సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, రచయితల్లో ఆయనను తెలియనివారు లేరు. పుస్తకాన్ని అమితంగా ప్రేమించే నిజాం వెంకటేశం రచయితలను గౌరవిస్తూ తనకు నచ్చిన పుస్తకాలను పదుల సంఖ్యలో కొని, పంచి తృప్తిపడేవారు. నచ్చిన సాహిత్యకారుని ఇంటికెళ్లి వారితో మనసారా చర్చించేవారు.
నివాళి…
నిజాం వెంకటేశం
జననం: 1948;
మరణం: 16-09-2022
నిజాం వెంకటేశం 1948లో సిరిసిల్లలో జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు పుస్తకాల పట్ల ఆసక్తి పెరిగింది. పాఠశాల, పట్టణ గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేవారు. చదువులో చురుకైన ఆయనకు వైద్య విద్య చదవాలని ఉన్నా ఆర్థిక స్థోమత లేక నిజామాబాద్లో పాలిటెక్నిక్లో చేరి పూర్తి చేశారు. 1968లో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత చెన్నైలో ఏఎంఐఈ చేసి ఇంజినీర్గా విధులు నిర్వహించారు. ఏ ఊర్లో పని చేసినా అక్కడి గ్రంథాలయంలో భార్యాభర్తలిద్దరి పేరిట సభ్యత్వం తీసుకొని కనీసం అయిదు పుస్తకాలు తెచ్చుకొనేవారు. ఆయా ఊర్లలోని కాలేజీలకు వెళ్లి అధ్యాపకులతో పరిచయాలు పెంచుకొని సాహిత్య చర్చలు, సమావేశాలను ప్రోత్సహించేవారు. ఆ పరిచయాలతో కాలేజీ లైబ్రరీలోని పుస్తకాలను చదివేసేవారు. ఎక్కడ పనిచేసినా హైదరాబాద్ వెళ్ళినపుడు మోసేన్ని పుస్తకాలు కొనుక్కొచ్చి అక్కడి రచయితలకు, సాహితీప్రియులకు పంచేవారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన అక్కడి రచయితలకు చేదోడుగా ఉంటూ ఎన్నో సాహితీ కార్యక్రమాల నిర్వహణకు, పుస్తకాల ప్రచురణకు సహకరించారు. ఆ ప్రాంతం నుంచి ఎదిగివచ్చిన ఉద్ధండ రచయితలు నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, పత్తిపాక మోహ న్, పెద్దింటి అశోక్ కుమార్, కేవీ నరేందర్ తదితరులు తొలి రోజుల్లో వెంకటేశం సూచనలు అందుకున్నవారే.
తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని, వివిధ పదవులు అలంకరించిన టంకశాల అశోక్, బీ ఎస్ రాములు, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, నారదాసు లక్మణ్రావు తదితరులు ఆయనకు సన్నిహితులే. 2013లో అలిశెట్టి ప్రభాకర్ సమగ్ర కవితా సంపుటిని వెలువరిండంలో వెంకటేశం ప్రధానపాత్ర పోషించారు. 1950 దశకంలో తెలంగాణ మాండలికంలో వచ్చిన గూడూరి సీతారాం కథలు కొత్త తరానికి పరిచయమయ్యేలా పుస్తకరూపంలో రావడానికి తోడ్పడ్డారు. కవిత్వం పట్ల అత్యంత ప్రేమతో 1980 దశకంలో దిక్సూచి పేరుతో కవితా సంచికలు వెలువరించారు. అలిశెట్టి దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి కథలు’, బీ ఎస్ రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అనంతరం 1997లో హైదరాబాద్కు చేరిన ఆయన నగరంలోని అన్ని రకాల సాహిత్య, సామాజిక సంస్థలు, రచయితలతో పరిచయాలు పెంచుకొని అందరివాడిగా గౌరవింపబడ్డారు.
సాహిత్యంపై ఎంతో పట్టు ఉన్న నిజాం వెంకటేశం సొంత రచనల కన్నా అనువాదాలపై దృష్టి పెట్టారు. ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది విద్యాసాగర్రెడ్డి దేశం ఆర్థిక వ్యవస్థపై రాసిన మూడు ఇంగ్లిష్ పుస్తకాలను వెంకటేశం తెలుగులోకి అనువదించారు.
సేంద్రీయ వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానాలపైన రాసిన ఆంగ్ల పుస్తకాన్ని కూడా తెనిగించారు.
2018లో సివిల్ సర్వీస్ పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించిన అనుదీప్ దురిశెట్టిని కలిసి ఆయన విజయ రహస్యాలను రికార్డు చేసి ఎందరో విద్యార్థులకు అందజేశారు. ఈ మధ్య కాలం వరకు హైదరాబాద్ తార్నాకలో ఒక గదిని అద్దెకు తీసుకొని తనవద్దనున్న వేలాది పుస్తకాలతో సొంత ఖర్చుతో గ్రంథాలయాన్ని నిర్వహించారు.
వివిధ కంపెనీల ఆహ్వానం మేరకు విద్యుత్తు ప్రాజెక్టులలో ఉద్యోగానంతర సేవలు కూడా నిజాం వెంకటేశం కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాయ్బరేలి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో సుమారు రెండేండ్లు ఉండి వందలాది గ్రామాలకు విద్యుత్ సదుపాయాన్ని అందించడంలో తోడ్పడ్డారు. రాయ్బరేలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రాహుల్గాంధీ ఆయన్ని బిజిలీసాబ్ అని గౌరవంగా పిలిచేవారు. వెంకటేశం సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకొంటూ ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన హఠాన్మరణంపై ఎన్నో సాహితీ కుటుంబాలు తమ అనుబంధాలను గుర్తు చేసుకుంటూ అశృనివాళులు అర్పిస్తున్నాయి. ఒక ఆత్మబంధువును కోల్పోయిన బాధను వందలాదిగా ఆయన అభిమానులు ప్రకటిస్తున్నారు. సుమారు అర్ధ శతాబ్దం పాటు అన్ని వయసుల రచయితలకు వారధిగా నిలిచిన ఆయన నిష్క్రమణ ఎవరూ పూడ్చలేనిది.
– బి.నర్సన్
94401 28169