తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గిరిజనుల జీవితాలు వెలుగు లీనుతున్నాయి. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలుగా మార్చింది. గిరిజనులు ఆత్మాభిమానంతో సంతోషంగా జీవిస్తున్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలైన కొమురం భీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలు జిల్లాలుగా ఏర్పాటు కావడం శుభపరిణామం.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం: విద్య, వైద్యంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల్లో మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొన్నాయి. సారా నిషేధం వల్ల మరణాలు తగ్గాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు రావడం వల్ల లక్షలాది మంది గిరిజనులు మెరుగైన జీవితాలను గడుపుతున్నా రు. చిన్నపిల్లల అమ్మకాలు నిలిచిపోయాయి. ఆదివాసీ గూడేలలో కలరాతో, పోషకాహార లోపం వల్ల జరిగే మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా తండాలలో, గూడేలలో తాగునీరు, కరెంటు తీవ్రమైన సమస్యలుగా ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని తండాలు, గూడేలలో తాగు, సాగునీరు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న క్లిష్ట సమస్యలన్నీ స్వరాష్ట్రంలో పరిష్కారమవుతూ వస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
జీవన పురోభివృద్ధిలో పెనుమార్పు: ఇంతకు ముందులాగా గిరిజనుల భూములు ఇప్పుడు పరాయీకరణ జరగడం లేదు. నీటి వసతుల కల్పన వల్ల వ్యవసాయ భూముల విలువలు అమాంతంగా పెరిగాయి. మరోవైపు, స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాతే బంజారాలకు ఉన్నతస్థాయి ఉద్యోగాలు, జిల్లా కలెక్టర్లుగా, హెచ్ఓడీలుగా, వీసీలుగా అవకాశాలు వస్తున్నాయి.
గిరిజనులపై ప్రత్యేక ప్రేమ: గిరిజనుల పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానం గల నాయకుడు కేసీఆర్. అందుకే తానే స్వయంగా అభివృద్ధి నమూనాను రూపొందించి తక్షణ, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను అన్నిరంగాల్లో అమలుచేసేందుకు బలమైన పునాదులు వేస్తున్నారు. గిరిజనుల పట్ల ఆయన చూపుతున్న ప్ర త్యేక శ్రద్ధ ఫలాలై కనిపిస్తున్నాయి. ఈ ఎనిమిదేండ్లలోనే గిరిజనులు పలురంగాల్లో పురోభివృద్ధి సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి పథకాల నమూనా, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం దేశానికి దిక్సూచిలా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత, ఇప్పుడు కొందరు గుజరాత్ వలసవాదులు తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసే కుట్రలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరు దేశంలో వనరుల దోపిడీ జరుపుతూ, తమ తాబేదార్ల వ్యాపార విస్తరణకు తోడ్పడుతున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
మరిచిపోలేని మానుకోట కాల్పులు: తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో గిరిజన యువకులు భాగస్వాములయ్యారు. నాడు సమైక్యాంధ్ర ప్రతినిధిగా వచ్చిన జగన్మోహన్రెడ్డిని మహబూబాబాద్ కేంద్రంగా అడ్డుకున్న ఘటనల్లో అనేక మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఉద్యమంలో గిరిజనుల పాత్రను గుర్తించిన కేసీఆర్ వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటం అభినందనీయం.
వలస పాలనలో కష్టనష్టాలు: ఉమ్మడి రాష్ట్రంలో చట్టాలను అతిక్రమిస్తూ వలసవాదులు 11 లక్షల 60 వేల ఎకరాల భూములను ఆక్రమించారు. గిరిజనుల భూమి భారీస్థాయిలో పరాయీకరణ జరిగింది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్ల వేలాది మంది బంజారాలు నిర్వాసితులయ్యారు. హైదరాబాద్లోని శంషాబాద్, రంగారెడ్డి ప్రాంతానికి చెందిన బంజారాల భూములను కారుచౌకగా కొట్టేశారు. కోట్లు పలికే భూములు వేల రూపాయల్లోనే దోపిడీకి గురయ్యాయి. స్థానికంగా నిర్వాసితులవుతూ ఏ ఉపాధి దొరుకక గిరిజనులు అవస్థల పాలయ్యారు. నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బంజారా, తండాల్లోని జీవితాలు దారుణమైన విధ్వంసానికి గురయ్యాయి.
తండాల్లోని బంజారాలు: తమ పిల్లలను అమ్ముకొంటూ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఎన్నోరకాల దోపిడీకి గురయ్యారు. 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న యువత నాటు సారా వ్యసనంతో మరణించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీ, బంజారాల సంస్కృతి అంటే హేళనగా చూశారు. యువకులు నక్సలైట్ల పేర్లతో ఎన్కౌంటర్లకు గురయ్యారు. వేలాదిమంది గిరిజనులు తీవ్ర నిర్భంధాలకు, చిత్రహింసలకు బలయ్యారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించాయి.
అభివృద్ధికి కేసీఆర్ భరోసా: ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వలసవాదుల నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత, ఇప్పుడు కొందరు గుజరాత్ వలసవాదులు తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసే కుట్రలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరు దేశంలో వనరులను దోపిడీ చేస్తూ, వారి తాబేదార్ల వ్యాపార విస్తరణకు తోడ్పడుతున్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో, గూడేలలో కూడా వీరు తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. దీనిపట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ వికాస సమితి)
మాలోతు భిక్షపతి నాయక్: 98661 33603