హుజూరాబాద్లో జరిగిన రాజకీయ క్రీడలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటైన తీరు పతన రాజకీయాలకు పరాకాష్ట. ఏదో సాధించామని రంకెలేస్తున్న వారు గత ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలె. అవకాశవాద రాజకీయాలతో అపవిత్ర జట్టుకట్టడం దొంగదెబ్బ తీయటమే. ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులు ఎప్పుడో ఓ సారి ఫలిస్తాయి కానీ ఎప్పుడూ ఆ పాచిక పారదనేది గ్రహించాలె.
త్యాగాల పునాదుల మీద టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్నది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పదవులను గడ్డిపోచల్లా విసిరేసి ఉద్యమ పతాకం ఎగురవేశారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో అందరిలాగే ఈటల ఒకరు. ఆ క్రమంలో ఉద్యమం కోసం పలుమార్లు కేసీఆర్తో పాటు పార్టీ నేతలు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమ దీప్తిని నిలిపారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఎన్నో చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకున్నది. కేసీఆర్ దీక్షాదక్షతతో రాష్ట్రం సాధించుకున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ఎంతో ముందుకువెళ్లింది. నాడు ఉద్యమంలో ఏ కలలు కన్నామో అవన్నీ ఒక్కొక్కటిగా సఫలమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ మాగాణి పచ్చ తోరణంతో స్వాగతం పలుకుతున్నది. రైతుల ఇంట పంట రాసులు దేశానికి అన్నం పెడుతున్నాయి.
కరెంటు సమస్య పూర్తిగా తీరింది. 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణే. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికి ఆదర్శమైనాయి. హుజూరాబాద్లో కానీ, ఇతర నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ముందుకుసాగుతున్న ‘దళిత బంధు’ పథకం గొప్పది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేది. ఉద్యమంలో ఎంతోమంది నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణ కోసం నిద్రాహారాలు మాని కొట్లాడారు. కొందరు నాయకులు అటూ ఇటు కావచ్చు. గుర్తింపు ఇస్తలేరనో, అక్రమాలకు అధినేత సహకరించడం లేదనో అధినేతపై రాళ్లు విసరడం మొదలుపెట్టవచ్చు. కానీ కార్యకర్తలు పార్టీని ప్రజల హృదయాల్లో నిలుపుతున్నారు.
మొన్న దుబ్బాక, నిన్న హుజూరాబాద్, రేపు ఇంకొకటి అని పగటి కలలు కంటూ.. ‘వెర్రి తలలకు నాలుకలెక్కువ’ అన్న చందాన మొరుగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన 60 వేల ఓట్లు ఎక్కడికి పోయాయి. ఈటల, రేవంత్ రహస్య ఒప్పందం బట్టబయలైంది. అబద్ధాలు, గోల్మాల్ లొల్లితో పబ్బం గడుపుకోవాలనేది అత్యాశ. ఈ మధ్య ఆకుకు అందని, పోక కు పొందని చిల్లర రాజకీయాలు ఎక్కువయ్యాయి. హుజూరాబాద్ ఎన్నికతో ఎవరినో బలిపీఠం ఎక్కించారని విష ప్రచారానికి దిగుతున్నారు. ఇదంతా ఒంటె పెదవులకు నక్క ఆశపడిన తీరు తప్ప మరేం కాదు. సిద్ధాంత బలం, సాంస్కృతిక పునాది గల ఉద్యమపార్టీని ఈ పిల్లి శాపనార్థాలూ ఏమీ చేయలేవు. ప్రజల అండదండలతో అప్రతిహతంగా ముందుకుసాగుతుం ది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్ధమై మరింత నిబద్ధతతో కృషిచేస్తున్నది.
(వ్యాసకర్త: చిటుకుల మైసారెడ్డి , 94905 24724, జర్నలిస్టు)