‘దేశం కోసం జీవితకాలమంతా కృషిచేసిన రుషి పీవీ నరసింహారావు. అపర చాణక్యుడేకాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాజ్యాంగ విలువలకు.. స్ఫూర్తికి తిలోదకాలివ్వని ప్రజాస్వామ్యవాది. సనాతనవ్యక్తిగా కనిపించినా అసలు సిసలైన విప్లవవాది. తామరపువ్వుపై నీటి బిందువులా ఉంటూ రాజకీయ జీవితాన్ని ఆద్యంతం నిస్వార్థంగా, నిష్కల్మషంగా కొనసాగించిన ఆదర్శప్రాయుడు. పాలనలో రాగద్వేషాలు చూపని స్థితప్రజ్ఞుడు పీవీ’ అని అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా విధులు చేపట్టినప్పటి నుంచి దేశ ప్రధాని బాధ్యతలు నిర్వహించినంత వరకు పీవీని దగ్గరినుంచి చూసిన సన్నిహితుడు ఆయన. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆనాటి అనుభవాలను, పీవీతో ఉన్న జ్ఞాపకాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
పీవీ నరసింహారావుకు మా నాన్న మండలి వెంకట కృష్ణారావు అంటే ప్రత్యేక ఆదరాభిమానాలుండేవి. 1972లో అవనిగడ్డ నుంచి మా నాన్న ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచాక పీవీ మంత్రి పదవి ఇవ్వడం ఆయన ప్రేమాభిమానాలకు నిదర్శనం. పీవీ ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి అధికారిక పర్యటన కూడా మా జిల్లాలోనే సాగింది. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో ఎమ్మెల్యేగానే ఉన్న పీవీ.. కృష్ణాజిల్లాలో వారంపాటు పర్యటించారు. అది వారిమధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. అది మా నాన్న కన్నుమూసేవరకు కొనసాగింది. అటు తరువాత నేను కూడా వారితో కలిసి ప్రయాణం సాగించా. పీవీ ప్రధాని అయ్యేనాటికి నేను కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పీవీతో పలుమార్లు నేరుగా కలిసే అవకాశం దక్కింది. ఎప్పుడూ కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. 1972లో భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఆగస్టు 14 అర్ధరాత్రి వేళ ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు మా తండ్రి మంత్రిమండలిలో ఉన్నారు. నేను ఆయన వెంట వెళ్లి గ్యాలరీ నుంచి ఆ సమావేశాన్ని వీక్షించాను. ఆ సందర్భంగా పీవీ.. ‘నేనొక చైతన్యోర్మిని’ అంటూ ఇచ్చిన సందేశం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. ఇలా చాలా దగ్గరి జ్ఞాపకాలున్నాయి.
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిత్వం పీవీది. అధికార హంగు ఆర్భాటాలు ఉండవు. మందీమార్బలాలకు దూరం. జీవితాన్ని సాదాసీదాగా గడిపేందుకే మొగ్గు చూపేవారు. ఆయన నిజమైన ప్రజాస్వామ్యవాది. తుదిశ్వాస వరకూ ఆ విలువలను ఆచరించిన మహనీయుడు. అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోలేదు. కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపైనా నిష్కర్షగా విమర్శలు చేశారు. వివిధ పేర్లతో వ్యాసాలను రాసి తూర్పారబట్టిన సందర్భాలున్నాయి.
దేశం కోసం నిస్వార్థంగా జీవితకాలమంతా కృషి చేసిన రుషి పీవీ. సంస్కరణశీలి. సామాజిక సమానత్వం కోసం కూడా తపించారు. భూసంస్కరణలే కాదు, ఆయన బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖలోనూ విప్లవాత్మక సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర జైళ్లశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. ఆరోగ్యశాఖ మంత్రి సమయంలో వైద్యారోగ్యశాఖలను విలీనపరిచారు. ప్రైవేట్ ప్రాక్టీసును నిషేధించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యమిచ్చారు. గురుకుల విద్యావ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పటికి ఆర్థికంగా దివాళాతీసిన దేశాన్ని గడ్డన పడేశారు. సాంఘిక జీవనంలోనూ ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు అంత ప్రచారంలోకి రాలేదనిపిస్తుంది. కుల మతాల ప్రభావం అధికంగా ఉన్న ఆ రోజుల్లోనే ఆయన వర్ణాంతర వివాహాలకు ప్రోత్సాహకాలను కల్పించారు. హరిజనులకు గృహాలను నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి కూడా పీవీనే పునాది వేశారు. ఇలా చాలా చేశారు.
పీవీ రాజకీయ జీవితం ఆద్యంతం నిస్వార్థంగా, నిష్కల్మషంగా కొనసాగింది. పైరవీలకు తావిచ్చేవారు కాదు. తామరపువ్వుపై నీటి బిందువులా ఉండేవారు. పీవీ ముఖ్యమంత్రి అయ్యాక మా కృష్ణా జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమకే మంత్రి పదవులు వస్తాయని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థంగా సమాజసేవ చేస్తున్న మా నాన్న లాంటి వారిని గుర్తించి మంత్రి పదవులు కట్టబెట్టారు. అదీకూడా బీసీలకు. పీవీ శతజయంతి ఉత్సవాలను త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలనుకుంటున్నాం.
1977 నవంబర్ 19న సంభవించిన దివిసీమ ఉప్పెన భారీ విషాదాన్ని కలిగించింది. పదివేల మంది మరణించారు. ఊళ్లు కొట్టుకుపోయి లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఆ పరిణామం పీవీని కలచివేసింది. హృదయం ద్రవించింది. ఎమ్మెల్యేగానే ఉన్న ఆయన అక్కడకు వెళ్ళి బాధితులను ఓదార్చారు. అటు తరువాత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు హౌస్ కమ్ షెల్టర్ను కల్పించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను తాను గురుతుల్యుడిగా భావించే, వరంగల్లుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఎంఎస్ రాజలింగంకు అప్పగించారు. అటు తరువాత 1981లో విదేశాంగ మంత్రి హోదాలో పీవీ మరోసారి దివిసీమను సందర్శించి ఆ హౌస్ కమ్ షెల్టర్ను ప్రారంభించారు.
‘న్యాయస్థానాలు అనేవి ఆదాయం కోసం కాదు- ప్రజలు న్యాయాన్ని పొందడానికి. అవి వారికి అందుబాటులో ఉండాలి’ అని పీవీ ఆశించారు. అన్ని రంగాల వలెనే న్యాయవ్యవస్థలో కూడా వికేంద్రీకరణ జరగాలని, అప్పుడే సులభంగా తక్కువ ఖర్చుతో న్యాయాన్ని పొందే అవకాశం ప్రజలకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పీవీ- అందులోనూ అనేక సంస్కరణలను చేపట్టారు. స్వయంగా న్యాయవాది కూడా అయినందున అందులోని సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడే ఆయన ప్రతి తాలుకాలోనూ అన్ని అధికారాలు కలిగిన మున్సిఫ్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
“యావత్ ప్రపంచం పీవీ మేధాశక్తిని గుర్తించినా భారత్లో మాత్రం ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తుంది. పీవీ సొంత పార్టీ కాంగ్రెస్, తెలుగువారు సైతం తమ బాధ్యతను నిర్వర్తించకపోవడం బాధాకరం. కొందరు అభిమానులు, ఆయన సేవలను ఎరిగినవారు పూనుకుని జయంతి, వర్ధంతి కార్యక్రమాలను వారి శక్తిమేరకు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. పీవీ సేవలను, స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేందుకు చేస్తున్న కృషి అద్భుతం. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీవీ అముద్రిత రచనలను, సాహిత్యాన్ని సంకలనాలుగా తీసుకువస్తే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పీవీకి భారతరత్నను ప్రకటించాలి.”