తైవాన్ ప్రాంతంలోకి నాలుగు రోజుల పాటు దాదాపు నూటా యాభై సార్లు సైనిక విమానాలను పంపిస్తూ బెదరగొడుతున్న చైనా తీరు తీవ్ర ఆక్షేపణీయం. చైనా ఒత్తిడి మూలంగా తైవాన్కు అంతర్జాతీయ దౌత్య గుర్తింపు దక్కకపోవచ్చు. కానీ భౌగోళికంగా, రాజకీయంగా విడిగా ఉండటమే కాకుండా, తైవాన్ తనదైన అస్తిత్వాన్ని సంతరించుకున్నది. చైనా రాజకీయ వ్యవస్థకు భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నెలకొల్పుకున్నది. చైనాలో ఉండాలా, విడిగా కొనసాగాలా అనేది అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారు. ఆధునిక యుగంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడమే తప్ప దురాక్రమణలకు తావుండకూడదు. కానీ తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తమలో కలిపేసుకుంటామని చైనా బహిరంగ ప్రకటనలు చేయడమే కాకుండా, తరచూ బెదిరింపులకు దిగుతున్నది.
వలస పాలనల నుంచి అనేక జాతులు విముక్తమై స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. గతంలో కొంతకాలం తమ సామ్రాజ్యంలో భాగం కాబట్టి ఇప్పుడు వాటిని కబళిస్తామంటే అంతర్జాతీయ సూత్రాలు అంగీకరించవు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో అప్పటివరకూ ఆ దేశం ఆక్రమణలో ఉన్న తైవాన్ను చైనాలోని కొమింగ్టాంగ్ పార్టీ తన ఏలుబడిలోకి తెచ్చుకుంది. 1949లో చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. దీంతో కొమిన్టాంగ్ పాలకులు తైవాన్ను కేంద్రంగా చేసుకొని తమదే అసలైన చైనా అని ప్రకటించుకున్నారు. కమ్యూనిస్టుల పాలనలో ఉన్నదే అసలైన చైనా అయినప్పటికీ, అమెరికా కూటమి తైవాన్ వైపే మొగ్గింది. 1979లో సోవియెట్ యూనియన్కు వ్యతిరేకంగా చైనాతో స్నేహం చేసిన అమెరికా, తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకున్నది. ‘ఒకే చైనా’ విధానం (తైవాన్ అస్తిత్వాన్ని గుర్తించకపోవడం) అనుసరిస్తామని హామీ ఇచ్చింది. కానీ తైవాన్ భద్రత కోసం భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నది. శక్తిమంతమైన చైనా ఒత్తిడి మూలంగా తైవాన్కు అంతర్జాతీయ గుర్తింపు లభించడం లేదు.
తైవాన్ విషయంలోనే కాదు, చైనా తన చుట్టూరా దురాక్రమణలను సాగించింది. 1949లో టిబెట్ను కబళించింది. అక్కడికి చైనీయుల వలసలను ప్రోత్సహిస్తూ, టిబెటన్లను అణచివేస్తున్నది. చైనా పాలనను నిరసిస్తూ అనేక మంది టిబెట్ జాతీయులు బలిదానాలు చేస్తున్నారు. మరోవైపు వాయువ్య ప్రాంత జిన్జియాంగ్లో ప్రజలను చైనా అణిచివేస్తున్నది. హాంకాంగ్ను బ్రిటన్ నుంచి వెనక్కి తీసుకున్నప్పుడు అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థను గౌరవిస్తామని, ఒకే దేశం రెండు వ్యవస్థలు అనే సూత్రాన్ని పాటిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్కడి స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నది. చైనా ప్రజలు కూడా కమ్యూనిస్టు ఏక పార్టీ నిరంకుశత్వంతో తల్లడిల్లి పోతున్నారు. చైనా దురాక్రమణ విధానాలను సభ్య ప్రపంచం ఖండించాలి. తైవాన్, హాంకాంగ్, టిబెట్ తదితర ప్రాంతాల ప్రజలకు సంఘీభావం ప్రకటించాలి.