కిసీ సే నా కెహ్నా. 1983లో వచ్చిన సినిమా అది. కథలో.. అప్పుడే పెండ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఓ ఊర్లో దిగుతారు. అక్కడ ‘హనీమూన్ హోటల్’ పేరుతో ఉన్న హోటల్ బాగా పాపులర్ అని తెలుసుకొని గుర్రపు టాంగాలో అక్కడికి బయలుదేరుతారు. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత దాని పేరు హనుమాన్ హోటల్గా మార్చి ఉంటుంది. హానీమూన్ హోటల్ కాస్తా హనుమాన్ హోటల్ ఎందుకయ్యిందని ప్రొప్రైటర్ను వాళ్లు ఆరా తీస్తారు కూడా. ఇన్నేళ్లలో ఈ సినిమాను, ఆ దృశ్యాన్ని కొన్ని లక్షల మంది అనేకసార్లు వీక్షించారు. ఇప్పటివరకు ఎవరికీ అందులో అభ్యంతరాలేవీ కనిపించలేదు.
40 ఏండ్ల కిందట విడుదలైన ఆ సినిమాలో ఓ దృశ్యం ఇన్నాళ్లకు అభ్యంతరకరంగా మారుతుందని, ఆ సీన్ను ట్వీట్ చేసిన వాళ్లపై కేసు నమోదవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఆ దృశ్యాన్ని ట్వీట్ చేసి ఓ యువకుడు జైలుపాలయ్యాడంటే నమ్మగలమా? కానీ విద్వేష శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ కాలంలో అటువంటివి కూడా మన కండ్ల ముందే జరుగుతాయని రుజువవుతున్నది. సామరస్యాన్ని హరించే ఘటనలను ఎలుగెత్తి చాటుతున్న ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబేర్ను ‘కిసీ సే నా కెహ్ నా’ సినిమాలోని సదరు సన్నివేశాన్ని ప్రస్తావించినందుకు నేరస్థుడిగా ముద్ర వేశారు. నిత్యం కొన్ని వందల నకిలీ వార్తల నిగ్గు తేల్చే బాధ్యతను నెత్తికెత్తుకొని సోషల్ మీడియాలో ఓ టార్చ్లైట్లా నిలిచిన జుబేర్ 2018లో ఓ ట్వీట్ చేశారు. 2014 తర్వాత మారుతూ వస్తున్న మత రాజకీయాల పరిస్థితిపై సూటి విమర్శ చేస్తూ అందుకు దృశ్యరూపకంగా ‘హానీమూన్ హోటల్’ ఫొటోను ట్వీట్ చేశారు. ఆయన ఆ ట్వీట్ చేసే కంటే మునుపే ఆ ఫొటోను కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అకస్మాత్తుగా హనుమాన్ భక్త్ పేరుతో 2019 అక్టోబరులో పుట్టుకొచ్చిన ఓ ట్విట్టర్ అకౌంట్ జుబేర్ను లక్ష్యంగా చేసుకున్నది. ఆ ఫొటో ద్వారా హనుమాన్ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ 2022 జూన్ 19న పోలీసులకు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు.
అరబ్ దేశాల్లో భారతీయ వస్తువులపై నిషేధం విధించేలా, దేశవ్యాప్తంగా మత ఘర్షణలు, హత్యలు చెలరేగే విధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్శర్మపై ఎన్ని కేసులు నమోదైనా ఇప్పటివరకు ఏ చర్యా తీసుకోలేని పోలీసులు.. జుబేర్ విషయంలో మాత్రం మెరుపువేగంతో స్పందించారు. ట్వీట్లో ఫిర్యాదు అందిన కొన్ని నిమిషాల్లోనే తెల్లవారుజాము 2 గంటల వేళ ఆగమేఘాలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన రెండ్రోజుల తర్వాత హనుమాన్ భక్తుడు ట్విట్టర్ నుంచి మాయమైపోయాడు. జుబేర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతకీ జుబేర్ చేసిన అసలు తప్పేమిటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ఎండగట్టడం. గత ఏడాది రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఓ రైతు మరణంపై పలువురు సీనియర్ జర్నలిస్టులు ట్వీట్ చేసినందుకు వారిపై ఢిల్లీ పోలీసులు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు వారివైపు నిలబడడంతో తృటిలో వారు జైలు శిక్ష తప్పించుకోగలిగారు. కానీ, ఇప్పుడు జుబేర్ను మాత్రం లక్ష్యంగా ఎంచుకున్నారు. ముస్లిం మహిళలపై లైంగికదాడి జరిపి, హిందూ ధర్మాన్ని రక్షించాలంటూ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా భజరంగ్ముని అనే సాధువు చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించాడన్న కోపంతో జుబేర్పై మరో కేసు నమోదు చేశారు.
విద్వేష వ్యాఖ్యలు చేయడం నేరమైతే అటువంటి వారిని వదిలేసి దాన్ని ప్రశ్నించిన జుబేర్పై నేరస్థుడిగా ముద్ర వేయడం దేశంలో చట్టాలు అమలవుతున్న తీరుకు పరాకాష్ఠ. తాము ప్రసారం చేసిన వార్తపై కేవలం సందేహం వ్యక్తం చేసినందుకు ఓ హిందూత్వ చానల్ జుబేర్పై ఫిర్యాదు చేసి, పోలీసులతో కేసు నమోదు చేయించి కసి తీర్చుకొని దాన్నొక విజయంగా చాటుకున్నది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న అరాచక పరిస్థితులకు ఇదొక ఉదాహరణ. చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తులే ఆ చట్టాలను నిట్టనిలువునా దుర్వినియోగం చేస్తూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న దారుణ పరిస్థితి ఇది. దీనిని దేశవ్యాప్తంగా ప్రజలు, మేధావులు, పార్టీలు, విద్యార్థులు తీవ్రంగా ఖండించాలి.