భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు. దీనికి కారణం ‘ఆర్థిక అక్షరాస్యత’ (ఫైనాన్సియల్ లిటరసీ)కు తగినంత ప్రోత్సాహం కల్పించకపోవడం అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
‘ఆర్థిక విద్య’ లేకపోవటంతో, అవగాహనా లోపం కారణంగా వ్యక్తులు ఆర్థిక నిర్ణయాలు దృఢంగా తీసుకోలేక పోతున్నారు. తద్వారా వారికి ఆర్థిక సంస్థలపై విశ్వాసం సన్నగిల్లి, దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ప్రపంచ సగటు 35%తో పోలిస్తే భారతదేశ ఆర్థిక అక్షరాస్యత రేటు 24% మా త్రమే. యుఎస్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో వరుసగా 57%, 68% అక్షరాస్యత ఉండటం ఆశ్చర్యం. భారతదేశారిచ ఇతర దేశాలకు మధ్య నెలకొని ఉన్న ఈ ‘ఆర్థిక అక్షరాస్యత’ అంతరాన్ని తొలగించడానికి , ఆర్థిక విద్యను భారతదేశ విద్యా వ్యవస్థలో విలీనం చేయాల్సిన అవసరమున్నది. అంతేకాకుండా జీవిత ప్రారంభంనుంచి యువతకు ఆర్థిక అవసరాలకు సంబంధించిన జ్ఞానం, నైపుణ్యాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. దేశ జనాభాలో కేవలం 76% వయోజనులకు మాత్రమే ప్రాథమిక ఆర్థిక అంశాలలో అవగాహన ఉంది. ప్రస్తుతం, మన దేశంలో కేవలం 5.5% పాఠశాలలు మాత్రమే ఆర్థిక విద్య కోర్సులను అందిస్తున్నాయి. ఆర్థిక విద్య పిల్లలకు బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి ప్రాథమిక ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ నైపుణ్యాలు డబ్బును మరింత ప్రభావవంతంగా నిర్వహించడంలోనూ, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడంలోను వారికి సహాయపడతాయి. ప్రభుత్వం ఆర్థిక విద్యాబోధనకు మరింత ప్రాధాన్యమిచ్చి అన్ని పాఠశాలలలో విద్యార్థులకు ఆర్థిక లావాదేవీలకు సం బంధించిన కొంత ఆర్థిక పరిజ్ఞానాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలి.
ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి,ఆర్థిక ఉత్పత్తులు, సేవలపై అవగాహన కల్పించడానికి భార త ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ)ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీఎఫ్ఈ జనాభాలోని వివిధ వర్గాలలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నది. మహిళలు, గ్రామీణ సంఘాలు, తక్కువ ఆదాయ కు టుంబాలు వంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. వారికి విద్యా వనరులు, శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించిన పరిశోధనలను తెలియజేయడం, అంతేకాకుండా ఆర్థిక మోసాలు, వాటి అ వగాహనను పెంచడానికి ఈ మిషన్ తోడ్పడుతుంది.
ఎన్సీఎఫ్ఈ ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ‘నేషనల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్’, ‘ఫైనాన్షియల్ లిటరసీ వీక్’ ఎంచుకోతగ్గవి. పాఠశాలలకు సంబంధించి ప్రామాణికమైన ‘ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాల’ అభివృద్ధి కూడా ఇందులో భాగమే. దేశవ్యాప్తంగా ఆర్థిక విద్యను ప్రోత్సహించడానికి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు పని చేస్తున్నాయి. మొత్తమ్మీద, భారతదేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ) దేశంలో ‘ఆర్థిక అక్షరాస్యత, విద్యను’(ఫైనాన్సియల్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్) ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, వ్యక్తులు, సంఘాలు వారి ఆర్థిక విషయాల గురించిన సమాచారం అందించి ఎవరికి వారు నిర్ణయాలు తీసుకునేలా శక్తివంతం చేయడంలోనూ సహాయపడుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సహా ప్రైవేట్ రంగ కంపెనీలు ప్రజలకు బడ్జెట్, పొదుపు, పెట్టుబడి, క్రెడిట్ నిర్వహణలను గురించిన అవగాహన కల్పించడానికి వర్క్షాపులు, సెమినార్లు, ఆన్లైన్ కోర్సులను నిర్వహించే ‘ఆర్థిక అక్షరాస్యత’ కార్యక్రమాలను కూడా చేపట్టారు. డిజిటల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, క్రిప్టోకరెన్సీ పెరుగుదలతో, పాఠశాల విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యత ప్రా ధాన్యత మరింత పెరిగింది. ఆర్థిక ని ర్వహణ ఎవరికి వారు సొంతంగా చేసుకునేలా కరోనా మహమ్మారి ఆర్థిక అక్షరాస్యత పాఠాలను నేర్పింది.
దేశంలోని ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ వంటి నియం త్రణ సంస్థలు చిన్న వ్యాపారాలలో ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తాయి. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి కాబట్టి , ఆర్థిక అక్షరాస్యత కలిగిన చిన్న వ్యాపార యజమానులు ఫైనాన్సింగ్, పెట్టుబడి పెట్టడం, నగదు ప్రవాహాన్ని నిర్వహించడం వంటి లావాదేవీలకు సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకోవచ్చు, ఇది మెరుగైన ఆర్థిక ఫలితాలకు దారి తీస్తుంది. అదనంగా, ఇది వివిధ ఆర్థిక ఉత్పత్తులు, సేవల నష్టాలను, ప్రయోజనాలను అర్థం చేసుకోవడంలో వ్యక్తులకు సహాయపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమైనవి అయినప్పటికీ, భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత స్థాయులను మరింత మెరుగుపరచడానికి దీర్ఘకాలిక ప్రయత్నం చాలా అవసరం.
ఆర్థిక అక్షరాస్యత స్థాయులను పెంచడం వల్ల పేదరికాన్ని తగ్గించవచ్చు. దేశాభివృద్ధికి అవసరమైన ఆర్థి క వృద్ధిని పెంచవచ్చు. ఏదేమైనప్పటికీ, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యక్తులు తమ ఆర్థిక నిర్వహణ గురిం చి అవగాహన చేసుకోవడానికి చొరవ తీసుకోవడం, తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సమాచార ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆర్థిక విద్యను విద్యావ్యవస్థలో చేర్చడం, దేశంలోని వయోజనులకు ఈ విద్యను అందుబాటులో ఉంచడం చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలంటే, ఆర్థిక అక్షరాస్యత మొత్తం ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఆర్థిక అక్షరాస్యత అనేది ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, పౌర సమాజం, విద్యాసంస్థలతో సహా బహుళ వాటాదారులతో కూడిన సహకార ప్రయత్నంగా ఉండాలి. ఆర్థిక విద్య సమాజంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరాల్సిన అవసరం ఉన్నది.
కృష్ణకుమార్ వేపకొమ్మ