‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన ఒకవైపు చెప్తూనే అన్ని పార్టీలు కలిసి వస్తే రెండో రాజధాని ఏర్పడుతుందని ధీమాగా చెప్పడంలో ఆంతర్యంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
విద్యాసాగర్రావు ఏ హోదాలో ఈ మాట చెప్పారు? బహుశా ఇది బీజేపీ ఆలోచనా? అనే అనుమానాలకు బలం చేకూర్చుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేసే విషయంపై పార్టీలో చర్చిస్తామని చెప్పడంతో ఇది విద్యాసాగర్రావు వ్యక్తిగత నిర్ణయం కాదన్నది తేలిపోయింది. దీంతో బీజేపీ నాయకులు చల్లకు వచ్చి ముంత దాచినట్టు పార్టీ అభిప్రాయాన్ని తమ వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నా వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన వెనుక తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర ఉన్నదా? అనే కోణంలో రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఎంతోమంది బలిదానాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందా? అనే అనుమానాలను తెలంగాణవాదుల్లోనూ కలుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఎదుగుదలను చూసి ఓర్వలేని తనమా? లేక తమ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రపూరిత వ్యూహంతో బీజేపీ నేతలు ఈ ప్రతిపాదన చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ను రెండో రాజధానిగా అంగీకరించిన మరుక్షణం కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ దేశ రాజధాని అయినందుకే అది కేంద్ర పాలిత ప్రాంతమైంది. అలాగే హైదరాబాద్ రెండో రాజధాని అయితే కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఎలా ఉంటుంది?. ఇదే హైదరాబాద్ రెండో రాజధాని చేయలన్న ప్రతిపాదన వెనుక ఉన్న అసలు కుట్ర.
హైదరాబాద్ను రెండో రాజధాని చేయాలన్న ప్రతిపాదన కొత్తదేమి కాదు. రాష్ట్ర విభజన సందర్భంగా సమైక్యవాదుల నుంచి ఈ డిమాండ్ వచ్చింది కూడా. తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అప్పుడు సమైక్యవాదుల నుంచి వచ్చిన డిమాండ్ ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకుల నుంచి రావటం ఆశ్చర్యం కలిగించే అంశం. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ లేదన్న అంచనాతో రాష్ట్ర అస్తిత్వాన్ని కూడా దెబ్బతీయడానికి వారు వెనుకాడటం లేదని తెలంగాణవాదలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ఆప్ ప్రభుత్వాన్ని కేంద్రపాలిత ప్రాంతమన్న సాకుతో లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నది ప్రత్యక్షంగా చూస్తున్నదే.
ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. కేంద్రపాలిత ప్రాంతమైనప్పటికీ అక్కడ ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికే సర్వాధికారాలుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ అత్యున్నత కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేంద్రం యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం అక్కడ కేంద్రపాలిత ప్రాంతం కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒకవైపు ప్రత్యక్షంగా చూస్తూ బీజేపీ నాయకులు రెండో రాజధాని జపం చేయడంలో మర్మం ఏమిటి? తెలంగాణకు హైదరాబాద్ తలకాయనే కాదు, గుండెకాయ కూడా. దేశానికి రెండో రాజధాని అయితే హైదరాబాద్కు ఏదో ఒరుగుతుందన్నట్టుగా బీజేపీ నాయకులు భుజాలు ఎగిరేస్తున్నారు. కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోబోయే ఇక్కట్లపై బీజేపీ నాయకులకు సోయి లేకపోవడమా? లేక బీజేపీ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో పావులుగా మారారా? అనే కోణంలో అనుమానించక తప్పదు. కర్ణాటక ఫలితాల అనంతరం దక్షిణాదిలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది. తెలంగాణలోనూ బీజేపీకి శృంగభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే రెండో రాజధాని అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకవచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
తెలంగాణ పట్ల బీజేపీ మొదటినుంచి విద్వేషపూరిత వైఖరినే చాటుకుంటూ వస్తున్నది. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం మొదలుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఎమ్మెల్యేలకు ఎర వరకు పన్నని కుట్రలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణనే పార్లమెంట్ సాక్షిగా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన బీజేపీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. హైదరాబాద్ను వదలుకునేటట్టు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జాప్యం జరిగి ఉండేది కాదు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమనేత కేసీఆర్ చివరిదాకా రాజీలేని పోరాటం చేయాల్సి వచ్చింది. అసలు హైదరాబాద్ లేని తెలంగాణ రాష్ర్టాన్ని ఉహించుకోగలమా? అందుకు తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా?. ఈ సోయి అయినా తెలంగాణ బీజేపీ నేతలకు లేకుంటే ఎట్ల? ఎవరి కోసం, ఎవరి తరఫున వారు ఈ రెండో రాజధాని ప్రతిపాదనను చేస్తున్నారు? సూటిగా సమాధానం చెప్పగలరా?.
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారని బీజేపీ నాయకులు వక్రభాష్యం చెప్తున్నారు. ఈ అంశం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. భాషాప్రయుక్త రాష్ర్టాలపై ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో (1955) అంబేద్కర్ తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకున్నారు. హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న దానికి అంబేద్కర్ కొన్ని కారణాలు చూపారు.
రాజధాని ఢిల్లీకి శత్రుదేశాలైన పాకిస్థాన్ 300 కి.మీ. చైనా సరిహద్దు 500 కి.మీ. దూరంలో ఉండటం దేశానికి క్షేమకరం కాదని 1955లో అంబేద్కర్ అప్పటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చేశారు. అప్పటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు. పెరిగిన టెక్నాలజీ కారణంగా శత్రు దేశాలు దాడి చేయాలనుకుంటే ఢిల్లీ అయినా ఒక్కటే, హైదరాబాద్ అయినా ఒక్కటే. దూరాభారం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే కాదు. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య అంతరాన్ని తొలగించడానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయడం మంచిదేనని కొందరి వాదన. హైదరాబాద్ను రెండో రాజధాని చేసినంత మాత్రాన అంతరం తొలిగిపోతుందా? హైదరాబాదే ఎందుకు? బెంగళూరును చేయాలని కర్ణాటక, చెన్నైని చేయాలని తమిళనాడు ప్రభుత్వాలు కూడా గతంలో డిమాండ్ చేశాయి. మరి దీనికి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు. ఇక్కడో విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి తగ్గబోయే ప్రాతినిధ్యంపై ఎందుకు మాట్లాడం లేదు. దేశ జనాభాలో 18 శాతమే ఉన్న దక్షిణాది రాష్ర్టాలు దేశ జీడీపీకి 36 శాతం కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాయి. మరి ఆ దామాషా లెక్కన దక్షిణాదికి ఆర్థిక సాయం అందుతుందా? ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు దేశ సంపదను దోచిపెడుతుంటే దక్షిణాది బీజేపీ నాయకులు ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు?
బీజేపీ నాయకులు చేస్తున్న ప్రతిపాదన కేవలం ఎన్నికల ఎత్తుగడగానే అర్థమవుతుంది. ఈ ఏడాది చివరలో తెలంగాణకు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన ద్వారా హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర ఓటర్లను, ఉత్తరాది ఓటర్లను గంపగుత్తగా పొందవచ్చన్నది బీజేపీ నాయకుల ఎత్తుగడ అయి ఉంటుంది. హైదరాబాద్ పట్ల వారికి నిజంగా ప్రేమ ఉన్నట్టయితే కేంద్రం వివక్షపై ఎందుకు మాట్లాడటం లేదు. విభజన హామీల కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదు.
వెల్జాల చంద్రశేఖర్: 98499 98092