‘రెండు ప్రపంచయుద్ధాలు మానవాళిపై మోపిన అంతులేని వ్యధను చూసిన మేము, యుద్ధం కలిగించే వినాశనం నుంచి రాబోయే తరాలను కాపాడుకోవాలని, మౌలిక మానవహక్కుల పట్ల, స్త్రీ-పురుష, చిన్న-పెద్ద దేశాల సమానహక్కుల పట్ల దృఢనిశ్చయంతో ఉండాలని, సామాజిక అభివృద్ధిని, మానవ జీవన ప్రమాణాలను పెంపొందించాలని.. ఐక్యరాజ్యాల ప్రజలమైన మేము నిర్ణయం తీసుకున్నాం’ అంటూ 24 అక్టోబర్ 1945న ఐక్యరాజ్యసమితి తన సమున్నత లక్ష్యాన్ని చాటుకున్నది. ఏడున్నర దశాబ్దాలకుపైగా ఉన్న చరిత్రను ఒకసారి పునశ్చరణ చేసుకుంటే.. గొప్ప విజయాలు ఉన్నట్లుగానే.. ఘోర అపజయాలు కూడా కనిపిస్తాయి. మరో ప్రపంచయుద్ధం రాకుండా చూడటం ఐరాస సాధించిన అతిపెద్ద విజయం కాగా.. అనేక దురాక్రమణలు, ఆర్థిక అంతరాలు, పర్యావరణ విపత్తు ఐరాస ఖాతాలో అతిపెద్ద వైఫల్యాలు.
ఐరాస ఏర్పడిననాటికీ, నేటికీ ప్రపంచం బాగా మారింది. నాడు అనేక దేశాలు వలస పాలన నుంచి విముక్తి సాధించి స్వతంత్ర రాజ్యాలయ్యాయి. ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. అయితే ఇది పూర్తిగా ఐక్యరాజ్య సమితి ఘనత కాదు. చరిత్ర పరిణామ క్రమం. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం కూడా కొంత వరకు వర్ధమాన దేశాల ప్రాధాన్యాన్ని పెంచింది. సోవియట్ యూనియన్ కుప్పకూలి ఏకధ్రువ ప్రపంచం ఏర్పడినప్పుడు ఐరాస పాత్ర బలహీనపడింది. 1990 దశకం నుంచీ ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక కూటములే ప్రపంచాన్ని శాసించడం మొదలైంది. బహుళ జాతి సంస్థల కార్యకలాపాలతో దేశాల సార్వభౌమత్వమే ప్రశ్నార్థకమైంది. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనపడ్డాయి. వాటితోపాటే ఐక్యరాజ్య సమితి కూడా తన నైతిక శక్తిని కోల్పోయింది. ఐక్యరాజ్య సమితిని వీలైనంత నిర్వీర్యం చేయాలన్న ట్రంప్ వంటి నాయకుల సంఖ్య పెరిగిపోయింది.
ప్రపంచమంతా అణ్వాయుధాలు పేరుకుపోయాయి. మరోవైపు ఉగ్రవాదం వణికిస్తున్నది. ప్రపంచం మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పరిస్థితుల్లోకి జారిపోతున్నదనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి మరింత క్రియాశీలంగా ఉండటం అవసరం. ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకున్నప్పుడే ప్రపంచశాంతికి పూచీ లభిస్తుంది. ఐక్యరాజ్యసమితిని ప్రజాస్వామీకరించడానికి శాంతికాముకులు కృషి చేయాలి. భద్రతా మండలిని విస్తృతం చేయాలనే ప్రతిపాదన ఉన్నది. ఇది వెంటనే జరగాలి. దీనివల్ల భారత్ వంటి దేశాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. అయితే మొత్తంగా భద్రతా మండలి ప్రాధాన్యాన్ని తగ్గించడం మంచిది. సర్వప్రతినిధి సభ కేంద్రంగానే ఐరాసలో నిర్ణయాలు జరగాలి. భారత్ వంటి వర్ధమాన దేశాలు ఈ దిశగా కృషి జరుపాలి.