ఎఫ్పుడూ బీజేపీనేనా? మమ్మల్ని పలెత్తు మాట అనచ్చు కదా? లేకుంటే ప్రజల్లో మా గ్రాఫ్ పడిపోదా? అని ఇంతకాలం కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ను నిష్టూరంగా మాట్లాడేవారు. ఇప్పుడేమో అచ్చంగా అదే మాట బీజేపీ అభిమానులు అంటున్నారు. ఇటీవల జరిగిన రెండు బహిరంగ సభల్లో కేసీఆర్ బీజేపీ పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ను మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటని ఇటు బీజేపీ వాళ్లు, అటు రాజకీయ విశ్లేషకులతో పాటుగా మీడియా వాపోతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమంటే కేసీఆర్ నాలుగు మాటలు అంటే తప్ప ఓట్లు పడవని కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఇంతకాలం తిట్టి.. సరిగ్గా ఎన్నికలు దగ్గరపడేసరికి తిట్టకుంటే ఎట్లా సార్ అని కమలనాథులు అండ్ కో వాపోతున్నారు.
పొలిటికల్ కమెడియన్లలో పాల్, షర్మిల, బండి సరసన వీహెచ్ను కూడా అర్జంట్గా చేర్చాల్సిందే. దళితబంధులో కమీషన్లు తీసుకోవడం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ సిటిజన్ వీహెచ్ సవాల్ విసిరారు. ఈ ప్రకటనను అధికార పార్టీ పట్టించుకుందో, లేదో తెలియదు కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ‘సరిగ్గా వినపడలేదు, మరొకసారి చెప్పు’ అని ఆశ్చర్యపోయినంత పనిచేశారు. వీహెచ్కు రాజ్యసభ పదవీకాలం ముగిసి చాలా ఏండ్లయింది. అప్పటినుంచి ఆయన్ను వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్డ్మెంట్ స్కీమ్) నేతగానే పార్టీలో భావిస్తున్నారు. తాను అధిష్ఠానాన్ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వడం లేదని వీహెచ్ స్వయంగా మీడియా ఎదుట కూడా వాపోయిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా రాజకీయాల నుంచి తప్పుకునేది ఏంటన్నది డౌట్. కొసమెరుపు ఏమంటే, ఆ మధ్య రామ్గోపాల్ వర్మ గురించి వీహెచ్ ఏదో కామెంట్ చేస్తే… ఇంకా ఆ పెద్దాయన ఉన్నారా? అని వర్మ ఆశ్చర్యపోయారు.
మునుగోడులో గెలుపు గ్యారంటీ అనుకుంటే ఓటమి తప్పలేదు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరుతారనుకుంటే వాళ్లు హ్యాండ్ ఇచ్చారు. కర్ణాటకలో గెలిస్తే ఆ ఊపుతో తెలంగాణలో పాగా వేయొచ్చనుకుంటే అదీ కుదరలేదు. ఇలా కమలనాథుల అంచనాలన్నీ తారుమారు కావడం ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులను కూడా కాపాడుకోవడం కష్టమేనని బీజేపీ అధినాయకత్వం జంకుతున్నది. అందుకోసమే అర్జంట్గా పార్టీ అధ్యక్షుడిని మార్చడమా? లేక అధ్యక్షుడిని డమ్మీ చేసి ఎలక్షన్ టీమ్గా కొత్త కమిటీని వేయడమా? ఏదో ఒకటి చేయకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని పసిగట్టే ఈటలను హుటాహుటినా ఢిల్లీకి పిలిపించుకున్నట్టు వినికిడి.
– వెల్జాల