రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోగా.. అంతర్జాతీయ యవనికపై మరో వివాదం రాజుకుంటున్నది. తైవాన్ కేంద్రంగా అమెరికా-చైనా వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. తైవాన్పై చైనా ఆంక్షల పర్వానికి కూడా తెర లేపింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే పండ్లు, చేపలు, టీ, తేనె మొదలైన వాటిపై నిషేధం విధించింది. అంతేకాదు, తైవాన్ ద్వీపం చుట్టూ ఉన్న సముద్రజలాల్లో ఐదు రోజులపాటు సైనిక విన్యాసాలు జరుపుతామని తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తామూ చూస్తూ ఊరుకోబోమని, అన్ని విధాల సిద్ధమయ్యే ఉంటామని తైవాన్ రక్షణశాఖ బదులిచ్చింది.
దశాబ్దాలుగా చైనా-తైవాన్ వివాదం కొనసాగుతున్నప్పటికీ.. అమెరికా దిగువసభ స్పీకర్ నాన్సీ పెలోస్కీ పర్యటన అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అమెరికాకు చెందిన ఒక ఉన్నతస్థాయి రాజకీయవేత్త తైవాన్లో పర్యటించటం గత 25 ఏండ్లలో ఇదే తొలిసారి. పెలోస్కీ రాకకు ముందే చైనా గట్టిగా హెచ్చరించింది. ఇది నిప్పుతో చెలగాటం వంటిదని, చైనా-అమెరికా దౌత్యసంబంధాల పునాదినే ఈ పర్యటన కదిలిస్తుందని, జరుగబోయే పరిణామాలకు పూర్తిగా అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అయినప్పటికీ, అమెరికా పెలోస్కీ పర్యటనను ఖరారు చేసింది. ఆమె తాయ్పీని సందర్శిం చి అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్తో సమావేశమై తైవాన్ను ప్రజాస్వామ్యానికి సంకేతంగా, ఆదర్శంగా అభివర్ణించారు. తైవాన్ను తమ దేశ అంతర్భాగంగా భావించే చైనాకు ఈ మాటలు సహజంగానే కోపం తెప్పించాయి. దీంట్లోభాగమే ఆంక్షలు, సైనిక విన్యాసాలు.
చైనాకు ఆగ్నేయంగా 160 కి.మీ.ల దూరంలో ఉండే చిన్న ద్వీపం తైవాన్. తొలి నుంచి చైనా రాజవంశాల నియంత్రణలో ఉన్న ఈ ద్వీపాన్ని 1895లో జపాన్ స్వాధీనం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత తిరిగి చైనా ఆధీనంలోకి వెళ్లింది. చైనాలో 1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావటంతో వారి ప్రత్యర్థి అయిన చియాంగ్కైషేక్ తైవాన్కు పారిపోయి, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం నిరంకుశంగా పాలించాడు. చైనా తొలి నుంచీ తైవాన్ను తన అంతర్భాగంగానే భావిస్తూ వచ్చింది. అంతర్జాతీయంగా కూడా తైవాన్కు ఒకదేశంగా గుర్తింపు లేదు. అమెరికా సైతం ఆ దేశంతో అనధికార సంబంధాలనే కొనసాగిస్తున్నది. 2016లో త్సాయ్ ఇంగ్ వెన్ అధ్యక్షురాలు అయిన తర్వాత తైవాన్ స్వతంత్రదేశం అనే భావన పెరిగింది. దీంతో తైవాన్పై చైనా ఒత్తిడీ అధికమైంది. అవసరమైతే సైనికచర్యతోనైనా కలిపేసుకుంటామన్న హెచ్చరికలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పెలోస్కీ పర్యటన ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఇది మరో అంతర్జాతీయ సంక్షోభంగా మారకుండా అమెరికా, చైనా, తైవాన్తోపాటు ప్రపంచదేశాలు కూడా చర్యలు తీసుకోవాలి. చిన్నదేశం అనుకున్న ఉక్రెయిన్.. రష్యాను కొన్ని నెలలుగా దీటుగా ఎదుర్కొంటున్న వాస్తవాన్ని చైనా కూడా గుర్తించాలి. ప్రస్తుత ఆధునిక కాలంలో ఆయుధాలతో దేశాల్ని గెలవలేమని, చర్చలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని గుర్తెరిగి ప్రవర్తించాలి.