అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ ముందుకు సాగిపోతున్నారు. సాధించుకున్న రాజ్యాన్ని మిగతా రాజ్యాలకు ధీటుగా తీర్చిదిద్దుతూ ఇక్కడి ప్రజల కష్టనష్టాలను దూరం చేయగలిగారు. అయితే ఇలాంటి సంక్షేమ రాజ్యంలో ఏదో జరుగుతున్నదని ప్రతిపక్షాలు పాదయాత్రలు మొదలు పెట్టాయి. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ యాత్రలు మొదలు పెట్టారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో కుట్రలకు తెరలేపుతున్నారు.
పాదయాత్రలు ఒకప్పటి ట్రంపుకార్డులు. కానీ ఈ తరం రాజకీయ నేతలు చేస్తున్న పాదయాత్రల్లో చిత్తశుద్ధి లోపించింది. నిజానికి భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మా గాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక మైలురాయి. అది ఓ లక్ష్యం కోసం. ఆ తరువాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. అదికూడా సమున్నత ఆశయం కోసం. అనంతరం 1951లో వినోబాభావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ నుంచి మొదలుపెట్టి బీహార్లోని బోధ్గయ వరకు నడిచారు. అది ఓ కార్యాచరణ సిద్దికోసం. ఇక 1983లో అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని చంద్ర శేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరునెలల పాటు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు నడిచారు. ఆయన యాత్రకు రాజకీయాలకతీతంగా స్పందన లభించింది. ఆ తర్వాత ఎల్కే అద్వాని నిర్వహించిన రథయాత్ర పార్టీ ఉనికిని చాటినా రాజకీయ లక్ష్యాలను నెరవేర్చలేకపోయింది.
ఇక తెలుగు రాష్ర్టాల్లో అందరికీ గుర్తొచ్చేది వైఎస్ పాదయాత్ర. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1500 కిలోమీటర్ల మేర సాగింది ఆ యాత్ర. నిజానికి నాడు నెలకొన్న సకల సమస్యలూ వైఎస్ను నడిపించాయి. టీడీపీ అధినేత అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో ఎన్నో కరెంట్ కష్టాలు. కరెంట్ చార్జీలు తగ్గించమని అడిగితే బషీర్బాగ్ చౌరస్తాలో జనాల్ని పిట్టల్లా కాల్చి చంపించిన సందర్భం. రైతుల ఆత్మహత్యల్లో నాడు ఏపీ టాప్. అందులో తెలంగాణలో ఊరూరా రైతుల ఆత్మహత్యలే. సాధికారతలేని మహిళలు… చిన్నాభిన్నమైన చేనేత రంగం. ఆకలిచావులు. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలు టీడీపీ హయాంలో కకావికలమయ్యాయి.ఈ సమస్యలే నాటి కాంగ్రెస్ నేత ప్రతిపక్ష లీడర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిని పాద యాత్ర వైపు కదిలించాయి. ప్రజాప్రస్థానం పేరుతో సాగిన పాదయాత్రను ఊరూరా జనం స్వాగతించారు. చంద్రబాబు దుష్టపాలనను అంత మొందించాలని జనం కోరుకున్నారు కాబట్టి నాడు వైఎస్ చేసిన యాత్ర సక్సెస్ అయింది…ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది.
తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ తెలంగాణ సమస్యల్ని గాలికొదిలేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను మరింత కష్టనష్టాల్లోకి నెట్టి వేస్తున్న కుట్రను గమనించిన కేసీఆర్ అదే జనంతో కలిసి ఉద్యమాలు నిర్మిం చారు. తెలంగాణ ఉద్యమం బలంగా రావడం, ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం వెరసి ఉద్యమంలో ఊరువాడా కదిలి వచ్చింది. అప్పట్లో ఉద్యమ నేత కేసీఆర్ ఊరూరా తిరుగుతున్నప్పడు ప్రతీ సమస్యను ఆకళింపు చేసుకున్నారు. ప్రతి సమస్యపై ఆయన స్పందించిన తీరు జనంలో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. కేసీఆర్ వినూత్నంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం లక్ష్యాన్ని ముద్దాడింది. ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, సాకారమైన తెలంగాణను ఆగం చేసు కోకుండా స్వయం పాలనతో ప్రతీ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా సాగుతున్నది.
తెలంగాణలో నీళు,్ల నిధులు, నియామకాలతో పురుడుపోసుకున్న ఉద్యమాన్ని అధికారంలోకి వచ్చాక సాకారం చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తొలి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, వృద్ధులకు ఆసరా పింఛన్లు, వికలాంగులకు పింఛన్ల్లు, ఉద్యోగులకు పీఆర్సీ ముఖ్యంగా రైతు కేంద్రంగా దేశం మెచ్చుకునే రైతుబంధు, రైతుబీమా సహా ఒక్క వ్యవసాయశాఖలోనే ముప్పైకి పైగా పథకాలు. ఇక పరిపాలనను వికేంద్రీకరించి పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా మార్చారు కేసీఆర్. కొత్త అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం. కొత్త కలెక్టరేట్లు. కొత్త మెడికల్ కాలేజీలు. కొత్త పంచాయతీ, మండల భవనాలు…ఇలా తెలంగాణ తనను తాను పునఃనిర్మించుకుంటున్నది.
సీఎంగా కేసీఆర్ చేపట్టిన మరో సంస్కరణ పంచాయతీరాజ్ వ్యవస్థను వికేంద్రీకరించడం. సరికొత్త చట్టంద్వారా ఒక నూతన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిపుష్టిగల పల్లెపట్టులను పునర్నిర్మాణం చేసే దిశగా తీసుకొన్న నిర్ణయం. ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణలో గ్రామపంచాయతీలు రెట్టింపు అయ్యాయి. ఇంతకాలం సమాజానికి దూరం గా.. ఎవరూ పట్టించుకోకుండా.. విసిరేసినట్లు ఉన్న తండాలు, గూడేలు స్వతంత్ర గ్రామపంచాయతీలయ్యాయి. గత ఏడు దశాబ్దాలలో ఏ ఒక్క పాలకుడూ చేయలేని, చేయడానికి సాహసించని అతి గొప్ప పరిపాలనా సంస్కరణ ఇది.
ఆడపిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముదిరాజులకు గొర్రెలపంపిణీ. యాదవులకు బర్రెలపంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నాయీబ్రాహ్మణులకు అత్యాధునిక సెలూన్లు.. రజకులకు అత్యంత ఆధునిక యంత్ర పరికరాలు,చేనేతలకు సబ్సిడీలు, కొనుగోలు వ్య వస్థల ఏర్పాటు, బీసీకులాలకు ఆత్మగౌరవ భవనాలుఇలా..ఒకటా రెండా అసాధారణ రీతిలో అభివృద్ధి జరిగింది. పింఛన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, కల్యాణలక్ష్మి కావచ్చు. ఇలా ఏదో ఒక పథకం తెలంగాణలోని ప్రతి ఇంటికీ అందింది. అలాంటి తెలంగాణలోఇప్పుడు చెప్పుకోదగిన ఏ పెద్ద సమస్యా లేదు.
కానీ ఇవాళ తెలంగాణలో ప్రతిపక్షాలు అధికారంకోసం సాగిస్తున్న యాత్రలు నక్కవాతలను తలపిస్తు న్నాయి. ఎనిమిదేండ్లుగా బంగారుతెలంగాణవైపు అడుగులు వేస్తున్న తెలంగాణపై వారి కన్ను పడింది. తెలంగాణ సంపదను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నాయి..రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్, షర్మిల రాష్ట్రంలో పాదయాత్రల బాట పట్టారు. కానీ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప ప్రజల సమస్యలు పట్టని యాత్రలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో బీజేపీ చీఫ్ ఐదు సార్లు నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్ర అట్టర్ ఫ్లాప్.ఆయన నిర్వహించిన యాత్రలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి తప్ప ప్రజలకు ఒరిగిందేంలేదు. మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రు లొచ్చినా చేరికల కోసం ఓ కమిటీ వేసినా అన్నీ తూచ్ అయ్యాయి. కేంద్ర కాంగ్రెస్ హత్ సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించినా అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న యాత్రలో సవాలక్ష గ్రూపులు. రేవంత్ గో బ్యాక్ అని సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. ఇక తెలంగాణలో మరో అద్దెకూలీ వైఎస్ షర్మిల. ఈమె జనానికి డబ్బులిచ్చి పోగేసి తిరుగుతున్నారు. రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ చేస్తున్న పాదయాత్ర విఫలయాత్రగా మారింది. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏమీ లేకపోవడంతో అధికార పార్టీ నేతలపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తోంది..వ్యక్తిగత దూషణలకు దిగుతున్నది.
రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న పాదయాత్రలపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేధావులు హెచ్చరిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగమాగం చేసేందుకు ఉత్తరాది పార్టీ లు కుట్రలు చేస్తున్నాయని.. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండి వీరి కుట్రలను భగ్నం చేయకపోతే.. మళ్లీ తెలంగాణ ఉత్తారాది పార్టీల కబంధహస్తాల్లో బందీగా మారేప్రమాదం ఉందంటున్నారు తెలంగాణ మేధావులు..
వెంకట్ గుంటిపల్లి: 94949 41001