రాజ్యాంగ పరిరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలివ్వడం గవర్నర్ల బాధ్యత. రాజ్యాంగ సంక్షోభం
తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ర్ట శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులకు రాజముద్ర వేయడం గవర్నర్ విధి. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుంచి తిరిగి వచ్చిన బిల్లులను, వారి అభిప్రాయాలకు అనుగుణంగా సవరించినా, లేదా యథావిధిగా పంపినట్లయితే, గవర్నర్కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు.
బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరును చూస్తుంటే అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చ తెరపైకి వస్తున్నది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా, కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలల తరబడి, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులును అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్లో పెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-200 ప్రకారం విధాన సభ ఆమోదం తర్వాత తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ ‘శీఘ్రగతిన’ ఆమోదం తెలుపడమో, లేదా రాష్ట్రపతికి పంపడమో లేదా అభిప్రాయం జోడించి తిరిగిపంపడమో చేయాలి. అందులో నిర్ణీత గడువు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారనేది విస్పష్టం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే. వాస్తవానికి సహకార సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఇరుసుగా వ్యవహరిస్తూ , రాజ్యాంగ అధిపతి, పరిరక్షకులుగా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. అందుకే బ్రిటిష్ వలసకాలం నాటి అవశేషమైన గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాల్సిందే.
బ్రిటిష్ కాలంలో కొనసాగిన గవర్నర్ వ్యవస్థను సంప్రదాయంగా, సమస్యలు తలెత్తినప్పుడు పెద్దరికం వహించే లక్ష్యంతో భారతదేశంలో కొనసాగించారు. అనుభవజ్ఞులు, రాజనీతిజ్ఞులే గవర్నర్గా ఉంటారని, రాష్ట్రాలు సవ్యంగా నడిచేందుకు ఊతమిస్తారని, చెక్స్ అండ్ బ్యాలెన్సింగ్ వ్యవస్థగా ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి.
బీజేపీయేతర, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ర్టాల్లోనే గవర్నర్లతో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే గవర్నర్లుగా నియమితులైన వారంతా దాదాపుగా బీజేపీలేదా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. తమ ప్రభుత్వాలు లేని రాష్ర్టాలలో గవర్నర్లను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఇందుకు గవర్నర్లకు కల్పించిన అధికారాలను రకరకాలుగా దుర్వినియోగం చేయిస్తున్నారు. ఆర్టికల్-356 అందుకు పరాకాష్ఠ. దీనిద్వారా గవర్నర్ల నుంచి తెప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్ల ఆధ్వర్యంలో కేంద్రం పరోక్ష పాలన సాగిస్తుంది. ఇప్పటివరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి.
1970 వరకు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పాలన సాగించింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న గవర్నర్లను డిస్మిస్ చేసి, వారి స్థానంలో తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించే కొత్త సంప్రదాయానికి తెరలేపింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుం చి ఎన్టీఆర్ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతున్ని చేసిన ఉదంతాన్ని ఎలా మరువగ లం. అఖండ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని, ఆయన దేశంలో లేని సమయంలో కాంగ్రెస్ నియమించిన గవర్నర్ రాంలాల్ 1984లో డిస్మిస్ చేసి, నాదెం డ్ల భాస్కరరావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం చూశాం.
అప్పుడు కడుపు రగిలిపోయిన తెలుగోడు రోడ్లపైకి వచ్చి ప్రజాస్వా మ్య పరిరక్షణ ఉద్యమంతో తిరిగి రామారావును ముఖ్యమంత్రిగా చేసేంతవరకు నిద్ర పోలేదు. కాబట్టి గవర్నర్ వ్యవస్థ రద్దుకు అలాంటి ప్రజోద్యమమే దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉన్నది. అందుకు సీపీఐ తన వంతు పాత్రను నిర్వర్తిస్తుంది. ఇక మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ర్టాలలో ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోయడం, ఇబ్బంది పెట్టడమో చేయడంలో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే గవర్నర్లు హద్దు మీరి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రజల అభిప్రాయాలు, వాస్తవాలతో పనిలేకుండా సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనా దినమేనంటూ బీజేపీ పాట పాడారు. ఆమె సొంత రాష్ట్రమైన తమిళనాడులో సైతం రాజకీయ వ్యాఖ్యానాలు చేయడమే కాకుండా, తెలుగు భాషను కించపరిచేలా మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ గవర్నర్గా వ్యవహరించిన సి.రంగరాజన్ ఇటీవల తాను రచించిన ‘ఫోర్క్స్ ఇన్ ద రోడ్’ పుస్తకంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు ఉండటమనేది రాజ్యాంగం ఆశించలేదని, కాబట్టి గవర్నర్లు తమకు తాము నియంత్రించుకోవాలని పేర్కొనడం ప్రస్తుత గవర్నర్లకు ఒక పాఠం లాంటిది.
సర్కారియా కమిషన్తో పాటు, అనేక కమిషన్లు గవర్నర్ వ్యవస్థ ప్రస్తుత తీరును తప్పుబట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫారసులు చేశాయి. ప్రత్యక్ష రాజకీయాలతో సమీప కాలంలో సంబంధం లేని వ్యక్తిని, ఇతర రంగాలలో నిష్ణాతులను, స్థానిక రాజకీయాలలో జోక్యం చేసుకోని వారిని, ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని గవర్నర్లుగా నియమించాలని సూచించాయి. ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, ఉప రాష్ట్రపతి, స్పీకర్ అభిప్రాయాలను తీసుకోవాలని కోరాయి. కానీ ఎన్నికైన ప్రభుత్వాలకు సమాంతర పాలకులుగా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దుచేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది.
(వ్యాసకర్త: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి)
కూనంనేని,సాంబశివరావు