రాజకీయ ఎత్తుగడలకు, జిత్తులకు చిత్తయ్యే ప్రభుత్వం కాదిది. సంక్షేమంలో దేశంలోనే అగ్రతాంబూలం వహిస్తున్న తెలంగాణలో షర్మిల ఇప్పుడు కండ్లున్న కబోధి. ఏ రంగంలో అభివృద్ధి లేదో సాధికారికంగా ముందుకు రావాలి. పోతిరెడ్డిపాడు వద్ద జలదోపిడి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? నిధులివ్వకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు? చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు వద్ద, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేయాలి. తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ. దొంగ దీక్షలను, నకిలీ ఉద్యమాలను ఈ ప్రాంతం ఎప్పటికీ నమ్మదు. ఇక్కడి సంక్షేమ పథకాలు ఏపీతో సహా ఎక్కడైనా ఉన్నాయా..!
ఉద్యమ సమయంలో ఏనాడూ జై తెలంగాణ అనని షర్మిలకు ఆకస్మికంగా ఈ ప్రాంతంపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నిరాదరణతో ఏం చేయాలో పాలుపోక ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం వృథా ప్రయాస. ఇక్కడి ప్రజలు ఆనందంగా జీవిస్తుంటే, రాజన్న రాజ్యం అంటూ పడరాని పాట్లు పడటం అవివేకమే అవుతుంది.
దేశం ఆశ్చర్యపోయేలా ఏడేండ్లలోపే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ప్రశంసలందుకుంటూ దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేని కొన్నిశక్తులు కుయుక్తులు పన్నుతున్నాయి. అవి విఫలం కాక తప్పదు. ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం ఉవ్విళ్లూరుతున్న వైఎస్ షర్మిల అభాసుపాలు కాక తప్పదు. ఉద్యమ సమయంలో ఏనాడూ జై తెలంగాణ అనని షర్మిలకు ఆకస్మికంగా ఈ ప్రాంతంపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నిరాదరణతో ఏం చేయాలో పాలుపోక ఇక్కడ రాజకీయాలు చేయాలనుకోవడం వృథా ప్రయాస. ఇక్కడి ప్రజలు ఆనందంగా జీవిస్తుంటే, రాజన్న రాజ్యం అంటూ పడరాని పాట్లు పడటం అవివేకమే అవుతుంది. నీళ్లు- నిధులు- నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణలో ఇప్పుడు అవి కండ్లముందు నిజమైనవి. కేంద్రం నిధులు ఇవ్వకుండా మొండిచేయి చూపినా, సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో ప్రాజెక్టులు, పథకాలు చేపట్టడం ఇక్కడి ప్రజల అనుభవంలో ఉన్నాయి. అవినీతిరహితంగా, పారదర్శకమైన పద్ధతిలో ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగాలు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం లక్ష్యంతో కాళేశ్వరంతోపాటు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. వివిధ వర్గాలను సముచిత రీతిలో ఆదుకుంటున్నారు. వయోవృద్ధులతోపాటు నేత, గీత, బీడీ కార్మికులకు, బోదకాలు, ఒంటరి మహిళ లాంటి వర్గాలకు పింఛన్లు అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలను ఆదుకుంటున్నది. బడుగులకు విదేశీ విద్యకోసం రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్పులు అందిస్తున్నారు. వివిధ కుల ఆత్మగౌరవ భవనాలు నిర్మాణమవుతున్నాయి.
వివిధ వృత్తి కారులకు నైపుణ్య శిక్షణ, అధునాతన యంత్ర పరికరాలను సబ్సిడీలతో అందించడానికి సిద్ధపడుతున్నది. బీసీ/ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది. 13 ఫెడరేషన్ల ద్వారా ఆ వర్గాలను ఆదుకుంటున్నది. బీసీకులాల్లోని సంచార, అర్ధ సంచార, విముక్త, ఇతర జనాధిక్యం లేని కులాలకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో ఆర్థికంగా చేయూతనందిస్తున్నది. కులవృత్తులను ఆధునీకరించి పునర్జీవింపజేస్తున్నది. తెలంగాణ ప్రణాళికలు, పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో వివక్షకు నిదర్శనంగా.. 2009 ఎన్నికల నాటికి రాయలసీమ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు అదనపు తూముల నిర్మా ణం, పోలవరం కుడికాల్వ, పులిచింతల, రాయలసీమలో 250 టీఎంసీల జలాశయాల నిర్మాణం పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే వెలిగొండ టన్నెల్ నిర్మాణం ప్రారంభమైంది. కృష్ణానదిపై నాగార్జునసాగర్ కింద పులిచింతలను పూర్తిచేశారు. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ డ్యామ్ నిర్మాణం ప్రారంభించారు. కానీ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి గమనిస్తే.. భూసేకరణ జరగక, అటవీ అనుమతులు లేక, అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాక, నిధులు లేక తెలంగాణ వచ్చేదాకా అలాగే అసంపూర్తిగా ఉండిపోయాయి. ఇది నాడు రాజన్న రాజ్యంలో జరిగిన తంతు. కాగా ప్రాణహిత- చేవెళ్ల పథకాన్ని ప్రారంభించి, జలయజ్ఞంలో చేర్చి ఇక్కడి నాయకుల నోర్లు మూయించారు.
నాటి వైఎస్సార్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద మరో 10 గేట్లను నిర్మించి, 44 వేల క్యూసెక్కుల నీరును తరలించాలన్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. ఆయన ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుని బయటకు వచ్చింది. అది ఈ ప్రాంతం పట్ల టీఆర్ఎస్కు ఉన్న నిబద్ధత.
తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చినట్లు చెప్పుకొనే షర్మిల కొన్ని అంశాలపై తన వైఖరి స్పష్టం చేయాలి. 1. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై వైఖరి ఏమిటి? 2. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టిన అంశంపై వైఖరి ఏమిటి? 3. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఆపాలని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలపై వైఖరి ఏమిటి? 4. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావలసిన వాటా 550 టీఎంసీలు అన్న వాదనకు అనుకూలమా? కాదా? 5. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ ఏపీ కేంద్రానికి రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారా? 6. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తారా? 7. ఇక్కడున్న సంక్షేమ పథకాలన్నింటినీ అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని డిమాండ్ చేయగలరా? వీటిపై తమ వైఖరి ఏమిటో విస్పష్టంగా ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేదంటే తెలంగాణ ప్రజలు ప్రాంతేతరుల కుయుక్తులను గతంలో వలెనే పాతరేస్తారు.
డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్ రావు