ఇది కమ్యూనికేషన్ల యుగం. ప్రపంచ సమస్త సమాచార వ్యవస్థ అరచేతిలోకి వచ్చింది. ఏ సమాచారమైనా కొన్ని సెకన్లలోనే విశ్వవ్యాప్తమవుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దినదినం కొత్త పుంతలు తొక్కుతూ సామాన్యునికి సైతం అత్యంత చేరువైన నేపథ్యంలో ప్రజాసంబంధాల వ్యవస్థ పటిష్ఠమవుతున్నది. సరళీకృత ఆర్థిక విధానాలు, గ్లోబలైజేషన్ ఫలితాలు ప్రపంచంలో సమాచార విప్లవం తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజాసంబంధాల (పీఆర్) వ్యవస్థ ఒక పరిశ్రమ స్థాయికి చేరుకుంది.
నది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆయా నిర్దేశిత వర్గాలకు చేరాలంటే, లక్ష్యాలు నెరవేరాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేసే సమాచార వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. అన్ని ప్రభుత్వ శాఖల కార్యక్రమాలు ప్రచారం లేనిదే విజయవంతం కావడం అసాధ్యమనిపిస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ‘ప్రచారం’ అనేది అతి ముఖ్యమైన అంశం. వస్తు సేవలు వినియోగదారులకు చేరువ కావాలంటే ప్రణాళికాబద్ధమైన, ఆకర్షణీయమైన ప్రచారం అవసరం. కార్పొరేట్ సంస్థలు ప్రచారం కోసం దాదాపు 20 నుంచి 30 శాతం ఖర్చు పెడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే కాకుండా ఇప్పుడు ప్రతి చిన్నా, చితకా వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా ప్రచారం మీద ఆధారపడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాల విస్తృతి నేపథ్యంలో ప్రతి పౌరుడు ఒక పీఆర్వోగా మారుతున్న పరిస్థితి. సామాజిక మాధ్యమాలలో పోటాపోటీగా పోస్టింగులు వస్తుంటాయి. ఇటీవలి అసెంబ్లీ, లోక్సభ, స్థానిక ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల తీరు తెలిసిందే.
ఒకప్పుడు ప్రభుత్వాలు కేవలం సమాచార ప్రసార ప్రజాసంబంధాల శాఖలపైన ఆధారపడేవి. మారుతున్న పరిస్థితుల్లో ప్రతి శాఖలో ఒక ప్రత్యేక సమాచార విభాగ ఏర్పాటు అవసరమవుతున్నది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ అవసరం మరింత పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా మీడియా చొచ్చుకువెళ్ళిన పరిస్థితులలో ప్రతి ఉద్యోగికి సమాచార ప్రచార సాధనాల పట్ల అవగాహన ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కొత్త అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలు నుంచే ఐఏఎస్ స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు ప్రతి ఉద్యోగికి ప్రజాసంబంధాలపైన సంపూర్ణ అవగాహన ఉండేలా శిక్షణ ఇప్పించాలి. పీఆర్వోల నియామక అంశాన్ని ఔట్సోర్సింగ్ విధానానికే పరిమితం చెయ్యకుండా ప్రజాసంబంధాల వ్యవస్థను పటిష్ఠంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. రాజనీతిశాస్త్రం, పరిపాలనాశాస్త్రం వంటి సామాజిక శాస్ర్తాల్లాగానే ప్రజాసంబంధాల అధ్యయనం కీలకంగా మారబోతున్నది. రానున్న రోజుల్లో ప్రజాసంబంధాలు, అనుబంధ మీడియా, అడ్వైర్టెజింగ్, కమ్యూనికేషన్ వంటి అంశాల పట్ల లోతైన అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత క్రమక్రమంగా పెరుగుతుంటుంది. భావి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాసంబంధాలను ఒక నూతన శాస్త్రంగా భావించి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో తప్పనిసరి అధ్యయనాంశంగా చేయాలి. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ప్రజాసంబంధాల పట్ల అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
(నేడు జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం)
సురేష్ కాలేరు