వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజారిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ ఆదాయాలకు మించి భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వ్యవసాయరంగానికి ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి బయటపడవచ్చు.
కొన్నిసార్లు మార్కెట్ శక్తులు వ్యాపా రం పేరిట పాక్షిక ద్రవ్యోల్బణం కలిగిస్తాయి. కొన్నిసార్లు డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇలా ద్రవ్యోల్బణానికి అనేక కారణాలుంటాయి. ఆర్థికవ్యవస్థలో ద్రవ్య సరఫ రా పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్య ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థికవ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులున్నప్పటికీ భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని భావించి ప్రజలు అదనపు కొనుగోళ్లు చేయడం వల్ల ధరలు మరింత పెరిగితే దానిని ధరల ద్రవ్యోల్బణం అంటారు. ప్రభుత్వాలకు వచ్చే రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని కోశ సంబంధ ద్రవ్యోల్బణం అంటారు.
కరోనా సంక్షోభం, ద్రవ్యోల్బణం వల్ల చాలా ప్రపంచదేశాలు ఆర్థిక సమస్యలు, ఆహా రకొరత ఎదుర్కొని అప్పుల పాలవుతున్నా యి. 2019తో పోలిస్తే ప్రపంచపు అప్పు దాదాపు 35 శాతం పెరిగి 2021 నాటికి 226 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించడానికి ప్రపంచ దేశాలన్నీ భారీగా రుణాలు చేశాయి. 2019-2021లో ప్రపం చ వార్షిక సగటు ద్రవ్యోల్బణం 3.8 శాతం ఉంటే, 2022లో అది 7.9 శాతానికి చేరింది. ఈ ఏడాది అది 5.0 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. భారత్లో ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సి.రంగరాజన్ కమిటీ 3-5 శాతం ద్రవ్యోల్బణమైతే దేశ పరిస్థితులకు ఆమోదయోగ్యమ ని తెలిపింది. ద్రవ్యోల్బణం 6 శాతానికి మిం చితే అభివృద్ధి మందగిస్తుందని ఆర్థికవేత్తల విశ్లేషణ. గత ఏడాది కాలంలో ఆరు నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువ గా నమోదైంది. ఇటీవల వెనెజులాలో 222. 3 శాతం, లెబనాన్లో 206.2 శాతం, చైనా లో 2.1 శాతం, సౌదీ అరేబియాలో 2.2 శాతం, జపాన్లో 2.5 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
ఇప్పటికే శ్రీలంకలో వ్యవసాయం, రాజకీయ సంక్షోభం వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. అక్కడి ద్రవ్యోల్బణం ప్రజల జీవితాలను ఎంత దుర్భరంగా మార్చిందో ప్రపంచమంతా గమనించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ముందు చూపుతో వ్యవహరించకపోతే ప్రపంచమంతటా ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు, మేధావులు హెచ్చరిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు బాగా పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కొత్త మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కూడా బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు రద్దు చేయాలి. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని పెంచాలి.
2018 నాటికి భారత్ జీడీపీలో 70.44 శాతం ఉన్న రుణ భారం 2021 నాటికి 90.6 శాతానికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి చర్యల మీదనే ఆధారపడకుండా ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తేనే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో ఎగుమతులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం భారత్కు ఉంది. దేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం బలోపేతం అయినప్పుడే భారత్ అభివృద్ధి సాధిస్తుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు పెంపొందించాలి. 2050 నాటికి వ్యవసాయ సంక్షోభం వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభానికి కారణమైన వాతావరణ మార్పులను తగ్గించడానికి, వివిధ రకాల కాలుష్యాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, పారిశ్రామిక రంగ వృద్ధి కోసం మౌలిక సదుపాయాలను పెంపొందించాలి.
– డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
(వ్యాసకర్త: పౌర సంబంధాల అధికారి, కాకతీయ విశ్వవిద్యాలయము)