‘ఏమండీ ఈ వార్త చదివారా? మాస్క్ పెట్టుకోకుంటే మళ్లీ ఫైన్ వేస్తారట’ అని నా భార్య వంటింట్లో నుంచి అరిచి.. ఓ పేపర్ క్లిప్పింగ్ను నా వాట్సప్ పెట్టెలో పడేసింది. ఆ సందేశం నా చెవులకు.. కండ్లకు ఒకేసారి చేరిపోయింది. అప్పటిదాకా నాలో ఉన్న ప్రశాంతత మాయమవుతూ ఫ్రస్ట్రేషన్ తన్నుకొస్తున్నది.మళ్లీ మాస్క్ పెట్టుకోవాలన్న ఆలోచనే నాలో చిరాకు కలిగిస్తున్నది.
‘ఏ ఊకో.. మళ్లా ఆ మాస్క్ ఎవడు పెట్టుకుంటడు?’ అని గట్టిగా రిైప్లె ఇద్దామని ఫిక్స్ అయిన. కానీ.. వంటింట్లో నుంచి దోశ నేరుగా వస్తుందో, ప్లేట్లో వస్తుందో.. లేదంటే ఏకంగా దోశ పెనమే గాల్లో తేలుతూ వస్తుందోనన్న భయంతో నోరు మూసుకున్నా.
సరిగ్గా ఏడాది కిందట ఇలాంటి న్యూసే వచ్చింది. మాస్క్ మస్ట్ అని సర్కార్ ప్రకటించింది. ఏహే.. మనల్ని అడిగేదెవడులే అని సరదాగా అలా తిరిగొద్దామని బయటికి పోయిన. లాక్డౌన్తో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా ఒక రైడ్ వేద్దామనుకుంటే.. చౌరస్తాలో పోలీసులు ఆపేశారు. మాస్క్ లేదని కోప్పడి, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించానని ఫైన్లు వేశారు. అసలే నెలాఖరు కావడంతో బడ్జెట్ తారుమారైంది. ఇంటికొచ్చిన తర్వాత నా భార్య కాళికావతారం చూడాల్సి వచ్చింది.
బాయిలర్ కోడిని ముంచినట్టు వేడినీళ్లలో ముంచి.. శానిటైజర్తో స్నానం పోసిన తర్వాతే ఇంట్లోకి అడుగు పెట్టించింది. ఆ తర్వాత తిట్ల దండకం మొదలైంది. ‘నీకు పెండ్లాం పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? గాలికి పోయే కంపను ఇంటిదాక తీసుకొస్తావా?’ అంటూ ప్రారంభించి.. ఐదారేండ్లు వెనుకకు వెళ్లిపోయింది. మధ్యలో అడ్డుకోబోతే ఒక చెంబు, మగ్గు, ప్లేట్ నా మీద పడ్డట్టు గుర్తు. ఆ అనుభవంతో మాస్క్ లేకుండా బయటికి వెళ్తే ఒట్టు.
‘మన కోసమే కదా ప్రభుత్వం చెప్పేది. రూల్స్ పాటించాం కాబట్టే ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. ఏడాది కాలంగా ఎవరికీ జ్వరాలు గానీ, ఇతర జబ్బులుగానీ రాలేదు. బయటి తిండి మానేయడం వల్ల మీ బీపీ, షుగర్ కంట్రోల్లోకి వచ్చినయి. రోగాలకు, బయటి తిండికి కలిపి నెలకు రెండువేల రూపాయలు లెక్కేసుకున్నా.. మనకు కనీసం రూ.25 వేలు మిగిలినయి. ఆరోగ్యం బాగున్నది’ అని హితబోధ చేసింది.
కొత్త సంవత్సరంతో పాటే నాలాంటి జీవులకు స్వేచ్ఛ వచ్చింది. ఊపిరి ఆడనివ్వని మాస్క్ను పక్కన పడేశాం. వాసన నచ్చని శానిటైజర్కు వీడ్కోలు పలికేశాం. భౌతిక దూరానికి బై బై చెప్పేశాం. ఇప్పుడు మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లాలంటే చిరాగ్గా అనిపించింది.
ఇంతలోనే నా భార్య.. ప్లేట్లో దోశతో కండ్లముందుకొచ్చింది. ‘నేను మాస్క్ పెట్టుకోను’ అని గట్టిగా నిర్ణయించుకున్నట్టు నా మొఖంలో కనిపించిందో ఏమో.. ‘ఏమండీ.. మన కోసమే కదా ప్రభుత్వం చెప్పేది. రూల్స్ పాటించాం కాబట్టే మన ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదు. అంతేకాదు.. గతేడాది కాలంగా మన ఇంట్లో ఎవరికీ జ్వరాలు గానీ, ఇతర జబ్బులు గానీ రాలేదు. బయటి తిండి మానేయడం వల్ల మీ బీపీ, షుగర్ కంట్రోల్లోకి వచ్చినయి. రోగాలకు, బయటి తిండికి కలిపి నెలకు రెండువేల రూపాయలు లెక్కేసుకున్నా.. మాస్కులు, శానిటైజర్లు, కరోనా రూల్స్ వల్ల కనీసం మనకు రూ.25 వేలు మిగిలినయి. ఆరోగ్యం బాగున్నది’ అని హితబోధ చేసింది.
వెంటనే నాలోని జ్ఞాన బల్బు వెలిగింది. ‘మాస్కో రక్షతి రక్షితః’ అని మనసులో అనుకున్నాను. ‘మా దోస్తు వెంకటేశ్ గాడు ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లి వైరస్ను వెంటతెచ్చి, ఇంట్లో వాళ్లందరికీ అంటించాడు. పాపం వాడితోపాటు, వాళ్ల నాన్న కూడా చనిపోయాడు. ఆ కుటుంబంలో ముగ్గురు ఆడవాళ్లే మిగిలారు. మా ఇంట్లో ప్రాణాలతోపాటు పైసా కూడా ఆదా అయ్యింది’ అని అనుకుంటుండగానే.. నా శ్రీమతి ఓ బాంబు విసిరింది.
‘ఈ ఏడాది జబ్బులు లేక రూ.25 వేలు మిగిలినయి కాబట్టి.. ఇంకో రూ.25వేలు కలిపి తులం బంగారం కొనుక్కొని రండి’ అని చెప్పింది. పైగా.. ‘మాస్క్ పెట్టుకొని వెళ్లండి’ అన్న అరుపొకటి. ‘నా వల్ల కాదు’ అని చెప్పాలని అనుకున్నా.. గత అనుభవాలు గుర్తుకొచ్చి ఆగిపోయిన. ఇంకేం చేస్తాం.. ఇంట్లో అయినా, బయట అయినా ‘హోం మినిస్టర్’ చెప్పింది వినాల్సిందే..
‘భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ మాస్కులు మానకు మై డియరూ గుంపుల మాటే వద్దు గురూ సోషల్ డిస్టెన్స్ సో బెటరూ..’ అని పాట పాడుకుంటూ బంగారం దుక్నానికి బయలుదేరిన.