారు. రేవంత్రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా గిరాకీల్లేక ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమవుతున్నాయి. గ్రామాల నుంచి నగరాల వరకు ఇదే పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇప్పటికే అనేకమంది తనువులు చాలించారు. తాజాగా ప్రజాభవన్ సాక్షిగా ఓ డ్రైవర్ తన ఆటోను కాల్చేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు కూరగాయలు, పూలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్లే మహిళా రైతులు, వర్తకులు గతంలో ఆటోలనే ఆశ్రయించేవారు. కానీ, ప్రస్తుతం వారంతా ఎంత రద్దీగా ఉన్నా సరే బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకొనే కొంతమంది ఉద్యోగినులు సైతం ఉచిత బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలు తదితర కిరాయిలు కూడా ఉండటం లేదు. మహిళలకు ఉచితం కావడంతో వారితో పాటే కుటుంబంలోని పురుషులు కూడా బస్సుల్లోనే తిరుగుతున్నారు.
గిరాకీ లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫైనాన్స్లు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు, ఇతర ఈఎంఐలు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. దీంతో ఈ రెండు నెలల కాలంలో సుమారు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి కిరాయిలు, ఈఎంఐలను ఊహించుకొని బెంబేలెత్తి గుండెపోటుతో తనువు చాలిస్తున్నారు. జనవరి 5న సతీశ్ గౌడ్, నర్సింహాగౌడ్ (మెదక్ జిల్లా కుచెన్పల్లి), వేముల సత్యనారాయణ (స్టేషన్ ఘనపూర్), అనిల్కుమార్, అక్బర్ (ఇల్లెందు), రాహుల్ (బండ్లగూడ్ జాగీర్), ఎస్కే గులాం (నాగర్కర్నూల్ జిల్లా) ఇలా ఒకరా.. ఇద్దరా.. 14 మంది మరణించి తమ కుటుంబాలను అనాథలను చేసివెళ్లిపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరవాలి. లేకపోతే జరగబోయే అనర్థాలకు రేవంత్రెడ్డి సర్కారే బాధ్యత వహించకతప్పదు.
– ఎల్.రూప్సింగ్