మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేకుండా, విపక్షాల బహిష్కరణతో వెలవెలబోయింది. ప్రపంచ దేశాలు కూడా ముక్కున వేలేసుకునేలా జరిగిపోయింది. దీనికంతటికీ కారణం కేంద్ర సర్కారు మొండి వైఖరి. పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ సమంజసమైనదే గాక రాజ్యాంగబద్ధమైనది, దేశ పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబించేది. దానిపై ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరమే లేదు. అసలు, ప్రతిపక్షాలు చెప్పేంతవరకూ వేచి చూడకుండా, స్వయంగా రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఎంతో హుందాగా ఉండేది. కానీ, మోదీ కీర్తికండూతి ముందు అన్ని పార్లమెంటరీ విలువలు, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు స్థానంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించటం మంచి నిర్ణయమే. కానీ, ఆ నిర్ణయం తీసుకునే ప్రక్రియలోగానీ, దాని అమలులోగానీ, చివరికి ప్రారంభోత్సవంగానీ అంతా వన్ మ్యాన్ షోలా ఉండటంపైనే అభ్యంతరమంతా. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న రోజుల్లో, 2020 డిసెంబరులో కొత్త పార్లమెంటు, ప్రధాని నివాసం మొదలైన వాటితో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి మోదీ నిర్ణయించారు. విపక్షాలతో సంప్రదింపులుగానీ, వాటి సలహాలు తీసుకోవటంగానీ లేనే లేవు. అనంతరం కొత్త పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించిన అశోకుడి సింహాల రూపురేఖలను ఏకపక్షంగా మార్చివేశారు. దానిపై వచ్చిన విమర్శలను ప్రధానిగానీ, కేంద్రంగానీ పట్టించుకోలేదు. ఆ సింహాలను ప్రధాని ఒక్కరే ఆవిష్కరించటంపైనా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు నూతన భవనం ప్రారంభోత్సవాన్ని కూడా మోదీ తన సొంత కార్యక్రమంలా మార్చివేశారు. దీనికితోడు, రాజదండాన్ని ప్రవేశపెట్టి దాన్నొక గతకాలపు రాచరికస్థాయికి తీసుకెళ్లారు.
రాష్ట్రపతి పదవికి ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము ఎన్నికైనప్పుడు యావత్ దేశం సంతోషించింది. అత్యంత వెనుకబాటుకు గురైన ఒక వర్గం నుంచి ఎదిగిన మహిళ దేశాధినేతగా ఉండటం భారత ప్రజాస్వామ్యానికి వన్నె తెస్తుందని భావించింది. కానీ నేడు కేంద్రం, పాలకపక్షమైన బీజేపీ రాష్ట్రపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేశాధినేతనే అవమానించటంపై ప్రజాస్వామ్య అభిమానులు, ప్రజలు కూడా మథనపడుతున్నారు. పార్లమెంటు అంటేనే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభలతో కూడిన వ్యవస్థ. ప్రధానికి సభా నాయకుడిగా తప్ప ప్రత్యేక ప్రాధాన్యమే లేదు. కానీ, కేంద్రం దీనిని గుర్తించకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. ఢిల్లీలో కొన్ని నెలలుగా న్యాయం కోసం మహిళా రెజ్లర్లు పోరాడుతున్నారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు నిరసన తెలుపుతున్న ఆ క్రీడాకారిణులను పోలీసులు ఈడ్చుకుపోవటం, అరెస్టు చేయటం ఈ సందర్భానికి మరింత కళంకం తీసుకొచ్చింది. కేంద్రానికి గుణపాఠం నేర్పాల్సింది ప్రజలే. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.