సామాజికోద్యమాలు ప్రజల జీవితాల్లో మేలిమిని కాంక్షిస్తూ ఉద్భవిస్తుంటాయి. జనహితం కోరే ప్రభుత్వాలు సామాజికోద్యమాల స్ఫూర్తిని తమ పాలనా ప్రణాళికలకు అనుసంధానిస్తుంటాయి. అప్పుడే సంస్కర్తలు ఆశించిన సమాజం సాక్షాత్కరిస్తుంది. సరిగ్గా రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘దళితబంధు’ ఫథకం ఇటువంటిదే. ఇది సంక్షేమ పథకమే కాదు, అభివృద్ధి పథకం కూడా. ఈ పథకం కింద విడతల వారీగా రాష్ట్రంలోని దళితులందరికీ ఒక్కో కుటుంబానికి పదిలక్షల రూపాయిల నగదు బదిలీకానున్నది.
దళితబంధు ద్వారా ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలోని దళితకుటుంబాలకు సాయం అందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గ దళితులకూ అందడం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘దళితబంధు’ మీద మీడియాలో విపరీత చర్చ, వాదోపవాదాలు జరుగుతున్నాయి. హుజూరాబా ద్ ఉప ఎన్నికల కోసమేనని విపక్షాలు గోలచేస్తున్నాయి. నమ్మి ఓట్లేసిన ప్రజల్లో వీలున్నప్పుడల్లా ఏదో ఒక వర్గానికి ఏదో ఒక రూపంలో మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానిదైతే, తామివ్వలేనిది కేసీఆర్ ఇస్తున్నందుకు తట్టుకోలేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే కుటిల వైఖరి ప్రతిపక్షాలది.
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయని ఓ మహత్తర కార్యక్రమాన్ని మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టి ముందుకెళ్తూవుంటే సమర్థించాలె, సలహాలు సూచనలు ఇవ్వాలె. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలె. కానీ అపశకునాలు పలక డం అపార్థాలతో అడ్డుపడటం విజ్ఞత కాదు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ నిజంగానే రాష్ట్రంలోని దళితుల అభ్యుదయానికి ఓ ఉద్దీపన, ఒక వరం, ఒక భూరి మద్ద తు ‘దళిత బంధు’ పథకం. ‘దళితసాధికారత’ అనే మాట లు రాజకీయ భాషాపటాటోపం కాకుండా అభివృద్ధి పరంపర కార్యరూపం దాల్చాలె. ఈ తాత్త్విక కోణంలోం చి పురుడు పోసుకున్నదే ‘దళిత బంధు’. ఇప్పుడు మనం కోరుకోవలసింది ఈ పథకం ఆఖరికుటుంబం వరకూ అందాలని. అందిన ప్రతి కుటుంబం ‘దళిత బంధు’ పథకంతో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలని.
ఎవరెన్ని చెప్పినా జీవితాల మనుగడకు అర్థబలమే అంతిమ బలం. దళిత బంధు ద్వారా అందే నగదు దళితులకు ఇదివరకు లేని ధైర్యాన్నీ ఆత్మ విశ్వాసాన్నీ ఇస్తుం ది. శాశ్వత రుగ్మతలై పీడిస్తున్న ఆర్థిక అసమానత లు వైదొలగి, వృత్తి వ్యాపార వ్యవహార దక్షత దళిత శక్తికి చేర్పు కాగలదు. సంక్షేమ పథక లక్ష్యాలైన ‘ఉపాధి కల్పన, గుణాత్మక విద్య, జీవన ప్రమాణాల పెంపు’ దళితులకు అందిరాగలవు.
దళిత యువతకు ఎకానమీ పరంగా చూస్తే ‘దళిత బంధు’ ఒక స్కేల్ అప్ ప్రోగ్రాం. దళితబంధుతో గ్రామీణ స్థాయిలో తయారీ రంగం ఊపందుకోనున్నది. ‘దళితబంధు’ ద్వారా ప్రభుత్వం డబ్బును అందజేస్తుందే తప్ప మరే ఆంక్షలు పెట్టదు. రానున్న రెండు మూడేండ్లలో అందరికీ అందేట్టు చూడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అండ గా ఉందాం. సుశిక్షితులు లేనిచోట్ల కుటుంబాల చెంత పల్లెల్లో నిలబడి డబ్బునెట్లా సద్వినియోగం చేసుకోవా ల్నో చెబుదాం. అట్లా కాకుండా, సమున్నత సామాజిక మార్పునాశించి దళితబంధుకు చారిత్రకంగా తెరతీసిన ప్రభుత్వానికి ఆటంకాల పెనగడి వేస్తే అది ఏ పార్టీ అయి నా, ఏ నాయకుడైనా పెండ్లికి వచ్చి చావుబాజా మోగించడం లాంటిదే.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటే చేస్తాడు. ఇందుకు రైతు బంధు, రైతు బీమా , కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు మొదలైనవే ఉదాహరణ. ప్రజాకవి గోరటి వెంకన్న పరవశించి పాడినట్టు.. ‘దళిత బంధు ఫథకం వెలివాడల్లో దేదీప్యమై వెన్నెలే కురియగలదు’. ఆగామి కాలాల్లో మిగతా రాష్ర్టాలకు ఆదర్శం కాగలదు.
(వ్యాసకర్త: డాక్టర్ బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, రామన్నపేట)