జమ్మూకశ్మీర్పై లోక్సభ బుధవారం రెండు కీలక బిల్లులను ఆమోదించింది. అందులో మొదటిది జమ్మూ, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, రెండోది జమ్మూ, కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు. జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల్లో అసెంబ్లీ సీట్లు పెంచడం, అందులో కొన్నింటిని రిజర్వ్ చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశాన్ని కేంద్రం హోం మంత్రి అమిత్ షా ప్రస్తావించడం గమనార్హం. ఆయన పీవోకే భూ భాగానికి కూడా అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేస్తున్నట్టు చెప్పారు. అందుకు కారణం అది కూడా మనదేనని అనడం, అంతటితో ఆగకుండా ఆ భూ భాగం పాక్ చేతుల్లోకి పోవడానికి నాటి ప్రధాని నెహ్రూ ఘోర తప్పిదమే కారణమని అనడంపై వివాదం తలెత్తింది. షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా పీవోకేను తీసుకురమ్మని హోంమంత్రికి సవాల్ విసిరారు. ఈ చర్చ పాలక, విపక్షాల మధ్య చారిత్రిక అంశాలపై గల విభేదాలను ప్రముఖంగా ముందుకు తెచ్చింది.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమిత్ షా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. పీవోకేను పాకిస్థాన్ కొన్నాళ్లుగా అజాద్ కశ్మీర్గా స్వయంప్రతిపత్తితో కొనసాగించి తర్వాత పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో అక్కడి అసెంబ్లీ సీట్ల గురించి మాట్లాడటం ఏమిటనేది ఇక్కడ ప్రశ్న. ఆ భూ భాగం మాదేనన్న అంశంపై భారత్లో సాధారణంగా అయితే భిన్నాభిప్రాయాలకు తావులేదు. కానీ తాము మాత్రమే అలా అనగలుగుతున్నామనే ధోరణి కేంద్ర హోంమంత్రి మాటల్లో వ్యక్తమైంది. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ పుల్వామా ఉగ్రదాడిని, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నట్టుగానే పీవోకే సమస్యను ఈసారి వాడుకోవాలని చూస్తున్నదా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
స్వాతంత్య్రంతోపాటుగా సంక్రమించిన కశ్మీర్ సమస్య రావణకాష్టంలా రాజుకుంటూనే ఉన్నది. ఆ ప్రాంతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం పెచ్చరిల్లి అనేక మందిని బలిగొనడం ఓ చారిత్రక విషాదం. కశ్మీర్ సంస్థానాధీశుడైన రాజా హరిసింగ్ భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా వచ్చిన ఆర్టికల్-370ని మోదీ ప్రభుత్వం నాలుగేండ్ల కిందట రద్దుచేసింది. అదేవిధంగా జమ్మూకశ్మీర్ రాష్ర్టాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టింది. అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ, కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దఖ్ మారిపోయాయి. అయితే అందులో దేనికీ ఇప్పటివరకు ప్రజాప్రాతినిధ్య పాలన రాలేదు. రద్దుకు ముందు తర్వాత సుమారు ఆరేడేండ్లుగా ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికలే జరుగలేదు. తాజాగా తెచ్చిన చట్టాలతో నియోజకవర్గాలూ, రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వచ్చిన మాట వాస్తవం. ఇకనైనా వీలైనంత త్వరలో ఎన్నికలు జరిపితే బాగుంటుంది. శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా కశ్మీర్లో సుస్థిరత అందుకు సహకరించాల్సి ఉంటుంది.