10th Results | ఒక సమాజానికి విద్య, ఆరోగ్యం రెండూ అత్యంత ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రగతి చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి వంటి రక్కసి విరుచుకుపడినా, ఈ రంగాలు కుంటుబడలేదు. దీనికి తార్కాణం.. ఇటీవల వెలువడిన పదోతరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు.
కరోనా అనంతర పరిస్థితుల్లో 2021-22 విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమైనా పూర్తి స్థాయిలో బోధన గాని, పరీక్షల నిర్వహణ గాని చోటుచేసుకోలేదు. 70 శాతం సిలబస్ కుదింపు, సరళీకరించిన ప్రశ్నాపత్రాలతో పరీక్షల నిర్వహణ వంటివి చోటుచేసుకున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంలోనే పూర్తిస్థాయిలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమై, పూర్తిస్థాయిలో బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ, 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు ఒకింత ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పేద బడుగు వర్గాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థలకు మించి గొప్ప ఫలితాలను సాధించారు.
తమ జీవితంలో తొలిసారిగా 10వ తరగతి బోర్డు పరీక్ష రాయబోతున్న విద్యార్థుల్లో ఒకింత ఆందోళన, ఒత్తిడి వంటివి సహజం. వీరు పరీక్షలను రాయడం ప్రారంభించిన రోజే పేపరు బయటికి వచ్చిన సంఘటన యావత్ విద్యార్థులను, తల్లిదండ్రులను కలవరపరిచింది. ఈ పరిస్థితిని సమీక్షించి, వాతావరణాన్ని చక్కదిద్దే సమయంలోనే, మరుసటి రోజే వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ రోజు చోటుచేసుకున్న సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ విదితమే. ఒత్తిడికి గురైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికార యంత్రాంగం పరీక్షలు పూర్తయ్యేవరకు ఊపిరి బిగపట్టుకొని విధి నిర్వహణలో పాల్గొన్నారు. అయితే, ఈ సంఘటన రాజకీయరంగు పులుముకోవడం దురదృష్టకరం.
ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ పూర్తికావడం, జవాబు పత్రాలు దిద్దడం, ఫలితాల ప్రకటన ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా పూర్తి కావడమనేది ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖామాత్యులు అధికారగణానికి అండగా నిలిచి పునరుత్తేజాన్ని నింపి వారిని కార్యోన్ముఖులను చేయటం వల్లనేనని చెప్పవచ్చు.
పాఠశాల విద్యాశాఖ గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని ఈసారి మార్చింది. ఒక పేపర్ చొప్పున నిర్వహించాలని నిర్ణయించింది. ఎంతోమంది సందేహాలను లేవనెత్తారు. పిల్లల మీద భారం పడుతుందన్నారు. దీనివల్ల ఫలితాలు తగ్గుతాయని సన్నాయి నొక్కులు నొక్కారు. వీటికి తోడు పుండు మీద కారంలాగా పేపర్లు బయటకు వచ్చిన సంఘటనలు.. ఇవన్నీ కలిసి ఫలితాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉంటాయని ఆశించినవారూ ఉన్నారు. వీరి ఆశలపై నీళ్లు చల్లేలా పేద, బడుగు వర్గాల పిల్లలు, వారి తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల ముఖాలు ఆనందంగా వెలిగిపోయేలా ఫలితాలు ఉండటం అభినందించదగిన విషయం.
‘ఆలోచన-వ్యక్తీకరణ’ అనే మౌలిక తాత్వికత నేపథ్యంతో తెలంగాణలో గత తొమ్మిదేండ్లలో చోటు చేసుకున్న పరీక్షల సంస్కరణలు విద్యార్థుల సృజనకు సానపెట్టడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తోడ్పడుతున్నాయనేది నిర్వివాదాంశం. ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రకటించిన జాతీయ విద్యా విధానం-2020లో ప్రస్తావించిన ఎన్నో కీలక సూత్రాలు, బోధనాశాస్త్ర విషయాలు తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏండ్లలో అమలు జరుగుతున్నాయన్న విషయాన్ని విద్యావేత్తలు, విద్యాభిమానులు అందరూ కూడా గమనించాలి.
2009 నాటి ఆర్టీఈ చట్టానికి 2017లో చేసిన చట్ట సవరణ ద్వారా వచ్చిన అభ్యసన ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చిస్తున్న సమయం ఇది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అంతకు ముందు నుంచే ప్రతి సబ్జెక్టులో సామర్థ్యాలు, సామర్థ్యానికి చెందిన అభ్యసన ఫలితాలను విద్యా ప్రమాణాల పేరుతో రూపొందించి పాఠ్యపుస్తకాలలో పొందుపరిచారు. వివిధ సబ్జెక్టులలో ప్రశ్నాపత్రాలను రూపొందించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయస్థాయిలో విద్యారంగంలో చోటు చేసుకుంటున్న పథకాలు లేదా సంస్కరణలు గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రచారాలు, పటాటోపం, ఆర్భాటాలు లేకుండా జరుగుతున్న విషయాన్ని సగర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. అందుకే ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల వెనుక తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న సంస్కరణలు ఒక నిశ్శబ్ద విప్లవంగా నిలిచాయి.
వీటితోపాటు పేద, బడుగు, దళిత వర్గాల పిల్లల కోసం అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన గురుకులాలను ఏర్పరచి, నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ. ఫలితాలలో ఇది ప్రతిబింబించింది కూడా. దేశంలో దాదాపు అన్ని రాష్ర్టాల్లో కేజీబీవీలు ఉన్నా కూడా వాటిని ఇంటర్మీడియట్ వరకు విస్తరించి, ఆడపిల్లల చదువుకు బంగారు బాటలు వేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. మన రాష్ట్రంలో 475 కేజీబీవీలను నిర్వహిస్తుండగా వీటిలో 6 నుంచి 10వ తరగతి వరకు 1,15,300 మంది బాలికలు రెసిడెన్షియల్ వసతులతో విద్యను అభ్యసిస్తున్నారు. సాధారణ రెసిడెన్షియల్ లేదా గురుకుల విద్యార్థులు ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికై ప్రవేశాలను పొందుతారు. కానీ కేజీబీవీలు ప్రధానంగా బాలిక విద్యను వృద్ధిపరచడానికి ఉద్దేశించినవి. చదువును మధ్యలో ఆపేసిన డ్రాపౌట్లు, చదువు నుంచి దూరంగా ఉన్నవారు, బాలకార్మిక నేపథ్యం కలిగినవారు, తల్లిదండ్రులు లేని అనాథ బాలికలు, సింగిల్ పేరెంటు ఉన్న పిల్లలు, కుటుంబ కలహాలతో విడిపోయిన తల్లిదండ్రుల పిల్లలు ఈ కేజీబీవీలలో విద్యను అభ్యసిస్తుండడం గమనార్హం. వీటిలో 275 కేజీబీవీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించి బాలికల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. వీటి నుంచి ఉత్తీర్ణత పొందిన ఎంతో మంది బాలికలు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో, ఎన్ఐటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వంటి సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడానికి చేపట్టిన ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ పథకాలు పాఠశాలల్లోని మౌలిక వసతుల కొరతను తీర్చడమేగాక ఆధునిక, సాంకేతిక విధానాలలో విద్యను అభ్యసించడానికి తోడ్పడబోతున్నాయి.
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి మీద ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో విద్యాశాఖ సంచాలకులు దేవసేన, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ అధికారులు సమష్టి బృందంగా కృషి చేయడం కూడా మెరుగైన ఫలితాలకు కారణం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యా ప్రణాళికను సూక్ష్మస్థాయిలో రూపొందించి అవగాహన కల్పించారు. డిసెంబర్ మాసాంతానికి పాఠ్యాంశాల బోధనను పూర్తి చేసి జనవరి నుంచి ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టి పరీక్షలకు సన్నద్ధులను చేసేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. డిసెంబర్లోనే జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన గురించి అవగాహన కల్పించారు. ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహణ, వారాంతాల్లో పరీక్షలు, ఫలితాల విశ్లేషణ, విద్యార్థులను స్థాయిలవారీగా గుర్తించడం, తగిన అభ్యాసం కల్పించడం గురించి జిల్లా విద్యాశాఖ అధికారులకు అవగాహన కల్పించారు. దాదాపు అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఇందుకు నాయకత్వం వహించారు. వీరి పర్యవేక్షణలో పాఠశాలల వారీగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించి, అమలు చేయడం సత్ఫలితాలనిచ్చింది.
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, వారిలో భయాందోళనలను తొలగించడానికి, టీ-శాట్ ద్వారా విద్యార్థులకు కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, సందేహాలను నివృత్తి చేశారు. మండల స్థాయిలో కూడా 10వ తరగతి విద్యార్థులతో సదస్సులను నిర్వహించి, పరీక్షలకు సన్నద్ధపరిచారు. పాఠశాలల్లో ఫిబ్రవరి నుంచి 15 రోజులకు ఒకసారి 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి పిల్లల చదువు పట్ల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. వారిని చైతన్యపరిచారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రత్యేక చొరవతో ప్రతి విద్యార్థికి రోజూ అల్పాహారాన్ని లేదా స్నాక్స్ను అందించారు. తక్కువ ప్రగతి కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించి, తగిన అభ్యాసం కల్పించడానికి ఎస్సీఈఆర్టీ అభ్యాస దీపికలను రూపొందించింది. వీటిని ముద్రించి ప్రతి విద్యార్థికి అందించి, అభ్యాసం కల్పించారు.
విద్యార్థుల స్థాయిలను వారాంతపు పరీక్షల ద్వారా గుర్తించి, ఏ, బి, సి గ్రూపులుగా విభజించి, వారికి తగిన అవగాహన కల్పించారు. సాంఘికశాస్త్రం, సైన్స్ ఫోరం సభ్యులు, ఆంగ్ల భాషోపాధ్యాయుల బృందం విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ప్రశ్నల నిధులను రూపొందించి అందించడం
అభినందనీయం.
రాష్ట్ర స్థాయి నుంచి ఎస్సీఈఆర్టీ అధికారులతో పాటు విషయ నిపుణులతో రెండు జిల్లాలకు ఒక బృందం చొప్పున 16 మానిటరింగ్ బృందాలను ఏర్పరిచి, ఫిబ్రవరి నుంచి మార్చి 31 వరకు మానిటరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో.. పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు సన్నద్ధతను ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా విద్యాధికారులు డివిజన్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి కార్యోన్ముఖులను చేశారు.
ఇలా రాష్ట్రస్థాయి అధికారులు తగిన దిశానిర్దేశం చేస్తూ పాఠశాలలకు అండగా నిలవడం, వారిలో నూతనోత్సాహాన్ని నింపడం, అవగాహన పెంపొందించడం, తగిన సహాయ సహకారాలు అందించడం వల్ల విద్యాశాఖ గణనీయమైన, అభినందనీయమైన ఫలితాలను సాధించగలిగింది.
తెలంగాణ ఆవిర్భావం నుంచి చోటు చేసుకున్న సంస్కరణలు, ఎప్పటికప్పుడు చేపడుతున్న చర్యలు.. వీటన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న దిశానిర్దేశం, భరోసా వల్లే విద్యాశాఖ నూతనోత్తేజంతో ముందుకు పయనిస్తున్నది. అయితే, 10వ తరగతికి ఇంత అవసరమా అని అన్నవాళ్ళూ లేకపోలేదు. వాస్తవానికి 10వ తరగతి విద్యార్థి జీవితంలో ఒక మైలురాయి. ఆ విద్యార్థికి సంఘంలో ఒక గుర్తింపునిచ్చే అధికార ధ్రువపత్రం. ఉపాధి మార్గాలకు, ఉన్నత చదువులకు అర్హతనిచ్చే ప్రవేశ పత్రం. 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వారు ఏ రంగంలో చేరినా వారి వల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుంది. తల్లి లేదా తండ్రి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత పొందినవారైతే వారి పిల్లలు బాల కార్మికులుగా మారడం అనేది సాధారణంగా జరగదు. తాము ఎంత కష్టించైనా తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని వారు భావిస్తారు. లక్షలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలకు, ఆశయాలకు జీవం పోసే మొదటి మెట్టు పదో తరగతి పరీక్షలు. ‘అందరూ చదవాలి-అందరూ ఎదగాలి’ అనే సాత్విక నినాదంతో ప్రతి ఒక్కరు అత్యుత్తమ విద్యను పొందటానికి ప్రభుత్వం గురుకులాలను, రెసిడెన్షియల్ పాఠశాలలను, కేజీబీవీలను నిర్వహిస్తున్నది. మన ఊరు-మన బడి ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నది.
ఈనాటి 10వ తరగతి ఫలితాలు కొంతమందికి సాధారణంగా కనిపించినా, పేదవర్గాల వారి పిల్లల కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయుల్లో, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు, విద్యాభిమానుల్లో ఆనందోత్సాహాలను, గొప్ప సంతృప్తిని ఇచ్చాయి. ‘బంగారు తెలంగాణ’ నిర్మాణం పిల్లల బంగారు భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖకు అగ్ర తాంబూలమిచ్చి బాలల జీవితాల్లో వెలుగులు నింపడానికి బంగారు బాటలు వేస్తున్నది.
సువర్ణ వినాయక్
(వ్యాసకర్త : ఎన్.సి.ఇ.ఆర్.టి. జనరల్ బాడీ పూర్వ సభ్యులు, ఎస్.సి.ఇ.ఆర్.టి. కోఆర్డినేటర్)