కాకతి ప్రతాపరుద్రుని సేనాపతులలో చెరకు వేలూరి బొల్ల కుమారుడు రాజరుద్రుడు గోరవంకపల్లి గ్రామాన్ని దానం చేస్తూ ఒక తామ్ర శాసనం వేయించాడు. చెఱకురెడ్డి వంశీయులు కాకతీయుల ముఖ్య సామంతులలో ఒకరు. శాసనము శ.సం.1214 = క్రీ.శ. 1292 విజయ ఆశ్వయుజమాసం శుద్ధ అష్టమి బుధవారం నాడు వేయించబడినది. ఈ శాసనం గుంటూరు మండలంలో ఒక పాతబావిలో లభించగా డాక్టర్ ఎన్.రమేశన్ మొదట పరిష్కరించారు.
గుంటూరులో లభించిన ఈ శాసనం తెలంగాణకు ఏం సంబంధం అంటే చెఱకురెడ్డి వంశీయుల్లో ఒక శాఖ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లినది. కాయస్థ అంబదేవుడు కాకతీయుల సామంతుడు. అతడి అల్లుడే రాజరుద్రుడు. అంబదేవుడు తిరుగుబాటు చేసిన కారణంగా కాకతీయులకు శత్రువైనాడు. కాని అతని మరణం తర్వాత రాజరుద్రుడు ప్రతాపరుద్రునికి సామంతునిగా జమ్ములూరు, అమరాబాదు రాజ్యాలను పొందినాడు. అందులోని గ్రామాలే గోరువంకపల్లి, కూరెళ్ళ గ్రామాలు. ఈ రెండు గ్రామాలను రాజరుద్రుడు అగ్రహారాలుగా దానమిచ్చినాడు.
రాజరుద్రుడు తన తండ్రికి మరణానంతరం శ్రాద్ధకర్మలు నిర్వహించి స్వర్గలోక ప్రాప్తిని కలిగించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా గయ క్షేత్రానికి వెళ్లలేకపోవడం వల్ల తనకు బదులుగా నలుగురు విప్రులను పంపించాడు. అందుకు ప్రతిగా వారికి గ్రామాన్ని అగ్రహారంగా దానం ఇచ్చాడు. దానమిచ్చిన ‘గోరువంకపల్లి’ గ్రామం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్లు, తిప్పర్తి రోడ్డు దగ్గర ఉన్న గ్రామంగా బి.ఎన్.శాస్త్రి నిర్ధారించినారు. ఎన్.రమేశన్ ఈ గ్రామం కర్నూలు జిల్లాలోనిదని అన్నారు.
శాసనంలో ఎక్కువగా అలంకారములతో కూడిన వర్ణనలు ఉన్నాయి. కాకతి గణపతి దేవుని గూర్చి, రుద్రమ, ప్రతాపరుద్రుల గూర్చి చాలా గొప్పగా వర్ణించబడినది. అదేవిధంగా చెఱకు వంశీయుల గురించి కూడా వివరంగా కీర్తించబడింది.
ఈ శాసనాన్ని వేయించిన రాజరుద్రుడిని గూర్చిన వర్ణన ఈ విధంగా ఉన్నది.
యస్య ప్రతాప ప్రసరా దతీవ
సంతాపితానాం రిపునాయకానం
నాన్యాగతి ర్యత్పద కల్పవృక్ష
చ్ఛాయాతతే స్సంవ్రయ మంతరేణ॥
రాజరుద్రుడి దాన గుణం గూర్చి.. దానం చేసినప్పుడు విడిచే జలంతో భూమి అనే పాదులో పెంచబడుతూ, దిక్కులు అనే చెట్టును చుట్టుకున్న కీర్తిలత ఆకాశం అనే తరువుపై ఎక్కి పాకుతుంది. ఇందులో విహాయస్తరు అనే పదం ఉపయోగించబడింది. ఇది స్వర్గలోకంలోని కల్పవృక్షాన్ని స్ఫురింపజేస్తుంది. దాన విషయంలో రాజరుద్రుడి కీర్తి కల్పతరువును అధిగమిస్తుందని చెప్పబడింది. 29 సంస్కృత శ్లోకాలతో ఉన్న ఈ గోరువంకపల్లి తామ్రశాసనం 70 పంక్తుల్లో ఉన్నది. ప్రహర్షిణి, వసంత తిలక, మాలిని, ఇంద్రవ్రజ, ఉపేంద్ర వ్రజ, స్రగ్దర, అనుష్టుప్ వంటి వృత్తాలతో ఈ శాసనం పరిపుష్టమైంది.