‘ఉత్తం ఖేత్- మధ్యం వ్యాపార్- అధం నౌకర్’ అనేది భారతీయ జీవన విధానంలో నానుడి. కానీ ప్రస్తుత సార్వత్రిక జీవన విధానంలో ఇది తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం ఏమంటే భారతీయ భావాలకు తగ్గట్టు ఇక్కడ జాతి నిర్మాణం, జాతీయతా భావజాలం ఇంకా నిర్మాణం కాలేదని అర్థం చేసుకోవాలి. దేశంలో వ్యవసాయం చాలా సంక్లిష్టమైన సమస్య. ఇప్పటికీ దేశంలో మెజారిటీ రైతులు కనీస మద్దతు ధర పరిధిలోకి రాలేదు. మరోవైపు ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సాహసోపేత ప్రయాణమే బీఆర్ఎస్ ఏర్పాటు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే ఒక ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండా కేసీఆర్ దేశ ప్రజల ముందు పెట్టడంతో యావత్ దేశవాసులకు ఆయన ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ను ఒక నినాదంగానే చూడకుండా విధానపరమైన ఎన్నో ఉప సమితుల సమ్మేళనంతో కూడిన సూపర్ సమితిగా చూడాలి. ఈ నినాదం ఇవ్వడంలో కేసీఆర్కు నైతిక హక్కు కూడా ఉన్నది. తెలంగాణలో తాను రైతు పక్షపాతినని నిరూపించుకునే ఎన్నో ప్రణాళికలు దిగ్విజయంగా అమలు చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాల సమన్వయకర్తగా తన ఆలోచనలు దేశం ముందుపెట్టారు. అందుకే బీఆర్ఎస్ శ్రేణులు ఆయనను ‘దేశ్ కీ నేత’ అంటున్నాయి. ఇప్పుడు తర్కబద్ధంగా కేసీఆర్ను నిజమైన ‘దేశ్ కీ నేత’ అని ఏ విధంగా నిర్వచించవచ్చో రాజ్యాంగపిత బి.ఆర్.అంబేద్కర్ పరిశీలనా దృక్పథంతో తులనాత్మకంగా చర్చిద్దాం.
ముందుగా అంబేద్కర్ బహుముఖ దృష్టికోణాన్ని మనం ఇక్కడ చర్చించాలి. ఒక న్యాయకోవిదుడిగా, రాజ్యాంగ పితామహుడిగా, దళిత పక్షపాతిగా అంబేద్కర్కు ఎంత గుర్తింపు వచ్చిందో ఒక ఆర్థికవేత్తగా అంతటి ప్రాధాన్యం దక్కలేదు. జాతీయ ఆదాయం, కరెన్సీ, భూ సమస్యలు, వ్యవసాయం, పరిశ్రమలు వంటి ఎన్నో అంశాలపై అంబేద్కర్ రూపొందించిన విధానాలు మన దేశానికే కాక ఇతర దేశాలకు అనుసరణీయమయ్యాయి. అందుకే ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్థ్యసేన్ తాను నోబెల్ బహుమతి పొందిన తర్వాత మాట్లాడుతూ ‘ఆర్థికశాస్త్ర అధ్యయనంలో అంబేద్కర్ తనకు తండ్రి లాంటి వారని’ అన్నారు. అంబేద్కర్ తాను మొదట డాక్టరేట్ పొందింది అర్థశాస్త్రంలోనేనని చాలామందికి తెలియదు. కొలంబియా యూనివర్సిటీలో తాను పరిశోధించిన అంశా ల్లో 29 వరకు ఆర్థిక అంశాలే ఉండటం గమనార్హం. అంబేద్కర్ అర్థశాస్త్రంలో చేసిన పరిశోధనలు నేటికి ప్రపంచ ఆర్థికవేత్తలకు ప్రామాణికంగా ఉన్నాయి. రూపాయి సమస్యపై చేసిన అధ్యయనం (PROBLEM OF RUPEE) ఒక దిక్సూచి లాంటిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) ఏర్పాటు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు దశ దిశ, జాతీయ ఫైనాన్స్ కమిషన్కు జీవగంజి, విద్యుత్ సమ స్య పరిష్కారానికి పవర్గ్రిడ్ నిర్మాణం వెనుక అంబేద్కర్ ఆలోచనలే పునాది రాళ్లని భావితరానికి తెలియజేయాలి.
అంబేద్కర్ భారతదేశంలోని రైతు సమస్యలను కార్యకారణ సూత్రంతో విశ్లేషించారు. మొదటగా పంట ఉత్పత్తి కోణంలో తక్కువ దిగుబడికి కారణమైన భూ కమతాల సమస్యను పరిశీలించారు. భూ కమతాలు విశాలంగా లేకపోవడానికి కులం ప్రధాన అవరోధంగా భావించారు. అవి నేటికీ వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన తెలంగాణ మాడల్ అభివృద్ధి ద్వారా దేశం ముందరపెట్టిన అంశాలను చర్చించాలి. కుల మతాలతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 10 వేలు ప్రకటించడం దేశ చరిత్రను తిరగరాసినట్టయింది. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకే విలువను అంబేద్కర్ ఓటుహక్కు రూపంలో కల్పిస్తే ఆర్థిక సమానత్వంలో కేసీఆర్ ‘ఒకే భూమి ఒకే విలువ’గా పెట్టుబడి సాయం ప్రకటించారు. అయితే సమస్య ఇంతటితో సమిసిపోదు. దేశంలో అధిక భూభాగం ఇంకా నీటిపారుదల కిందకు రాలేదు. వందేండ్ల కిందట అంబేద్కర్ దూరదృష్టితో నదీలోయ బహుళార్థసాధక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. బాక్రానంగల్-హీరాకుడ్ ప్రాజెక్టుల నిర్మాణం ఆయన ఆలోచనలో నుంచి పుట్టినవే. అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14న నేషనల్ వాటర్ డే జరుపుకొంటారని కూడా గమనించాలి. సరిగ్గా అంబేద్కర్ భావజాలానికి తగ్గట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నీటి సమస్యపై దృష్టి పెట్టి ‘మిషన్ కాకతీయ’, ‘కాళేశ్వరం’ పథకాలను అమలు చేశారంటే ఆయన భావజాలం అంబేద్కరిజానికి ఎంత దగ్గరగా ఉన్నదో దళిత మేధావులు గుర్తించాలి. అంబేద్కర్ సహకార వ్యవసాయ ప్రస్తావన చేస్తే కేసీఆర్ పంట కాలనీల ప్రస్తావన చేశారు.
వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్న అంబేద్కర్ దూరదృష్టిని కూడా కేసీఆర్ అమలు చేస్తున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయాధారిత ఆగ్రో ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు పకడ్బందీ ప్రణాళికలు వేశారు. బహుశా అంబేద్కర్ ఆలోచనలు ఇంత లోతుగా అర్థం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్నే కావచ్చు!
అంబేద్కర్ మహా విగ్రహ స్థాపనను, తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏప్రిల్ 4న రవీంద్రభారతిలో సభ జరగనున్నది. తెలంగాణ బుద్ధిజీవుల తరఫున ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. పలువురు వీసీలు, ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్నారు.
ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించాలి. భారతదేశ వనరులతో బ్రిటిష్వారు ఆర్థికంగా ఏ విధంగా లాభపడుతున్నారో సాక్ష్యాలతో సహా పరిశోధించి అంబేద్కర్ 1925లో ‘EVOLUTION OF PROVIN -CIAL FINANCE IN BRITISH INDIA’ అనే పుస్తకంలో బయటపెట్టారు. మన దేశపు డబ్బును మన దేశానికే ఖర్చు చేయాలని తెలిపిన గ్రంథం ఇది. అదే బాటలో ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలైన బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేకంగా ఖర్చుచేయాలి. దీంట్లో భాగంగా కేసీఆర్ తీసుకువచ్చిన పథకమే ‘దళిత బంధు’.
అంబేద్కర్ భావనలో మరో ముఖ్యమైన అంశం స్టేట్ సోషలిజం. ప్రభుత్వ నియంత్రణ లేకుండా స్వేచ్ఛాయుత మార్కెట్ విధానానికి అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఇది ప్రైవేటు పెట్టుబడిదారీ విధానానికి సహకరిస్తుందని హెచ్చరించారు. principles of Equitable wealth dist -ribution సూత్రాలకు అనుకూలంగా ప్రైవేట్ క్యాపిటలిజం ఉండాలని సలహా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు కూడా అ లాగే కనపడుతాయి. రైతులకు స్మార్ట్ విద్యుత్ మోటార్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా కేసీఆర్ అంగీకరించలేదు. మరోవైపు, పంట ఉత్పత్తులకు మద్ధతు ధర చట్టంపై మాట మార్చి వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వ దుర్మార్గాలపై ‘సంయుక్త కిసాన్ మోర్చా’ మరో ఉద్యమానికి పిలుపునిచ్చింది. అందుకే కేసీఆర్ నాయకత్వం దేశ రైతులకు చారిత్రక అవసరం. మహారాష్ట్రలో ఇప్పటికే రెండు బహిరంగ సభలు దిగ్విజయమయ్యాయి. ‘RE INVENT INDIA-REORIENT INDIA’ అంటూ నాందే డ్ మీడియా సమావేశంలో ప్రకటించిన విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే దేశంలోని మేధావులను నిద్ర లేపింది. కాందార్ లోహ బహిరంగ సమావేశం రేపటి భవిష్యత్తుకు సంకేతం.
ఢిల్లీ వసంత్: 81424 44345
(వ్యాసకర్త: మేనేజింగ్ డైరెక్టర్,
గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ)