తెలంగాణ ఒక మహిమాన్విత నేల. మట్టి మనుషులు మహా పాలకులుగా ఎదిగిన ఘట్టాలతో ఈ నేల చరిత్ర గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నది. అణచివేత, వివక్ష తీవ్రమైనప్పుడు, ఆత్మగౌరవం మంట కలిపినప్పుడు ఎంతటి బలశాలున్నైనా ధిక్కరించి మట్టి కరిపించిన మహత్తర సన్నివేశాలకు తెలంగాణ సాక్షిభూతమైంది.
14వ శతాబ్దపు ఐరోపా చరిత్ర కాలంలో పీడకులను ఎదిరించి పీడితులను కాపాడటానికి కారణజన్ముడిగా వ్యవహరించిన జానపద సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రధాన పాత్రగా ఉన్న రాబిన్ హుడ్ పోరాట ధీరత్వానికి ఒక నమూనాగా చరిత్ర నిర్మాణంలో తనదైన చెరగని పాత్రను నిర్వర్తించిన ఒక మహాయోధుడు తెలంగాణ గడ్డపై జన్మించాడు. అతడే సర్దార్ సర్వాయి పాపన్న. పీడిత ప్రజలకు రక్షకుడిగా నిలిచిన పదిహేనేండ్ల కాలంలో ప్రతి క్షణాన్ని ఉత్కంఠభరితంగా, ధైర్య సాహసాలతో, ఆత్మగౌరవంతో సర్వాయి పాపన్న జీవించాడు.
చరిత్రకు అవసరమైనప్పుడు కాలం కడుపుతో ఉండి ఒక వీరుని ప్రసవిస్తుంది. భూగర్భం నుంచి ఎగేసి భూమిని అంటిపెట్టుకొన్న శ్రామిక ప్రజల మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని తపించిన సర్వాయి పాపడిని తెలంగాణ తల్లి కన్నది. వరంగల్ జిల్లాలోని తాటికొండ గ్రామంలో జన్మించిన పాపన్న బాల్యంలోనే తన గౌండ్ల కులవృత్తిని కొనసాగించనని ప్రతిజ్ఞ చేశాడు. శ్రామిక కులాలు నైపుణ్యాలను, శాస్త్రీయజ్ఞానాన్ని, నిర్వహణా నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. ఇవేవీ లేనివారు స్థానిక పాలకులుగా, రాజులుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గోల్కొండ కోటపై శ్రామికుల జెండాను ఎగరవేస్తానని ప్రతినబూనాడు. తన బంధువుల సహాయంతో చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకుకొని తొలి కోటను నిర్మించాడు. గోల్కొండ నగరానికి అన్ని రహదారులపై నిత్యం దాడులు చేస్తూ వ్యాపారస్థుల సొమ్మును, సరుకులను దోపిడీ చేశాడు. ప్రజలను బాగా పీడిస్తున్న స్థానిక హిందూ, ముస్లిం భూస్వాములపై దాడిచేసి వారి ఆస్తులను హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రాంత ప్రజలను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేశాడు. భూములను ప్రజలకు పంచిపెడుతూ మిగతా సొమ్మును కోటల నిర్మాణం కోసం వెచ్చించాడు. తన ప్రధాన సహాయకులు సర్వ, పూర్థిల్ ఖాన్లతో కలిసి అనేక కోటలను చేజిక్కించుకున్నాడు. ఒకప్పుడు పరిపాలనలో కీలక స్థానంలో ఉండి ఔరంగజేబు హయాంలో తమ స్థానాన్ని కోల్పోయిన చిన్న భూస్వాములు పాపన్నకు అండగా నిలిచారు.
1708లో గోల్కొండ రాజ్యంలో 2వ సంపన్నవంతమైన నగరం వరంగల్పై 3 వేల మంది సైన్యంతో దాడి చేశారు. ఇక్కడ దోచిన సొమ్ముతో డచ్ ఆంగ్ల వర్తకుల నుంచి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేశాడు. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత అస్తవ్యస్థంగా ఉన్న గోల్కొండ రాజ్యంలో సర్వాయి పాపన్న మరింత విజృంభించి భువనగిరి కోటతో సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. ఔరంగజేబు మరణం తర్వాత బహుదూర్ షా మొగల్ చక్రవర్తి అయ్యాడు. సర్వాయి పాపన్నను నిలువరించలేమని తెలుసుకున్న బహుదూర్ షా తన గోల్కొండ దర్బార్కు ఆహ్వానించి పాపన్నకు ప్రభువు హోదాను ఇచ్చాడు. భారతీయ సామాజిక చరిత్రలో ఒక కల్లు గీసే వ్యక్తి ప్రభువు హోదాను పొందడం సర్వాయి పాపన్నతోనే ప్రారంభమైంది.
ఇతిహాసాన్ని పోలి ఉన్న సర్వాయి పాపన్న చరిత్రకు కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధా న్యం ఇచ్చింది. పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. సర్వాయి పాపన్న చరిత్రను, స్ఫూర్తిని కాపాడుకుని ఆ ఉత్తేజంతో రాజ్యాంగ వ్యతిరేకంగా పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర పాలకులపై ప్రజాస్వామిక యుద్ధాన్ని చేయవలసిన చారిత్రక కర్తవ్యంలో తెలంగాణ శ్రామికవర్గ ప్రజ లు ముందు నిలవడమే మనమిచ్చే నిజమైన నివాళి.
(సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి రేపు)
– వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి