మౌంట్ బాటెన్ చాలా తెలివైనవాడు, దూరదృష్టిగలవాడు. హిందుస్థానీల మనసులో ఏముందో కనుక్కునే వాడు. దేశ విభజనకు సర్దార్ పటేల్ ఆమోదించవచ్చునని పసిగట్టాడు. ఆయనను ఒప్పించడానికి ‘ఆక్రోటు లాగా పైన గట్టిగా ఉన్నా, లోన మెత్తని మనిషి’ అని ప్రశంసించేవాడు. పటేల్ను ఒప్పించిన తరువాత నెహ్రూపై దృష్టి సారించాడు.
నెహ్రూ కూడా పటేల్ బాట పట్టాడని తెలిసిన తరువాత నాకు చాలా బాధ కలిగింది. సర్దార్ పటే ల్ మరో కోణంలో కూడా ఆలోచించి ఉంటారు. ముస్లిం లీగ్ను సంతృప్తి పరచడం కోసం ‘బలహీనమైన కేంద్రం’ ఉండటానికి కాంగ్రెస్ అంగీకరించింది. ఈ క్రమంలో రాష్ర్టాలకు పూర్తి స్వయంప్రతిపత్తి లభిస్తుంది. కానీ మత, భాష, సంస్కృతీపరమైన తేడాలు విస్తృతంగా ఉన్న దేశంలో కేంద్ర ప్రభుత్రాన్ని బలహీనం చేయకూడదు. ‘విభజనకు అంగీకరించి ముస్లిం లీగ్ను కనుక వదిలించుకుంటే, బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు. దేశ సమైక్యతను కాపాడుకోవచ్చు’ అని పటేల్ భావించారు. అందుకే దేశ ఈశాన్య, వాయవ్య ప్రాంతాలలో చిన్న భాగాలను ముస్లిం లీగ్కు ఇచ్చివేయాలనే మౌంట్ బాటెన్ సలహా సర్దార్ పటేల్పై బాగా పనిచేసింది. ముస్లిం లీగ్తో కలిస్తే దేశ సమైక్యత, సుస్థిరత దెబ్బతింటుందని భావించారాయన. పటేల్ మాత్రమే కాదు, నెహ్రూ కూడా ఇదే తర్కంతో ఆలోచించారని నా అభిప్రాయం. దీంతో విభజన పట్ల గాంధీ వ్యతిరేకత కూడా తగ్గింది.
ఉమ్మడిగా దేశ విముక్తి సాధిద్దామనే అవగాహనతో మేం కాంగ్రెస్తో కలిసి స్వాతంత్య్ర పోరాటం సాగించాం. కానీ కాంగ్రెస్ నాయకులు కీలక సమయంలో మాకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. హిందుస్థాన్లో చేరుతారా, పాకిస్థాన్లోనా అనే రెఫరెండంను మా మెడపై కత్తిలా పెట్టారు. వారి బేరసారాలలో మమ్ములను పావులుగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని సంప్రదించేవారు. కానీ ప్రధానమైన స్వాతంత్య్రానికి సంబంధించిన చర్చలో మమ్ములను సంప్రదించకపోగా, కనీసం సమాచారం కూడా అందించలేదు. మా కాళ్లు చేతులు కట్టి ముస్లిం లీగ్కు అప్పగించారు. ఎన్నికలలో ముస్లింలీగ్ను మేం ఓడించాం. రెఫరెండం పెడితే పాకిస్థాన్ కావాలా, ఫక్తూనిస్థాన్ కావాలా అని ఉండాలి. కానీ హిందుస్థాన్లో చేరతారా, పాకిస్థాన్లోనా అని కాదు. కాంగ్రెస్ మాకు ద్రోహం చేసింది కనుక, హిందుస్థాన్లో చేరడం లేదు. మేం రెఫరెండంను బహిష్కరించాం. ‘కాంగ్రెస్ను వదిలిపెట్టండి, వారికి హిందుస్థాన్ ఇచ్చినప్పుడు, మీకు అంతకన్నా ఎక్కువే ఇస్తాం’ అని బ్రిటిష్ వారు అన్నారు. అయినా మేం కాంగ్రెస్ను వదలలేదు, వారే మమ్మల్ని వదిలి పెట్టారు. సర్దార్ పటేల్, రాజగోపాలా చారిపై మాకు ఫిర్యాదు లేదు. మా ఫిర్యాదు గాంధీ, నెహ్రూ పైనే. వారితో వీరు ఏకీభవించారు కనుకనే ఈ ఫిర్యాదు. దేశ విభజన తప్ప మరే మార్గం లేని పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ ఆ పరిస్థితులను సృష్టించిందెవరు? వారే కదా? హిందుస్థాన్ విభజనకు వారు అంగీకరించకపోతే, హిందుస్థాన్, హిందువులు ఇంత రక్తపాతం అనుభవించక పోయేది. మౌలానా ఆజాద్ మాటల్లో చెప్పాలంటే- ఇదంతా పెద్ద కుట్ర, నమ్మక ద్రోహం.
(అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ రాసిన ‘మై లైఫ్ అండ్ స్ట్రగుల్’ పుస్తకం నుంచి)