‘మన దేశంలో రాజకీయాలన్నీ ఒక పార్టీ గెలుపు-మరో పార్టీ ఓటమి.. అన్నట్లుగానే సాగుతున్నాయి. కానీ, గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం’.. జాతీయపార్టీగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్న మాటలివి. ‘ప్రజలను గెలిపించేందుకు మేం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ద్వారా జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాం’.. ఆని ఆయన స్పష్టంగా ప్రకటించారు. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, ఈ దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ మార్క్ రాజకీయాలను భారత రాజకీయ యవనికపై చూడబోతున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని రాష్ర్టాల సమాఖ్యగా నిర్వచించారు. రాష్ర్టాలకు, కేంద్రానికి శాసన, పరిపాలన, ఆర్థిక అధికారాలు ఉండేలా చట్టాలను రూపకల్పన చేశారు. అధికారాలకు సంబంధించి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను రూపొందించారు. అయితే, కొన్ని అత్యవసర బాధ్యతలను తన వద్ద ఉంచుకొని, మిగతా అంశాలను రాష్ర్టాలకు అప్పగించాల్సిన కేంద్రం, అన్నింటినీ తన వద్దే ఉంచుకొని రాష్ర్టాల హక్కులను హరిస్తూ, పెత్తనం చెలాయిస్తున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో 70 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ విఫలమయ్యాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ను యూనిటరీ స్టేట్గా మార్చాయి. దీంతో రాష్ర్టాలు వాటి స్వయం ప్రతిపత్తిని కోల్పోయి కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ రెండు పార్టీలు కూడా ‘బలహీనమైన రాష్ర్టాలు-బలమైన కేంద్రం’ అనే ఎజెండానే అమలుచేశాయి. ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాలు తమ అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రాంతీయ రాజకీయ శక్తులను ఆశ్రయిస్తున్నా యి. దీంతో దేశంలో చాలాచోట్ల ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 70 ఏండ్ల పాలన ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతుల లేమితో కటకటలాడుతున్నారు. ఈ రోజుకూ దేశంలో విద్యుదీకరణకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. మంచినీరు, రహదారులు లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. భారతదేశంతోపాటు, ఆ తర్వాత స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుండగా, మన దేశంలో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయి.
దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్న ది. సాగుభూమి విస్తీర్ణం 41 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరాకు కావలసినంత నీరున్నప్పటికీ, కేంద్రం ప్రణాళికా లోపంతో సాగు నీరందడం లేదు. సరిపడా జల సంపద ఉన్నా దేశ ప్రజలు మాత్రం సాగు, తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దేశంలో నీటి యుద్ధాలు చెలరేగే పరిస్థితి ఉత్పన్నం కావడానికి కాంగ్రెస్, బీజేపీల అసమర్థ పరిపాలనే కారణం. దేశాన్నేలిన ఈ రెండు పార్టీ లూ ఆఖరికి దేశంలో ఉత్తర, దక్షిణ వివాదాలు, విభేదాలు చోటుచేసుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చాయి. ఎన్నో దేశాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మనం మాత్రం ఇంకా కుల, మత ఘర్షణలతో కాలం వెల్లదీస్తున్నాం.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్వావలంబన భారత్’ లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతులను పెంచుకుంటూ పోతున్నది. మోదీ హయాంలోనే చైనాతో భారత్ వాణిజ్యం భారీగా పెరుగుతున్నది. ఇప్పటికీ చైనా దిగుమతులపైనే మనం ఆధారపడే దుస్థితి ఉన్నది. 2021లో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం రూ.10,42,480 కోట్లుగా ఉన్నది. గత ఐదేండ్లలో చైనా నుంచి భారత్కు దిగుమతులు 30 శాతం పెరిగినట్టు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, అవలంబిస్తున్న ద్వంద్వవైఖరే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. విదేశాలపై ఆధారపడే ఈ దుస్థితి మారాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
భారతదేశానికి ఉన్న అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. మనకున్న వసతులకు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉండె. మన దేశంలోని మానవ వనరులను వాడుకోలేక పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమైపోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలను చైతన్య పరచాల్సి ఉన్నది. ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడిన తెలంగాణను, కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో గొప్పగా మనం అభివృద్ధి చేసుకొని, దేశానికే మాడల్గా నిలుపుతున్నపుడు.. రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. ఇన్నాళ్లు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం, జల వనరుల పాలసీ, విద్యుత్ పాలసీ, ఆర్థిక పాలసీ, పర్యావరణ పాలసీ, మహిళా సాధికారత విధానం తేవాల్సి ఉన్నది. అంతేకాకుండా విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రగతికాముక విధానాలను రూపొందించాల్సి ఉన్నదని కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ రోజు కేసీఆర్ ప్రతిపాదిస్తున్నది శుష్కమైన ఒక రాజకీయ కూటమిని కాదు. ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని. ప్రజాస్వామ్యయుతంగా పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన అనుభవం ఉన్నది. ఆ అనుభవం పునాదిగా దేశంలో గుణాత్మక మార్పును సాధించడానికే నేడు సీఎం కేసీఆర్ నడుం బిగించారు.
అటు ఉద్యమంలో, ఇటు పరిపాలనలో విజయవంతమైన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోనూ తప్పక విజయం సాధిస్తారని వివిధ రాష్ర్టాల నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన నేటిది కాదు. ఐదేండ్ల కిందటే 2018 మార్చి 3న హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో మొట్టమొదటిసారిగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పారు. అవసరమైతే తానే ఈ మార్పు కోసం ప్రయత్నిస్తానని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని నాడే ప్రకటించారు. వివిధ రాష్ర్టాల్లో పర్యటించి, దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతానన్నారు. ప్రజలను ఏకం చేస్తానని చెప్పా రు. తదనుగుణంగానే 2022 అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. తెలంగాణ అభివృద్ధిని దేశవ్యా ప్తం చేయాలన్నా, కేంద్రంలోని బీజేపీ విద్వేష, విభజన రాజకీయాలపై పోరాడాలన్నా.. బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందనే నమ్మకం దేశ ప్రజల్లో పాదుకుంటున్నది.
( వ్యాసకర్త : బీఆర్ఎస్ నాయకులు): పీఎల్ శ్రీనివాస్