Bihar MLC Polls : బిహార్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. పోటీ చేసిన పది స్థానాల్లో తొమ్మిది స్తానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అన్ని సీట్లను ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకోగా, ఒక సీటును ప్రతిపక్ష ఆర్జేడీ దక్కించుకుంది.
ఎమ్మెల్సీగా విజయం సాధించిన వారిలో మాజీ సీఎం నితీష్ తనయుడు నిశాంత్ కుమార్, భోజ్పురి స్టార్ పవన్ సింగ్ కూడా ఉన్నారు. తాజాగా గెలిచిన అభ్యర్థులు వీరే. నిశాంత్ కుమార్ (జేడీయూ), భారతీ మెహతా (జేడీయూ), శివాని దేవి ప్రజాపతి (జేడీయూ), లాలన్ ప్రసాద్ (జేడీయూ), పవన్ సింగ్ (బీజేపీ), సంజయ్ ప్రకాష్ మయూఖ్ (బీజేపీ), అనిల్ ఠాకూర్ (బీజేపీ), షీలా పండిట్ (బీజేపీ), అష్రఫ్ అన్సారీ (ఎల్జేపీ), సునీల్ సింగ్ (ఆర్జేడీ). పది స్థానాల్లో జేడీయూ నాలుగు, బీజేపీ నాలుగు, ఎల్జేపీ ఒకటి, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఇటీవలే మంత్రి పదవి చేపట్టిన నితీష్ తనయుడు నిశాంత్ తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరోవైపు ఆర్ఎల్డీ అధినేత ఉపేంద్ర కుష్వాహా తనయుడు దీపక్ ప్రకాష్క పదవీ గండం పొంచి ఉంది.
తాజా ఎమ్మెల్సీ ఎనికల్లో ఆయనకు సీటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కాదు కాబట్టి, మంత్రిగా ఆరు నెలలకు మించి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. మరి దీపక్ విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇటీవల ఆర్ఎల్డీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ పెద్దలు సూచించారు. కానీ, దీనికి ఉపేంద్ర నిరాకరించారు. ప్రస్తుతం ఈ అంశం ఇంకా చర్చల దశలోనే ఉంది.