2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగిరి నుంచే ఫోన్ చేసారు. “కృష్ణమూర్తిగారూ, యాదగిరిలో కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అదే సమయంలో నాకిక్కడ ప్రతి క్షణం శివుడు గుర్తుకు వస్తున్నాడు. ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే అంటారు’ కదా.. అందుకేనేమో! ఈ ఏకాదశి పర్వదినం రోజున నేనొక సంకల్ప స్వీకారం, కార్యక్రమ శ్రీకారం చేస్తున్నాను. నరసన్న ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టే ఇక వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం” అని చెప్పారు. ఆమేరకు వార్తా కథనాన్ని ప్రచురించాల్సిందిగా సూచించారు.
‘నిండైన యాదగిరి నర్సన్న దీవెనతో ఇక రాజన్న సేవకు’ అని ఆ మరుసటి రోజు నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. అన్నట్టే ఆయన, శృంగేరి గురువుల ఆశీస్సులతో, వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రచించి, పనులు కూడా ప్రారంభించారు. ఒక్క వేములవాడే కాదు; రాష్ట్రంలోని అనేక ప్రసిద్ధ, చారిత్రక ఆలయాల అభివృద్ధి ఇప్పుడు ఎక్కడికక్కడ, స్థానిక నాయకుల సారథ్యంలో వేగంగా సాగుతున్నది. ఒక ఆధ్యాత్మికవేత్త అంచనా ప్రకారం ఈ 9 ఏండ్ల కాలంలో తెలంగాణలో సగటున ఊరికి రెండు కొత్త గుళ్లు నిర్మాణమయ్యాయి. లేదా శిథిలాలయాలు పునరుద్ధరణకు నోచుకుంటున్నాయి. ఇక యజ్ఞ యాగాదులకు లెక్కే లేదు. కేసీఆర్ అయుత చండీ యాగం చేసిన తర్వాత, రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట ఒక్క చండీ హవనమైనా జరుగుతున్నట్టు అంచనా! వేదాలను, సంప్రదాయాలను సంరక్షించే బ్రాహ్మణ సమాజం ప్రభుత్వాల ఆదరణ లేకపోవడం వల్ల గత కొన్నేండ్లుగా నిస్తేజంగా మారుతూ వచ్చింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బ్రాహ్మణ సంక్షేమం పట్ల కేసీఆర్ ప్రభుత్వం చూపించిన శ్రద్ధ, చేసిన యజ్ఞయాగాలు మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా మారుతున్నాయి. కాకతీయుల కాలం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తెలంగాణలో సనాతన ఆధ్యాత్మిక వైభవం కనిపిస్తున్నది ఇప్పుడేనన్నది చరిత్రకారుల అంచనా! ఒక్క హైందవమే కాదు; అన్ని మతాలూ సంపూర్ణ సామరస్యంతో సహజీవనం సాగిస్తున్న నేల ఏదైనా ఉందంటే అది తెలంగాణే!
దేశం, ప్రదేశమేదైనా ఆధ్యాత్మిక పునర్వైభవానికి ప్రధాన కారకుడు పాలకుడు. రాజును బట్టే రాజ్యం! ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తి పరాయణుడు. ఆయనకు శివ కేశవ భేదం లేదు. హరిహరాద్వైతుడు. ఆ మాటకొస్తే ఆయన అన్ని మతాలనూ సమంగా ఆదరిస్తారు. నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపమైన భగవత్ తత్వాన్ని ఆయన ఆరాధిస్తారు. అట్లని విగ్రహారాధననూ వ్యతిరేకించరు. ప్రతి మతంలోని మంచిని తెలుసుకుంటారు. వారికి సహకరిస్తారు. వ్యక్తిగతంగా తన మతాన్ని తాను కర్మనిష్ఠతో ఆచరిస్తారు. ఇందులో ఎక్కడా రాజకీయాలకు, రాగద్వేషాలకు తావు లేదు. తనకు ఎంతో తెలిసినప్పటికీ, ‘విప్రవాక్యో జనార్దనః’ అన్న సూక్తిని పాటిస్తారు. ‘మూఢ నమ్మకాలు’ అని ఎవరైనా ఈసడించినా శాస్త్ర బోధను మరువరు. ఎవరి
కోసమో దండం పెట్టరు. ఇంకెవరి కోసమో పెట్టకుండా ఉండరు. శాస్త్ర సంప్రదాయాల పట్ల తన నమ్మకాన్ని ఎవరెన్ని చెప్పినా విడువరు. మొన్న సచివాలయంలో జరిగిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. కేసీఆర్ను పితృతుల్యుడిగా భావించిన పార్టీ నేతలు ఆయనకు అభినందనలు, నమస్కారాలు చేస్తున్నారు. అప్పుడే బ్రాహ్మణ ఆశీర్వచనం జరిగింది. అప్పుడు కేసీఆర్ లైవ్లో కెమెరాలన్నీ చూస్తుండగా, తన కొడుకు వయసున్న వేద పండితులకు పాదాభివందనం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవ వేదికపైనా ఈ దృశ్యం కనిపించింది. ఆయన నమస్కారం వ్యక్తులకు కాదు; వారి విద్వత్తుకు!
‘మతం అధికారానికి దగ్గరి దారి’ అని కొందరు భావిస్తున్న నేటి కాలంలో కేసీఆర్ విద్వేష రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటారు. దానికి బదులుగా ఆయన నిజమైన ఆధ్యాత్మిక సౌరభం సమాజంలో వ్యాపించేలా చూస్తారు. బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభం సందర్భంగా ధూపదీప అర్చకులకు, వేద పండితులకు కేసీఆర్ ప్రకటించిన వరాలు ఈ కోవలోనివే. వీటిని కులం కోణంలో చూడనవసరం లేదు. తెలంగాణ గొప్పతనం ఏమిటంటే, ఇక్కడ అనూచానంగా అన్ని కులాల్లోనూ అర్చక కుటుంబాలున్నాయి. దళిత, బ్రాహ్మణ, వైష్ణవ, ఆరాధ్య, బలిజ, జంగమ, తమ్మల, పద్మశాలి తదితర అనేక కులాల్లో అర్చకత్వాన్నే నమ్ముకుని జీవిస్తున్నవారున్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద సాయం పొందుతున్న అనేక ఆలయాల్లో ఈ అన్ని కులాల వాళ్లూ అర్చకులుగా ఉన్నారు. కేసీఆర్ తన ప్రసంగ ప్రారంభంలో చెప్పినట్టు… బ్రహ్మజ్ఞానం సంపాదించినవాడు బ్రాహ్మణుడు. అందువల్లే కదా క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయి, గాయత్రి మంత్రాన్ని ఆవిష్కరించింది. బోయవాడైన రత్నాకరుడు.. వాల్మీకి మహర్షి కాలేదా! ముఖ్యమంత్రి అన్నట్టు, శాస్త్రం కూడా బ్రాహ్మణుడికి ‘ద్విజుడ’ని పేరే పెట్టింది. అంటే రెండు జన్మలు ఎత్తేవాడన్నమాట. ఇంకా చెప్పాలంటే నేటి బ్రాహ్మణులను రెండుగా వర్గీకరించవచ్చు. జన్మతః బ్రాహ్మలు, కర్మతః బ్రాహ్మలు! బ్రాహ్మణ కులంలో పుట్టి, ఇతరేతర ఆధునిక వృత్తుల్లో స్థిరపడిన వారు ఒక వర్గం అయితే, సాంప్రదాయకంగా వస్తున్న అర్చకత్వాన్నో, పౌరోహిత్యాన్నో, వేదాధ్యయనాన్నో, అనువంశిక ఆలయ నిర్వహణనో జీవనాధారంగా నమ్ముకున్నవారు రెండో వర్గం!
సమాజంలో ఆధ్యాత్మిక భావన పరిఢవిల్లడానికి, జనం అంతో ఇంతో భక్తి ప్రపత్తులతో సన్మార్గంలో నడవడానికి ఈ రెండో వర్గం పాత్రే అత్యంత కీలకం. కులానికి, వృత్తికి పెద్దగా కనిపించినా ఈ వర్గం ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రమే! అందుకే స్వయంగా ఆధ్యాత్మికుడైన కేసీఆర్ వీరికి చేయూతనివ్వడానికి ఎప్పటికప్పుడు పెద్ద మనసు చూపిస్తారు. ‘ఆలయ ఆర్చకులకు ప్రభుత్వ ఖాతా నుంచి వేతనాలు ఇవ్వాలనే’ అంశం తెరపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెంటనే సానుకూలంగా స్పందించారు. అయితే సాంకేతిక, చట్టపరమైన నియమ నిబంధనలు చూపి ఇది సాధ్యం కాదని కొందరు పెద్దలు వాదించారు. దీన్ని దివంగత గంగు భానుమూర్తి, నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన సూటిగా ఒకే మాట అన్నారు.
‘బ్రాహ్మణులకు ప్రభుత్వ వేతనాలు ఇవ్వడానికి చట్టం అడ్డు వస్తే, ఆ చట్టాన్నే మార్చేద్దాం’ అని! అనడమే కాదు. అర్చకులకు ప్రభుత్వ వేతనాలను అమలు చేసి మరీ చూపించారు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆలయ అర్చకులకు ప్రభుత్వ వేతనాలు అందుతున్నాయీ అంటే అది తెలంగాణలో మాత్రమే! అలాగే బ్రాహ్మణుల కోసం ప్రభుత్వం ఒక భవ్యమైన సంక్షేమ భవనాన్ని నిర్మించడం కూడా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దేవుని సేవలో నిమగ్నమై ఉండే బ్రాహ్మణులకు కూడా సంక్షేమం అవసరం, వారు కూడా అందుకు అర్హులే, సంక్షేమ పథకాలకు ఆర్థిక స్థితిగతులే తప్ప కులం ప్రాతిపదిక కాదు అని నిరూపించిన వ్యక్తి, నేత కేసీఆర్ మాత్రమే!
యాదగిరి నరసన్నకు దివ్యమైన, భవ్యమైన కృష్ణ శిలా ఆలయం నిర్మించడం ఆయన ఆధ్యాత్మిక సాహసానికి నిదర్శనం. కాళిదాసు రచనల ప్రాభవానికి కారకుడైన మల్లినాథ సూరి పేరిట మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడం మన పురా సంస్కృతుల పట్ల కేసీఆర్కున్న అభిమానానికి తార్కాణం. ఇది సంస్కృత భాషా వికాసానికి తొలి అడుగు. భక్తి, ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన ఏమాత్రం దేనికీ వెనుకాడరు. బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి సంకల్పించినప్పుడు, దానికి అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను నాకు, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్, డాక్టర్ రంగరాజన్లకు కేసీఆర్ అప్పగించారు. ప్రస్తుతం గోపనపల్లిలో ఉన్న స్థలం బాగుందని మేం అనుకున్నప్పుడు, అది చాలా విలువైనది; ఇస్తారా అన్న అనుమానం మాలో కొందరికి కలిగింది. కానీ కేసీఆర్ అర క్షణమైనా ఆలోచించకుండా బ్రాహ్మణ సంక్షేమ భవనం కోసం ఆ విలువైన స్థలాన్ని కేటాయించారు. అదీ ఆయనకు బ్రాహ్మణుల పట్ల ఉండే నిష్ఠ! ఇప్పుడున్న, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో బ్రాహ్మణుల కోసం ఇటువంటిది చేయడం ఏ నాయకుడికైనా ఒక సాహసమే. అయితే, సాహసాలు చేయడమే అలవాటుగా చేసుకున్న కేసీఆర్ ఎవరినీ నొప్పించకుండానే అందరినీ మెప్పించగలుగుతున్నారు.
బ్రాహ్మణులు అధిక సంఖ్యాకులుగా, ఓటు బ్యాంకుగా ఉన్న అనేక ఉత్తరాది రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇవ్వని సౌకర్యాలను, గౌరవాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇందుకు తెలంగాణ ఆధ్యాత్మిక వైభవంతో విలసిల్లేలా చేస్తున్న కేసీఆర్కు ధార్మిక లోకం రుణపడి ఉంటుంది. ఇంతచేస్తున్నా ఆయన నలువైపులా కెమెరాలతో ప్రచారం కోరుకోరు. ఆశీస్సులు తప్ప పేరు ప్రతిష్ఠలు ఆశించరు. కీర్తి కండూతి అసలే ఉండదు. ‘మా ఇంటికొస్తే ఏం తెస్తవు, మీ ఇంటికొస్తే ఏం ఇస్తవు’ అన్నట్టుగా దేశాన్ని సాకడం పౌరుల బాధ్యత అనే ఓటు రాజకీయాలు సాగుతున్న నేటి కాలంలో ఎవరు నిజమైన హైందవ పక్షపాతో, ఎవరు నిజమైన ధార్మికుడో తేల్చుకోవాల్సింది మనమే! కేసీఆర్ చెట్టును పూజిస్తాడు. దాన్ని పచ్చదనాన్ని ప్రేమిస్తాడు. ఆయన నదిని ఆరాధిస్తాడు. ఆ జలాన్ని తీర్థంలా సేవిస్తాడు.
బ్రాహ్మణుడిది, ఆధ్యాత్మికతది అవినాభావ సంబంధం. బ్రాహ్మణుడుంటే ఆధ్యాత్మికత ఉంటది, ఆధ్యాత్మికత ఉంటేనే బ్రాహ్మణుడు ఉంటడు! విప్రులు సమాజానికి మేలు చేస్తరు. అలాంటి విప్రులకు మేలు చేసేవాడు కేసీఆర్. సమాజానికి హితం చేసేవారికి హితం చేస్తే సమాజానికీ హితం చేసినట్టే కదా! ఉద్యమ సమయంలో ఢిల్లీలో చండీయాగం మొదలు… తెలంగాణలో చిన్న శంకుస్థాపన నుంచి కాళేశ్వరం వంటి మహా ప్రాజెక్టు ప్రారంభం దాకా మహాయాగంతోనే ప్రారంభమవుతుంది.
మనం మన ఇంట్లో శుభకార్యానికి ఎట్లా పూజ చేస్తామో, కేసీఆర్ కూడా తెలంగాణ కోసం మంచి పని తలపెట్టినప్పుడు పూజ చేస్తారు. ఇది కొందరికి మూఢ నమ్మకంగా కనిపించవచ్చు. కానీ, కేసీఆర్కు తెలంగాణ, ప్రజలు బాగుండటం, వారికి మేలు జరగడం ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ప్రజలే ఆయనకు కుటుంబ సభ్యులు. తెలంగాణే ఆయనకు పురం. తెలంగాణకు మేలుచేస్తున్న కేసీఆరే నిజమైన పురో-హితుడు!
తిగుళ్ల కృష్ణమూర్తి